– హమీల అమలుకు కేటాయింపులు లేవు
– అప్పులపైనా కూటమి పార్టీల అబద్దాల కుట్ర బయటపడ్డాయి
– మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం
తాడేపల్లి: రాష్ట్ర బడ్జెట్ బుక్ చూస్తే కలర్ ఎక్కువ. కంటెంట్ తక్కువ కనిపిస్తోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు బడ్జెట్ లో చేసిన అరకొర కేటాయింపులు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేసిన అప్పులు అంటూ చేసిన దుష్ప్రచారం బడ్జెట్ లెక్కల సాక్షిగా బయటపడిందని అన్నారు.
రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వీటిల్లో బడ్జెట్ అంచనా వ్యయం రూ.3,22,359 కోట్లు, రెవెన్యూ రాబడి రూ.2,17,976 కోట్లు, అప్పు రూ.1,04,382 కోట్లుగా చూపించారు. ఇది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి సందర్భంలోనూ గత ప్రభుత్వం అంటూ వైయస్ఆర్ సీపీపై దూషణలకు పాల్పడుతోంది. ఈ బడ్జెట్ ప్రసంగం చూస్తే గత ప్రభుత్వం గురించి 25 సార్లు, విధ్వంసం గురించి మరో 10 సార్లు ప్రస్తావించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసి పదినెలలు అవుతోంది, ఇకనైనా ప్రజలకు ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీల అమలు గురించి ఇకనైనా చెప్పాల్సిన అవసరం లేదా? ఎన్నికలు జరిగిందే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై. ప్రతి ఇంటికి తిరిగి హామీలను పదేపదే చెప్పి ప్రజలను నమ్మించారు.
సూపర్ సిక్స్ హామీల అమలును చూస్తే తొలి ఏడాది బడ్జెట్ లో ఎలా మొండిచేయి చూపించారో అలాగే ఈ బడ్జెట్ లో కూడా చేశారు. దీపం పథకం కింద అర్థదీపం, పావుదీపం అమలు చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం చేసినంత అప్పు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఒక్క ఏడాదిలోపే రూ.1.19 కోట్లు అప్పులు చేశారు. 1995 నాటి పరిస్థితిని ఉదహరిస్తూ, జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ఆర్థిక మంత్రి వాపోయారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో 1995లో మిగులు బడ్జెట్ ఉంది. ఏ లెక్కల ప్రకారం ఆర్థిక మంత్రి అలా చెప్పారో అర్థం కావడం లేదు.
గత బడ్జెట్ లో 63 పేరాల్లో కేవలం రెండు పేరాల్లో ఒక లైన్ లో ‘సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ – ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించిందని’ రాశారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా ఈ పథకం కింద లబ్ధి చేకూరిందా? అప్పుల గురించి మాట్లాడుతూ 2024, మార్చి 31 నాటికి అప్పు 3,75,295 కోట్లు ఉంది. ప్రభుత్వ అప్పు రూ. 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్స్ లైబిలిటీస్ రూ. 80,914 కోట్లు, కార్పోరేషన్ అప్పులు రూ.2,48,677 కోట్లు, సివిల్ సప్లయిస్ రూ.36,000 కోట్లు, విద్యుత్ సంస్థలు రూ.34,267 కోట్లు, రూ.1,13,000 కోట్లు కాంట్రాక్టర్ లకు , ఎంప్లాయిస్ కు రూ.21,000 కోట్లు, మొత్తం కలిపి రూ.9,74,556 కోట్లు అప్పులు ఉన్నాయని ముఖ్యమంత్రి తన ప్రజంటేషన్ లో వెల్లడించారు. అంతకు ముందు వైయస్ఆర్సీపీ రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఎలా మాపై విషప్రచారం చేశారు?
