– నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఫేక్ పోస్ట్లు
– మా అధ్యక్షుడిపై పోస్ట్లు పెడితే చూస్తూ ఊరుకోవాలా?
– తప్పుడు ప్రచారం చేస్తే మా మనోభావాలు దెబ్బతినవా?
– సీమ రాజాపై చర్యలు తీసుకోకుంటే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం
– తమను అవమానపర్చే విధంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్లపై – గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో వైయస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు
గుంటూరు: తెలుగుదేశం అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్పై మార్ఫింగ్ ట్వీట్తోపాటు, సీమరాజా అనే పేరుతో యూట్యూబ్లో తనను, తమ పార్టీ నాయకులను అసభ్యంగా పదజాలంతో దూషిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో రెండు ఫిర్యాదులు చేశారు.
ఆయన వెంట పార్టీ సీనియర్ నాయకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్చార్జి నూరి ఫాతిమా, లీగల్ సెల్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం అధికారిక హ్యాండిల్ నుంచి మా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై చాలా అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారు.
అంటూ వాటిని చూపారు.
ఈ పోస్ట్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ టీడీపీ పోస్టును ట్యాగ్ చేసి ఈ విధంగా మార్ఫింగ్ చేసి మాకు నీతులు చెబుతూ కేసులు పెడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్ మీద ఇలాంటి మార్ఫింగ్లు చేయలేమా? అని నా అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి చెప్పినా వారు పోస్ట్ను తొలగించలేదు.
యూట్యూబ్లో సీమరాజా అనే వ్యక్తి వైయస్సార్సీపీ కండువా వేసుకుని మాపై పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన, సుకన్య, అంబటి రాంబాబు.. ఓరేయ్ ఆంబోతు మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది.
అంటూ థంబ్ నైల్తో చేసిన వీడియో చూపించారు. ఇలాంటివి చేస్తే మా మనోభావాలు దెబ్బ తినతినవా? చంద్రబాబుని విమర్శిస్తే మాత్రం, వారి మనోభావాలు దెబ్బతింటాయా? రెండేళ్ల కిందట పెట్టిన పోస్టులను చూపించి మా కార్యకర్తలను తీసుకొచ్చి నెల రోజులుగా జైల్లో నిర్బంధిస్తున్నారు.
ఈ సీమరాజా నా మీద మాత్రమే కాదు.. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్తో పాటు, ఆయన సతీమణిని ఉద్దేశించి దుష్ప్రచారం చేస్తూ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇలాంటివి మానుకోవాలని సీమ రాజాకి ఇప్పటికే ఒకసారి చెప్పడం జరిగింది. వాటిని ఆపకపోగా లోకేశ్ ప్రోత్సాహంతో మరింత రెచ్చిపోయి దూషిస్తున్నాడు. అతనిపై పోలీసులు చర్యలు తీసుకునే వరకు పోరాడతాం. లేదంటే అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళతాం.
కూటమి పార్టీ కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో మా పార్టీ వారిపై చేస్తున్న దుష్ప్రచారం, మార్ఫింగ్పై నవంబరు 17,18, 19 తేదీల్లో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ ఏ ఒక్కరిపైనా కేసు నమోదు చేయలేదు సరికదా.. కనీసం నోటీసులు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు.
మేం ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారో లేదో కూడా తెలియదు. కాదంటే మేం చేసిన ఫిర్యాదులు అవాస్తవమని పోలీసులు చెప్పాలి. నిజమైతే కేసులు నమోదు చేయాలి. అంతే కానీ, ఏదీ చేయకుండా పోలీసులు కాలయాపన చేయడం తగదు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించకుండా నిష్పక్షపాతంగా పని చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.