-ఇటీవల రోడ్డు ప్రమాదంలో రాజవర్ధన్ రెడ్డి మృతి
-హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తుండగా ఘటన
-నేడు కర్నూలు విచ్చేసిన లోకేశ్
-రాజవర్ధన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు
-మంచి మిత్రుడ్ని కోల్పోయానంటూ తీవ్ర విచారం
కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ నియోజక ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి కుమారుడు, మాజీ ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజవర్ధన్ రెడ్డి హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలైన రాజవర్ధన్ రెడ్డిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించారు.
ఈ నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు కర్నూలు విచ్చేశారు. పట్టణంలోని నెహ్రూనగర్ లో ఉన్న రాజవర్ధన్
రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. రాజవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఓ మంచి మిత్రుడ్ని కోల్పోయానంటూ లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో రాజవర్ధన్ రెడ్డి వంటి సమర్థుడైన యువనేతను కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. రాజవర్ధన్ రెడ్డి ఎంతో నిబద్ధత ఉన్న నాయకుడు అని, గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ కూడా సొంత పనుల కోసం రాలేదని లోకేశ్ గుర్తు చేసుకున్నారు.