– సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో మంత్రులు వనిత, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ భాషా, విడదల రజని
గాజువాక: సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర రెండో రోజు గాజువాక నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా గాజువాకలో ఏర్పాటు చేసిన సభలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పలువురు మంత్రులు ప్రసంగించారు. ఒక్క జగనన్న తప్ప, గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంత గౌరవం, రాజ్యాధికారం ఇచ్చిన వారు ఎవరూ లేరు అని మంత్రులు అన్నారు.సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో మంత్రులు మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
అమలాపురం విధ్వంసం వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు- రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత
ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను గుర్తించి, గౌరవించి కీలకమైన బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్ . దేశమంతా వెతికి చూసినా.. మనకు ఇంతటి గౌరవం, రాజ్యాధికారాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్ప ఎవరూ లేరు.
మరోవైపు మహిళా పక్షపాత ప్రభుత్వంగా, ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మహిళల పేరుతోనే ఇవ్వడం అందరూ గమనించాలి. మన బిడ్డల్ని చదవించడానికి అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మన బిడ్డల భవిష్యత్ కోసం ఎన్నో లక్షల కుటుంబాల్లో విద్యా దీపాన్ని వెలిగించిన ఏకైక
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి . మేనమామగా జగనన్నమన బిడ్డల బాధ్యత తీసుకుని అమ్మ ఒడి పథకం ద్వారా చదవిస్తున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, సొంత ఇంటి కలను నెరవేర్చడానికి 31 లక్షల ఇంటి స్థలాలను మహిళల పేరుతోనే ఉచితంగా ఇచ్చారు.
మేనిఫెస్టోలో పెట్టిన హామీల అమలు కోసం, కరోనా విపత్తు వచ్చినా, రాష్ట్రం మీద ఆర్థిక భారం పడినా, ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆసరా, చేయూత పథకాలతో అండగా ఉంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలు కన్నట్లుగా మహిళా సాధికారిత సాధించేలా, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా జగన్ మోహన్ రెడ్డి మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు.
దేశ చరిత్రలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు, పనుల్లో కూడా మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారు. ప్రతి పదవుల్లోనూ బడుగు, బలహీన వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పించడమే కాకుండా అందులో కూడా, మహిళలకు యాభైశాతం రిజర్వేషన్లు కల్పించారు. మన రాష్ట్రంలో జరిగినంత సాధికారత ఏ రాష్ట్రంలోనూ జరగలేదని చెప్పడానికి గర్వపడుతున్నాం.
జగనన్న పరిపాలనలో ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండటానికి కారణమైన చరిత్రాత్మకమైన నిర్ణయాలకు కట్టుబడి, జగనన్నను గతంలో ఏవిధంగా ఆశీర్వదించామో, ఆదరించామో… అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆశీర్వదించాలని, మహిళల చల్లని దీవెనలు జగన్ మోహన్ రెడ్డికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం.
అమలాపురం విధ్వంసంపై..
కోనసీమలో జరిగిన అల్లర్లపై సమగ్ర దర్యాప్తు జరుగుతుంది. అమలాపురం విధ్వంసం వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు ఉంటాయి. దీని వెనుక జనసేన, టీడీపీలకు చెందిన కార్యకర్తలు ఉన్నట్టు ఇప్పటికే పోలీసుల విచారణలో తేలింది. మా మంత్రి ఇల్లు, మా ఎమ్మెల్యే ఇల్లు మేమే తగలబెట్టుకున్నామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాట్లాడటం సిగ్గుచేటు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టాలని అడిగిన వారే.. తర్వాత మాటలు మార్చారు, ప్రజల ముందు ఒక మాట, ప్రజల వెనుక మరో మాట మాట్లాడే టీడీపీ, జనసేన పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారు.
రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన జగన్- డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన 17మందికి చోటు కల్పించడమే కాకుండా, దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ వర్గాల వారికి ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు. పురపాలిక, కార్పొరేషన్ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి, రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. ఇంత గౌరవంగా మీ ముందు ఉండేలా చేశారు. అలాగే బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని అసెంబ్లీ స్పీకర్గా, ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి మండలి ఛైర్మెన్ గా ఎంపిక చేసిన ఘనత కూడా జగన్ కే దక్కుతుంది.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఉన్న జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు చెందిన 80 శాతం మందికి నవరత్నాలు అందించారు. చక్కటి విజన్ ఉన్న ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేయడం గర్వకారణం. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత కల్పించిన ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని, సామాజిక న్యాయాన్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ప్రజలకు వివరించడమే మా బస్సుయాత్ర ముఖ్య ఉద్దేశం.
మరో 30 ఏళ్ళు జగన్ ముఖ్యమంత్రి- రాష్ట్ర డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ భాషా
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్ల అయినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు తమకు సామాజిక న్యాయం చేయాలని అనేక సందర్భాల్లో మొర పెట్టుకున్నా… ఎక్కడా, ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎన్నడులేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం చేసిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ మంత్రివర్గంలో 70శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వాళ్లు లేరని గర్వంగా చెప్పగలం. కేవలం కేబినెట్లోనే కాకుండా నామినేటెడ్ పదవుల్లోనూ అవకాశం కల్పించి రాష్ట్రంలో పూర్తి సామాజిక న్యాయం చేసిన నాయకుడు జగన్ .
మైనార్టీల సంక్షేమం గురించి చూస్తే.. గతంలో చంద్రబాబు హయాంలో మైనార్టీలకు కేబినెట్ లో ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. మైనార్టీ మంత్రి లేని కేబినెట్ ఒక్క చంద్రబాబు హయాంలోనే. తన అయిదేళ్ల పాలనలో చంద్రబాబు తన మంత్రివర్గంలో మైనార్టీలు, ఎస్టీలకు స్థానం కల్పించలేదు. కేవలం ఎన్నికల తరుణంలో మాత్రమే మూడు నెలల కోసం మైనార్టీలకు మంత్రిపదవి ఇచ్చారు.
ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి .. కచ్చితంగా ఈ రాష్ట్రానికి మరో 30ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఉంటారు. అప్పుడే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. మనసున్న ముఖ్యమంత్రి జగన్ కి రాష్ట్ర ప్రజలంతా అండగా ఉండాలి.
సంక్షేమ సామ్రాజ్యాన్ని సృష్టించిన జగన్- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని
గ్రామ స్థాయి వాలంటీర్ వ్యవస్థ నుంచి మంత్రివర్గ కూర్పు వరకు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఏ విధంగా సామాజిక న్యాయం పాటించారో వివరించేందుకే ఈ సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర. తన కేబినెట్ లో ఈ వర్గాలకు చెందిన 17మందికి, అంటే 70శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇస్తే, అందులో పదిమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన నాయకుడు జగన్ . రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కూడా గొప్పగా అమలు అవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రజలందరికీ తెలియచేసి, వారిని మరింత చైతన్యవంతుల్ని చేయడానికే ఈ బస్సుయాత్ర చేపడుతున్నాం. జగనన్న అమలు చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం అక్కచెల్లెమ్మల పేరుతోనే ప్రారంభించడం జరిగింది. గతంలో ఎన్నడూ, ఎప్పుడూ, ఏ నాయకుడు చేయని మంచిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మా జగనన్న చేశాడని మీ అందరికీ చెప్పేందుకే మీ ముందుకు వచ్చాం.
మిగతా అన్ని రాజకీయ పార్టీలకు సామాజిక న్యాయం అన్నది కేవలం నినాదాలకే పరిమితమైతే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సామాజిక న్యాయాన్ని తమ విధానంగా మార్చుకుంది. రాష్ట్రంలో ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద వర్గాలు ఆనందంగా, ఉన్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలనే. సామాజిక న్యాయానికి అడుగులు వేస్తూ ఈ మూడేళ్లలో సంక్షేమ సామ్రాజ్యాన్ని జగన్ స్థాపించారు.