* ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి
ఏలూరు: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో సమీక్షించిన అనంతరం ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడ్డాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కేంద్రాన్ని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంగళవారం సందర్శించారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందుతున్న సేవలను ఎంపీ అడిగి తెలుసుకున్నారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధిని విస్మరించిందని ఎంపీ ఆరోపించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై దృష్టి సారించినట్లు ఎంపీ స్పష్టం చేశారు. అత్యాధునిక వైద్య సేవలు అందించడానికి వీలుగా ఆసుపత్రికి పరికరాలు సమకూరుస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ప్రధానంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందించడానికి తాను వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటున్నట్టు ఎంపీ వెల్లడించారు. తలసేమియా రోగులకు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చక్కటి సేవలు అందుతున్నాయని ఎంపీ పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు బాగున్నాయని అభినందించారు. ఆస్పత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఎంతో కృషి చేస్తున్నారని, ఆయనకు తన వంతు సహకారం అందిస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రకటించారు.