– ఎమ్మార్వో ముందు పరిటాల పంచాయితీ
– ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న అధికారులు
– నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన పరిటాల శ్రీరామ్
– బాధితుల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని శ్రీరామ్ నిలదీత
– న్యాయమైన సమస్యను కూడా నెలల తరబడి నాన్చుతారా?
– ఎమ్మార్వో, వీఆర్వోలపై ధర్మవరం టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఫైర్
ధర్మవరం: తాడిమర్రి మండలంలో నెలకొన్న రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులు మండల పరిధిలోని భూ సమస్యల పరిష్కారం బాధితులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
కొందరు వీఆర్ఓలు తహసీల్దార్ పేరు చెప్పి.. దాట వేస్తుండగా తహసీల్దార్ కార్యాలయంలో కూడా సరైన సమాధానం లేకపోవడంతో పలువురు బాధితులు శ్రీరామ్ వద్దకు వెళ్లారు. దీనిపై ఫోన్ ద్వారా సమస్య వివరించిన పట్టించుకోకపోవడంతో సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్ కు శ్రీరామ్ బాధితులతో కలసి వెళ్లారు.
తహసీల్దార్ వద్దకు వెళ్లిన బాధితుల ఆవేదనను వినిపించారు. కొన్ని ఉదాహరణలను కూడా చూపిస్తూ.. ఎందుకు వీటిని పరిష్కరించడం లేదన్నారు. సమాధానం దాట వేస్తున్న వీఆర్ఓలను కూడా అధికారులు పిలిపించారు. వారు ఒకరిపై ఒకరు చెప్పుకోవడంతో బాధితులు, శ్రీరామ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తాతల కాలం నుండి ఉన్న భూమిని ఇతరుల పేరు మీదకి మార్చడం, ఆస్తులను తగ్గించడం లాంటివి చేశారన్నారు. అసలు తమ ప్రమేయం లేకుండా రికార్డులు ఎలా మారుస్తారని బాధితులు నిలదీశారు. దీనిపై తహసీల్దార్ అసలు పట్టించుకోవడం లేదని ఆయన ముందే చెప్పారు. శ్రీరామ్ మాట్లాడుతూ న్యాయమైన వాటిని కూడా పరిష్కరించడానికి నెలల తరబడి తిప్పడం సరైంది కాదని, ఇక నుంచి ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేయడం సరైంది కాదన్నారు.