– విలేఖర్ల సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ హెచ్చరిక
హైదరాబాద్: సాధారణ కార్యకర్తగా ఉన్న నన్ను బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన సందర్భంలో, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావుకి, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి, కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి కి, బండి సంజయ్ కుమార్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బీజేపీ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.
47 ఏళ్ళుగా స్వయం సేవక్గా, 30 ఏళ్లుగా బీజేపీలో వివిధ హోదాల్లో సేవలందిస్తూ, వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్న నన్ను, దేశం, రాష్ట్రం కోసం ప్రజల అవసరాలను తీర్చే ఆలోచన విధానంతో బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గొప్ప బాధ్యతలు అప్పగించడం గర్వకారణంగా ఉంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రకటించిన నూతన కమిటీల్లో, గత 20–30 ఏళ్లుగా పార్టీ కోసం స్వార్థం లేకుండా, నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకు చోటు కల్పించారు. మేమంతా కొత్త కమిటీల్లో అహర్నిశలుగా పార్టీ కోసం శ్రమిస్తూ, కృషి చేస్తూనే ఉన్నాం.
బిజెపిలో పదవులు పైరవీలు, డబ్బుల మూటలతో రావు. అలాగే పదవి రావడం ముఖ్యం కాదు, ఆ పదవి ద్వారా పార్టీకి, ప్రజలకు సేవ చేయాలని అశోక్ అన్నారు.
మాకు పదవులు ముఖ్యం కాదు, బీజేపీ కండువా ముఖ్యం, జీవితమంతా పార్టీ కోసమే పనిచేస్తాం. కొంతమంది బిజెపి పై, నూతన కమిటీల విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి వారికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతాం. దేశంలో ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు, ఎంబీసీలకు, మహిళలకు పూర్తి న్యాయం చేసే పార్టీ బిజెపి మాత్రమే. దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిగా, ఆ తర్వాత మరోసారి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ని రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదే. ఇప్పుడు ఎంబీసీ సామాజిక వర్గానికి చెందిన సీపీ రాధాకృష్ణన్ ని భారత ఉపరాష్ట్రపతిగా చేసిన ఘనత కూడా బిజెపి దే అని తెలిపారు.
రాజాసింగ్ వంటి కొంతమంది పార్టీని బలహీనపరచే కుట్రతో సొంత లాభం కోసం వ్యాఖ్యలు చేస్తున్నారు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రకటించిన కొత్త కమిటీల్లో గోషామహల్ కార్యకర్తలకు చోటు లేదని, కేవలం సికింద్రాబాద్ కమిటీలా ఉందంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజాసింగ్ ఇప్పుడు బిజెపి కార్యకర్త కాదు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదంటూ, రాజీనామా పత్రాన్ని “లవ్ లెటర్” ఇచ్చాను అని వ్యంగ్యంగా మాట్లాడి పార్టీ గౌరవాన్ని కించపర్చారు. అయినప్పటికీ, కార్యకర్తలు ఓర్పుతో సహించారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే తగిన గుణపాఠం చెబుతాం. గోషామహల్లో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న బిజెపి కార్యకర్తలు, నాయకులు ఉన్నా, పార్టీ మూడుసార్లు రాజాసింగ్ కి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చి గెలిపించింది. ఎల్పీ లీడర్గా కూడా అవకాశం కల్పించింది.
పార్టీకి నష్టం కలిగించిన చర్యల కారణంగా, క్రమశిక్షణా చర్యలతో రాజాసింగ్ ని బిజెపి నుంచి దూరం పెట్టింది. తెలంగాణలోని 40 లక్షల మంది బిజెపి కార్యకర్తల మనోభావాలను కించపరచే హక్కు ఎవరికీ లేదు.
బిజెపి గురించి అసవసర విమర్శలు చేసినా, పార్టీ నాయకులను అవహేళన చేసినా రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం.
ఈ మీడియా సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతికిరణ్ , ఎస్సీ మోర్చా నాయకులు మాదరి చంద్రశేఖర్ పరమేశ్ , పద్మిణి , జీవన్ గా , తదితర నాయకులు పాల్గొన్నారు.