సంపద సృష్టి అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. పదినెలల్లో మైనస్ 0.01 శాతం వృద్ధిలో ఉన్నారు. వైయస్ఆర్ సీపీ కి పాలన చేతకాదు అంటూ విమర్శలు చేశారు. మరి ఈ పదినెలల్లో మీరు చేసింది ఏమిటి? స్థూల ఉత్పత్తి బాగుంటే, రెవెన్యూ రాబడిలో వృద్ది కనిపిస్తుంది. 2024లో అంటే ఏప్రిల్ నుంచి 2025 జవనరి వరకు పదినెలలు లెక్కేస్తే రెవెన్యూ రాబడి మైనస్ లోకి వచ్చింది? 2023 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకు వైయస్ఆర్సీపీ పాలనలో సాధించిన రెవెన్యూ రూ. 72,872 కోట్లు. కూటమి పాలనలో పది నెలల్లో రూ.72,864 కోట్లు వచ్చింది. అంటే మా కన్నా ఎనిమిది కోట్లు తక్కవగా రెవెన్యూ వచ్చింది. ఇదేనా మీ సంపద సృష్టి?
నీతి అయోగ్ ప్రకారం 2015-19 వరకు 12.9 శాతం రెవెన్యూ రాబడిలో సీఎజీఆర్ ఉంది. 2020-23 వరకు 14.1 శాతం పెరిగింది. దీనిని బట్టి ఎవరు సంపదను సృష్టిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంటిపన్నులు పెంచి రెవెన్యూ పెంచుకోవాలని చూస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుకు బడ్జెట్ లో చేసిన కేటాయింపులు చూస్తే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అర్థమవుతుంది. గత బడ్జెట్ లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ప్రకటించినా దానిని అమలు చేయలేదు. యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3వేల భృతి అన్నారు, స్కూల్ కు వెళ్లే విద్యార్థికి రూ.15వేలు, ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం, అర్హులైన మహిళలకు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఏ హామీకీ సరైన కేటాయింపులు లేవు.
2025-26లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్నదాతా సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు కేటాయిస్తున్నామని చెప్పారే తప్ప ఎంత దీనికి కేటాయిస్తున్నారో ప్రకటించలేదు. తల్లికి వందనం పైన కూడా అలాగే చెప్పారు. నిజంగా వీటిని అమలు చేసే ఉద్దేశం ఉంటే దానిపైన ఎందుకు స్పష్టత ఇవ్వలేదు? తల్లికి వందనంకు బడ్జెట్ బ్రీఫ్ లో రూ.9,407 కోట్లు చూపించారు. కానీ వాస్తవంగా లెక్కలను బట్టి దాదాపు రూ.12,450 కోట్లు అవసరం. కానీ కేటాయించింది రూ.8,278 మాత్రమే. దీని ప్రకారం కేవలం 55 లక్షల పిల్లలకే తల్లికి వందనం అందుతుందని అర్థమవుతోంది.
అంటే వారికి ఎగ్గొట్టేస్తున్నారు. అప్పు చూస్తే జనవరి నెలాఖరు నాటికి రూ.82,738 కోట్లు అని చూపించారు. కానీ బడ్జెట్ బుక్ లో మాత్రం అప్పు కేవలం రూ. 73,362 కోట్లు అని రాశారు. మూలధన వ్యయం రూ.24,072 కోట్లు అని గత బడ్జెట్ చెప్పి, ఖర్చు పెట్టింది ఎంతా అని చూస్తే రూ.10,850 కోట్లు మాత్రమే. అంటే ఈ రెండు నెలల్లో రూ.13000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారా?
తాజా బడ్జెట్ లో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ధాన్యంకు గత ఏడాది రూ. 1740 క్వింటా రేటు ఉంటే, ఈ ఏడాది రూ.1470 నుంచి 1500 ఉంది. ఎంఎస్పీ రూ. 2300 ఉంది. ప్రొక్యూర్ మెంట్ ఎక్కడ జరుగుందో తెలియడం లేదు. వ్యవసాయదారులు దళారీలకు అమ్మకోవాల్సిన పరిస్థితి ఉంది. మిర్చి క్వింటా గత ఏడాది 21 నుంచి 23 వేలకు అమ్మితే ఈ ఏడాది రూ.8 నుంచి 11 వేలకు అమ్ముతున్నారు.