Suryaa.co.in

Telangana

నినాదాలు కాదు .. విధానాలు మారాలి

– 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు అన్న కేంద్ర ప్రభుత్వ హామీ నినాదానికే పరిమితం
– హైదరాబాద్ ఫిస్సీ సురాన ఆడిటోరియంలో నిర్వహించిన ‘వ్యవసాయ మరియు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలు – తెలంగాణ’ అంశంపై జరిగిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

2022 పోయి 2023 సంవత్సరం వచ్చేసింది .. రైతుల ఆదాయం రెట్టింపు సంగతి పక్కనపెడితే రైతులకు సాగు పెట్టుబడి రెట్టింపు అయింది.పంటల మార్కెటింగ్ అనేది రైతులకు ఇబ్బందికరంగా మారింది.ఆహారం లేకుండా ప్రపంచం మనుగడ సాగించలేదు.దీనికి సంబంధించిన వ్యవసాయరంగం అత్యంత ప్రాధాన్యం కలిగిన రంగం.సాగుకు భారతదేశ నేలలు, వాతావరణం అనుకూలమైనవి.
కానీ దానికి తగినట్లుగా దేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్య ఇవ్వడం లేదు.అత్యధిక మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.అందుకే సాగునీరు, కరంటు, రైతుబంధుతో వ్యవసాయరంగానికి అండగా నిలిచి రైతుభీమాతో రైతన్నలకు భరోసా ఇస్తున్నారు .. మద్దతుధరకు పంటల కొనుగోలు చేసి రైతులలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.

వ్యవసాయరంగం బలోపేతం అయితే ఆ రంగం మీద ఆధారపడిన ప్రజలు నాలుగైదేళ్లలో వారి కాళ్ల మీద వారు నిలబడతారన్నది కేసీఆర్ విశ్వాసం.వారి కాళ్ల మీద వాళ్లు నిలబడితే మిగిలిన రంగాల మీద దృష్టిసారించ వచ్చు .. ఆ దిశగానే తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నది.ప్రభుత్వ చర్యల మూలంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రభాగాన నిలబడింది. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఎగుమతులను పెంచడం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుంది.ఎగుమతులు పెంచడానికి ఏఏ చర్యలు తీసుకోవాలి అన్నది నిపుణులు, శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందజేయాలి.ప్రపంచ మార్కెట్ ఎగుమతులకు అనుగుణంగా ఎలాంటి నిబంధనలు అనుసరించాలో చైతన్యం చేయాలి.

మనకు అత్యంత ప్రతిభ కలిగిన పరిశ్రమల శాఖా మంత్రిగా కేటీఆర్ ఉన్నారు .. ఒక మంచి పాలసీని ముందుకు తెస్తే అత్యంత తక్కువ సమయంలో దానిని అమల్లోకి తెచ్చే సత్తా ఆయనకు ఉంది.ఆయన సమర్దవంతమైన నాయకత్వంలో అత్యధిక మంది ఇష్టపడుతున్న నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దబడింది. ప్రపంచానికి సాఫ్ట్ వేర్ సేవలు అందించడంలో భారత్ ముందున్నది. ఒక్కరోజు దిగుమతులలో అంతరాయం ఏర్పడితే బ్రిటన్ ఆకలితో అల్లాడుతుంది.వారు ప్రపంచానికి ఏమీ ఎగుమతి చేయడం లేదు .. అన్నింటికి దిగుమతుల మీదే ఆధారపడుతుంది. ప్రపంచంలో 800 కోట్ల జనాభా దాటిపోయింది .. భారతదేశం అత్యధిక జనాభాతో అగ్రస్థానంలో ఉన్నది.

మానవాళికి అవసరమైన దైనందిన అవసరాలను తీర్చుకోవడం కోసం ప్రపంచంలో ఒక దేశం ఇంకో దేశం మీద ఆధారపడడం అనివార్యమయింది.వాణిజ్య ఒప్పందాలు లేకుండా దేశాలు మనుగడ సాగించడం అసాధ్యం .. అది లేకుండా జీవితం లేదు. ప్రపంచానికి భారతదేశ రైతుల సేవలు అత్యంత ఆవశ్యకం.రాబోయే రోజుల్లో ప్రపంచ ఆకలితీర్చేందుకు భారతదేశం కేంద్ర బిందువుగా నిలుస్తుంది.ఫుడ్ ప్రాసెసింగ్ రంగం మీద దృష్టిపెట్టిన వారికి భవిష్యత్ ఉంటుంది.ప్రపంచ అవసరాలు, డిమాండ్ ఉన్న ఉత్పత్తుల మీద దృష్టిసారించాలి.

కాలిఫోర్నియా ఆల్మండ్స్ కన్నా మన వేరుశెనగ లో ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రొటీన్స్ ఉంటాయి .. కానీ వారు వారి ఉత్పత్తికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించారు. ప్రపంచంలోని అనేక దేశాలలో పీనట్ బట్టర్ కు డిమాండ్ ఉన్నది.తెలంగాణలో యాసంగిలో వేరుశెనగ సాగుకు రైతులను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం.అప్లాటాక్సిన్ రహిత తెలంగాణ వేరుశెనగకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నది. ఉచిత చేపపిల్లలతో మత్స్య పరిశ్రమ, సబ్సిడీ గొర్రెలతో గొర్రెల పెంపకం ప్రోత్సాహంతో తెలంగాణలో గణనీయంగా వాటి ఉత్పత్తి పెరిగింది.వాటి ఎగుమతుల మీదా దృష్టిసారించాలి.సులభంగా కాకుండా పనిచేసి కష్టపడి జీవించగలం అన్న ఆలోచనలు పెరగాలి.

హైదరాబాద్ ఫిస్సీ సురాన ఆడిటోరియంలో నిర్వహించిన ‘వ్యవసాయ మరియు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలు – తెలంగాణ’ అంశంపై జరిగిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ నీరజా ప్రభాకర్, టీఎస్టీపీసీ జేఎండీ విష్ణువర్దన్ రెడ్డి, ఫిస్సీ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్, వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ సింఘాల్ తదితరులు

LEAVE A RESPONSE