– ఇందిరమ్మ ఇండ్ల కాల్ సెంటర్కు మంత్రి పొంగులేటి ప్రారంభం
– టెలికాలర్ గా ప్రజల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి
– టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఫోన్ 1800 599 5991
హైదరాబాద్ :- కాల్ సెంటర్ ప్రారంభోత్సవం తర్వాత రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి – ప్రజలకు మధ్య జరిగిన సంభాషణ.
హలో నేను హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని మాట్లాడుతున్నాను… మీరు ఎక్కడినుంచి మాట్లాడుతున్నారు? మీ సమస్య ఏమిటి ? చెప్పండి.
ఫోన్ చేసిన వ్యక్తి :- సర్ మాది వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం .. బేస్ మెంట్ వరకు మా ఇల్లు పూర్తి అయ్యింది. ఇంకా బిల్లు రాలేదు…
మంత్రి గారు:- బేస్మెంట్ పూర్తయి ఎన్నిరోజులు అవుతుంది.. మీరు బేస్ మెంట్ పూర్తయిన ఫోటో అప్ లోడ్ చేశారా?
ఫోన్ చేసిన వ్యక్తి :- చేశాము సార్,
మంత్రిగారు:- మీ ఆధార్ నెంబర్ చెప్పండి.. (మంత్రి స్వయంగా ఆధార్ నెంబరును కంప్యూటర్ లో ఎంట్రీ చేసి వివరాలు పరిశీలించారు. మీ బిల్లు ఇఇ గారి వద్ద ఉంది. వచ్చే సోమవారం నాడు మీకు లక్ష రూపాయల బిల్లు మీ బ్యాంకు అక్కౌంట్ లో జమ అవుతుంది. మీ ఊరిలో ఎన్నిఇండ్లు మంజూరయ్యాయి. ఇండ్ల నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి. ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉన్నారా? అని పలు వివరాలను ఫోన్ చేసిన వ్యక్తిని అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత…
మరో ఫోన్ కాల్ :- మాకు హైదరాబాద్ లో ఇండ్లు ఎప్పుడు ఇస్తున్నారు..మాకు వెరిఫికేషన్ కూడా అయిపోయింది.. అని ఫోన్ చేసిన వ్యక్తి అడగడంతో
మంత్రిగారు :- నేను మీ హౌసింగ్ శాఖ మంత్రినే మాట్లాడుతున్నాను, ఇప్పుడే కొద్ది సేపటి క్రితం ఇందిరమ్మ ఇండ్ల కాల్ సెంటర్ ను ప్రారంభించాను.
ప్రజల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్కు నేను స్వయంగా అటెండ్ అవుతున్నాను అని చెబుతూ హైదరాబాద్ లో నివాస స్థలాల కొరత కారణంగా కొంత ఆలస్యమైంది..త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం కనుగొని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అని హామీ ఇచ్చారు.
కాల్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ను, హెల్ప్ డెస్క్ ను గురువారం నాడు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాల్ సెంటర్ ఫోన్ నెం. 1800 599 5991 ను ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ కాల్ సెంటర్ ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు పనిచేస్తుందని ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు, వాటిని పరిష్కరించడంలో చొరవ చూపడానికి ఈ కాల్ సెంటర్ ను వినియోగించుకోవచ్చునన్నారు.
లబ్ధిదారుల ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు ఆధారంగా వివరాలను పరిశీలించి సమస్యను పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటారని నిర్ణీత గడువులోగా బిల్లులు జమ కాకపోవడం, ఎక్కడైనా ఎవరైనా సిబ్బంది ఫోటోలను అప్ లోడ్ చేయడంలో ఆలస్యం చేయడం, ఇతర సాంకేతిక సమస్యలు, అవినీతి ఆరోపణలు తదితర అంశాలపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వాటిని సంబంధిత అధికారుల వద్దకు తీసుకెళ్లి చర్యలు తీసుకుని లబ్ధిదారులకు కూడా ఆ వివరాలను తెలియచేస్తారని వివరించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ, పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని, ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా మంచి ఫలితాలు సాధించామని, కృత్రిమ మేధ ( ఎఐ) ను కూడా విరివిగా వాడుతున్నామని, ఈ కాల్ సెంటర్ ద్వారా లబ్ధిదారులకు మరింత చేరువ అవుతున్నామని మంత్రిగారు పేర్కొన్నారు. అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం 5 లక్షల రూపాయల సబ్సిడీతో పేదలకు ఇండ్ల నిర్మాణానికి సహాయం అందిస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.