– ముంపు సమస్యపై సీఎం సమీక్ష
– ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: నగరంలో వర్షాలతో తలెత్తే ఇబ్బందులు, వరద సమస్య పరిష్కారంపై సమీక్షలో సుదీర్ఘంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. ఇందుకు సంబంధించి అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైన పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండటమే నగరంలో ఈ దుస్థితి తలెత్తుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని వరదనీరు మూసీని చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రతీ చెరువు, నాలాలు, ఇతర కాలువలను మూసీకి అనుసంధానం చేయాలని సూచించారు. చెరువులను పునరుద్ధరణ, నాలాలను వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఎక్కడ వర్షం పడినా నీరు చెరువుల్లోకి, నాలాల్లోకి, అటునుంచి మూసీలోకి చేరేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
భవిష్యత్ లో నగరంలో ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మూసీ పునరుజ్జీవనమే వరద సమస్యకు శాశ్వత పరిష్కారమని ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. మూసీ పునరుజ్జీవనంతో వర్షాకాలంలో నీటి ప్రవాహం, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ దిశగా హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు.