– భారీ వర్షాలు పడిన తట్టుకునేలా వ్యవస్థల ప్రక్షాళన, ప్రత్యేక ప్రణాళికలు
– నీటి ప్రవాహనికి వీలుగా డ్రైనేజీలు,ట్రాఫిక్ చిక్కుల్లేకుండా చర్యలు
– చెరువులు, కుంటలు, నాలాలు, ఎస్టీపీల ద్వారా మూసీకి అనుసంధానం
– తాగునీటి తో పాటు డ్రైనేజీ, ట్రాఫిక్ డ్రైనేజీ శాశ్వత పరిష్కారం
హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను అధిగమించటంతో పాటు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అభివృద్ధికి వీలుగా పనులు చేపట్టాలని ఆదేశించారు.
వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందుకు, జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే.. అత్యవసరంగానే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి నిన్న రాత్రి హైదరాబాద్ లో కురిసిన వర్షం, తలెత్తిన ఇబ్బందులు, అధిగమించేందుకు అనుసరించాల్సిన తక్షణ చర్యలపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు. హైదరాబాద్ లో నిన్న రాత్రి అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ స్తంభించటంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో వరద నీటితో ముంపు పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
భారీ వర్షం ఒకేసారి కురవటంతో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షం పడటంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. సాధారణంగా మూడు నాలుగు నెలల్లో కురిసే వర్షపాతం మొత్తం ఒకే రోజున కుమ్మరించటంతో నగరం అతలాకుతలమవుతోందని సమావేశంలో చర్చకు వచ్చింది.
వాతావరణ మార్పులే అందుకు ప్రధాన కారణమని, అందుకు తగినట్లుగా నగరంలో అన్ని వ్యవస్థలను ఆధునీకరించాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలు అయిదు సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే పరిస్థితి లేదని, ఒక్కోసారి 20 సెంటీమీటర్ల వర్షం నమోదవుతోందని అన్నారు.
రాబాద్ లో నిన్న రాత్రి కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. జూన్ నుంచి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో సాధారణంతో పోలిస్తే 16 శాతం వర్షపాతం ఎక్కువగా నమోదైంది. అందుకే వాతావరణ మార్పులు, భారీ వర్షాలతో తలెత్తే ఈ విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు విపత్తుల నివారణ నిర్వహణ ప్రణాళిక సమర్థవంతంగా అనుసరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఎంత వర్షం పడినా గ్రేటర్ హైదరాబాద్ సిటీలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా, వరద నీటితో ముంపు గురవకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండేలా అత్యంత పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలని, అందుకు వీలుగా రూపొందిస్తున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని సీఎం ఆదేశించారు.
హైదరాబాద్ లో 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించటం ద్వారా పరివాహక ప్రాంతంతో పాటు నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు, కాలనీలన్నీ సురక్షితంగా ఉండటంతో పాటు లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవకుండా ఉంటాయన్నారు.
వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఉన్నందునే నగరంలో ఈ దుస్థితి తలెత్తుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరంలోని అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
నగరంలో ఉన్న హుస్సేన్ సాగర్, దుర్గం చెర్వు, మీర్ అలం చెర్వులతో పాటు ప్రతీ చెరువు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలని సూచించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాలను వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. డ్రైనేజీల ద్వారా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల) ద్వారా శుద్ధి చేసి మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహం ఉండేందుకు వీలుగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. నగరంలో ఎక్కడ వర్షం పడినా నీరు చెరువుల్లోకి, నాలాల్లోకి, అటునుంచి మూసీలోకి చేరేలా అనుసంధానం జరగాలన్నారు.
మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో హైదరాబాద్ లో నీటి కష్టాలు తీరుతాయని సీఎం అన్నారు. కలుషితమైన నీటితో మూసీ పరివాహక ప్రాంతంలో రైతులు పంటలు పండిస్తున్నారని, ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. ఇకపై ఈ పరిస్థితి తలెత్తకుండా మూసీలో నిరంతరం శుద్ధి చేసిన నీటి ప్రవాహం ఉండేలా శాశ్వత ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలు, ఇతర అవసరాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా వినియోగించుకునే వీలుంటుందని అన్నారు.
భవిష్యత్ లో వందేళ్ల పాటు మహానగరంలో వరద నీటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనమే అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వరద నీటి నిర్వహణకు వీలుగా డిజైన్ చేయాలని, ఆ దిశగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల సమయంలో ట్రాఫిక్ సమస్య తీవ్రత మరింత పెరుగుతుండటంతో శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా పాతనగరంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు పెడిస్ట్రియల్ జోన్ ను ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని సీఎం సూచించారు. చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్ లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్ ల ఏర్పాటుతో రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు పార్కింగ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ ఇలంబర్తి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, జేఎండీ గౌతమి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.