* విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి
* లోకేశ్ పేరు మీద అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
* రాష్ట్రాభివృద్ధిలో మంత్రి లోకేశ్ పాత్ర కీలకం
* ఆయన పేరు వింటేనే గత పాలకుల వెన్నులో వణుకు
* రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తాం
: మంత్రి సవిత హెచ్చరిక
విజయవాడ : రాష్ట్రాభివృద్ధిలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పాత్ర అలుపెరగని కృషి చేస్తున్నారని, తండ్రికి తగ్గ తనయుడిగా పెట్టుబడుల సేకరణలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. మంత్రి నారా లోకేష్ పేరు వింటే గత పాలకుల వెన్నులో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని, భయభ్రాంతులకు గురి చేసేవారిని ఉక్కు పాదంతో అణచి వేస్తామని హెచ్చరించారు.
మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను మంత్రి సవిత శుక్రవారం దర్శించుకుని ఆయన గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్బంగా తనను కలిసి విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధికి మంత్రి లోకేష్ అవిరళ కృషి చేస్తున్నారన్నారు. దావోస్ సహా విదేశాల్లో పర్యటిస్తూ ఏపీకి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల కాలంలో రూ.25 లక్షల కోట్లకుపైగా నిధులు ఏపీకి రాబట్టారన్నారు.
విద్య, ఐటీ శాఖల మంత్రిగా లోకేష్ సేవలు అభినందినీయమన్నారు.పతనమైన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతూ, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం, తల్లికి వందనం పథకం అమలు చేసి అందరికీ విద్యను అందజేయడంలో విజయవంతమయ్యారన్నారు. మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా 150కి పైగా కేసులు వేసినా వాటన్నింటినీ అధిగమించి 16 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశారన్నారు.
ఈ ఏడాది మరో డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతున్నారన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యామిత్ర కిట్లు అందజేశారన్నారు. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులను ఆకలి దప్పులతో మాడిస్తే, వారి కడుపు నింపేలా మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేసిన ఘనత మంత్రి లోకేశ్ దేనన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల మాదిరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెగా పేరెంట్స్ మీటింగ్ లు నిర్వహించి, విద్యా వ్యవస్థలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములను చేశారన్నారు.
లోకేష్ పేరు వింటే వారి వెన్నులో వణుకు
యువ గళం పాదయాత్రతో గత ప్రభుత్వ రాక్షస పాలనను అంతమొందించిన ఘనత మంత్రి లోకేష్ దేనని మంత్రి సవిత కొనియాడారు. ఆయన పేరు వింటేనే ఆ పాలకుల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని, భయభ్రాంతులకు గురి చేసేవారిని ఉక్కు పాదంతో అణచి వేస్తామని హెచ్చరించారు. సకల విద్యలకు దేవత అయిన సరస్వతీ దేవి పుట్టిన రోజున మంత్రి నారా లోకేష్ జన్మదినం జరుపుకోవడం ఆనందకరమన్నారు.
ఏపీ సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం, ప్రజల కోసం వైసీపీ రాక్షసులతో పోరాడుతున్న మంత్రి నారా లోకేష్ కు మరింత శక్తినివ్వాలని ఆ లోకమాత దుర్గా దేవిని కోరుకున్నట్లు మంత్రి సవిత తెలిపారు. అంతకు ముందు దుర్గమ్మ దర్శనానికి వచ్చిన మంత్రి సవితకు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఈవో శీనా నాయక్, పాలక మండలి సభ్యులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. వేదాశ్వీరచన మండపంలో మంత్రి సవితను వేదపండితులు వేదాశ్వీరచనాలు, తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు.
వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసానికి వచ్చిన చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు పెన్నులను మంత్రి సవిత పంపిణీ చేశారు. వసంత పంచిత సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోడానికి వచ్చారు. క్యూలైన్లో ఉన్న భక్తులను మంత్రి సవిత ఆప్యాయంగా పలుకరించారు. దేవస్థానంలో చేసిన ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. వసంత పంచమి సందర్భంగా చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు పేరేపి ఈశ్వర్, యర్రబోతు రమణ, పలువురు డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు