– స్థానిక సంస్థల ఉప ఎన్నికలను ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలి
– ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితులు కనిపించడం లేదు
– నామినేషన్ వేసిన అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలి
– నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు ప్రక్రియ అంతా సీసీ కెమెరాల నిఘాలో జరగాలి
– స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి వినతిపత్రం అందించిన అనంతరం మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ నాయకులు
విజయవాడ: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికలను ప్రజాస్వామ్యబద్దంగా, పారదర్శకంగా నిర్వహించాలని వైయస్ఆర్సీపీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేసింది. విజయవాడ లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసిన వైయస్ఆర్సీపీ నేతలు గత అనుభవాల దృష్ట్యా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఎలాంటి దౌర్జన్యాలు, బెదిరింపులకు అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని కోరారు.
ఆన్లైన్ విధానంలో అభ్యర్ధుల నుంచి నామినేషన్లు స్వీకరించాలని, నిఘా కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎన్నిక కమిషన్ కార్యాలయం బయట వైయస్ఆర్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.
అభ్యర్ధులను బెదిరిస్తున్నారు: మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి
వైయస్సార్ కడప జిల్లా పులివెందులలో బీటెక్ రవి అనే ఒక నాయకుడు ‘ఎవరు నామినేషన్ వేస్తారో చూస్తా’ మంటూ నేరుగా ప్రెస్మీట్లో బెదిరింపులకు దిగారు. ఈ విధంగా దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆన్లైన్ నామినేషన్లు దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని వైయస్సార్సీపీ తరఫున విజ్ఞప్తి చేశాం.
అందుకు ఎలక్షన్ కమిషనర్ స్పందిస్తూ దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ సైతం సిద్ధంగా ఉందని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఆ విధంగా ఆన్లైన్ నామినేషన్లు తీసుకుంటామని చెప్పారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల ఏవిధమైన గౌరవం ఉన్నా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా, ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షణ: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ఇటీవల కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరిగిన చైర్మన్, వైయస్ చైర్మన్, మేయర్ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసను దృష్టిలో ఉంచుకుని, రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన పోలీసు బందోబస్తు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే వాతావరణం కనిపించడం లేదు.
నామినేషన్ కూడా వేయనీయకుండా ఇప్పటికే బెదిరింపులకు దిగుతున్నారు. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నాయకులు ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించాలని కుట్రలు చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికలు సజావుగా నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల సంఘాన్ని కోరడం జరిగింది.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది: ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్
పదో తారీఖున జరగబోయే ఉప ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరిగేలా చూడాలని వైయస్సార్సీపీ తరఫున ఎన్నికల కమిషనర్ని కోరడం జరిగింది. అభ్యర్థులు కనీసం నామినేషన్ కూడా వేయకుండా చేసేలా బెదిరింపులకు దిగుతున్నారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థికి పోలీసులతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాం. నామినేషన్ వేసిన దగ్గర నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ని విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఈసీని కోరాం
– ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాశ్
ఇటీవల తిరువూరు మున్సిపాలిటీకి జరిగిన చైర్మన్ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ నాయకులు ఎన్ని అడ్డదారులు తొక్కారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. వైయస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా ఎన్నికల్లో గెలవకుండా చేసేందుకు మా సభ్యులను ప్రలోభాలకు గురిచేశారు. లొంగనివారిని భయాందోళనలకు గురిచేశారు. బెదిరించి, కిడ్నాపులు చేసి మా కౌన్సిలర్లని తమవైపుకి తిప్పుకున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో ఇలాగే అడ్డదారులు తొక్కి చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకున్నారు. మా నాయకులు నెల్లూరు పర్యటనకు వెళ్తుంటే ఆయనకు భద్రత కల్పించాల్సిన పోలీసులు కార్యకర్తలు, నాయకులు రాకుండా అడ్డుకునే పనిలో నిమగ్నమైపోయారు.