• తెలుగు భాష ఎంతో మధురమైనది
• విజయవాడ ప్రాంతం వేడిగా ఉన్నా ఇక్కడ ప్రజలు కూల్
• విజయవాడ ఉత్సవ్ మరో 100 ఏళ్లు కొనసాగాలి
– విజయవాడ ఉత్సవ్ లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్
విజయవాడ: పున్నమి ఘాట్లో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ – 2025 లో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిధిగా బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మాట్లాడుతూ ప్రారంభంలో తెలుగులో అందరికీ నమస్కారం చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
తెలుగు భాష సౌందర్యం, సాహిత్యం, సంగీత వైభవాన్ని ప్రశంసిస్తూ తెలుగు భాష ఎంతో మధురమైనదని ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి అన్న మాటలను ఈ సందర్బంగా ప్రస్తావించారు..
విజయవాడ ఉత్సవ్ మరో వందేళ్లపాటు కొనసాగాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకతను గుర్తుచేస్తూ దేశవ్యాప్తంగా దుర్గా నవరాత్రులు ఎంతో ప్రత్యేకమని, తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తితో పూజించే సంప్రదాయం ద్వారా మన భారతీయ సంస్కృతిలో మహిళల ప్రాముఖ్యతను ఈ ఉత్సవాలు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.
మహిళా శక్తిని గౌరవించడం భారతీయ సంప్రదాయమని, అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా కొలవడం ద్వారా శక్తి, భక్తి రెండూ లభిస్తాయి అని చెప్పారు. ఉత్సవం ద్వారా ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నానన్నారు. విజయవాడ ప్రత్యేకతపై మాట్లాడుతూ విజయవాడ ప్రాంతం వేడిగా ఉన్నా ఇక్కడ ప్రజలు మాత్రం కూల్ గా ఉంటారని అన్నారు. రాబోయే రోజుల్లో విజయవాడ దేశంలోనే అభివృద్ధి చెందిన నగరంగా నిలవబోతోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల్లో రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. వికసిత భారత్ అనేది ఒక కల కాదు, అది నిజం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు వెళ్తోందని అన్నారు. శాస్త్ర, సాంకేతిక, వైద్య, విద్య రంగాల్లో కూడా రాష్ట్రం విశేష పురోగతిని సాధిస్తోందని తెలిపారు.
ఉపరాష్ట్రపతి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మొదటి అధికారిక పర్యటన లో భాగంగా విజయవాడకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. తనకు ఇక్కడ అద్భుతమైన గౌరవం లభించిందని, ఇక్కడి సంప్రదాయాలు, సంస్కృతి దేశానికి గర్వకారణమన్నారు.
కనకదుర్గ అమ్మ పేరులోనే అనుగ్రహం, ప్రేమ, అమృతం నిక్షిప్తమై ఉంది అని భావోద్వేగంగా తెలిపారు. మంత్రులు, అధికారులు అందరూ కలసి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతూ, రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవ వేదికపై గాయని గీతా మాధురి పాడిన పాటలను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రశంసించారు.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో మెరిసిపోతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కి ముందడుగు వేస్తున్నారని.. సాంప్రదాయంతో సాంకేతికతను, సంస్కృతితో సృజనాత్మకతను, వారసత్వ సంపదతతో అభివృద్దిని సమ్మళితం చేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు.
అమరావతి నగరాన్ని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందున్నారని పేర్కొన్నారు. మన పండుగలు మన జీవన విధానమని, గ్రంధాలయాలు మన సంస్కృతికి నిదర్శనమన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశంలో టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతుందని, లోకల్ టూ గ్లోబల్ దిశగా అభివృద్ధి పధంలో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు.
పరిశుభ్రత, ఆధ్యాత్మిక విషయంలోనూ అభివృద్ధి దిశగా విజయవాడ ముందున్నదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ అశయ సాధన 2047 కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పధంలో దూసుకుపోతుందన్నారు. ఇటువంటి ఉత్సవాల నిర్వహణ ద్వారా ఎందరో హస్తకళాకారులు రూపొందించిన ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ లభిస్తుందన్నారు. ఎంతో మంది కళాకారులకు ఉత్సవాలు ఉపాధిని కల్పిస్తున్నాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలియజేశారు.. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని)
మాట్లాడుతూ ఆధ్యాత్మిక, పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మూడు వేల మంది కళాకారులు ఈ ఉత్సవాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారన్నారు.
ముందుగా విజయవాడ వైభవంపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఉపరాష్ట్రపతి, మంత్రులు తిలకించారు. సవ్య మానస బృందం ఆధ్వర్యంలో ప్రదర్శించిన వరాహ రూపం తదితర నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, సత్య కుమార్ యాదవ్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, విజయవాడ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మురళీ, మాజీ పార్లమెంటు సభ్యుల గోకరాజు గంగరాజు, మాజీ శాసనమండలి సభ్యులు బుద్దా వెంకన్న, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.