– ఏ రాష్ట్రంలో కూడా ఇంత సంఖ్య లేదు
– ప్రభుత్వ పాఠశాలల్లో గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ను లక్ష్యంగా పెట్టుకున్నాం
– చాగంటి కోటేశ్వరరావుని అభినందిస్తున్నా…
– ప్రభుత్వం నుంచి చాగంటి కోటేశ్వరరావు ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు
– శాసనమండలిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి : కూటమి ప్రభుత్వంలో 9,600 ప్రాథమిక పాఠశాలల్లో తరగతికో ఉపాధ్యాయుడుని అందించామని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సంఖ్య లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలను ఫీజు నియంత్రణ కమిటీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందా అని మండలిలో కుడిపూడి సూర్యనారాయణ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
ఏపీఎస్ఈఆర్ఎంసీ చట్టాన్ని 2019లో తీసుకువచ్చాం. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ క్లాస్ వన్ టీచర్ ను ప్రైమరీ స్కూళ్లలో అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 117 జీవో వల్ల కేవలం 1200 పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ ఉంటే.. కూటమి ప్రభుత్వంలో సుమారు 9,600 ప్రాథమిక పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ ను అందజేశాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సంఖ్యలో చేయలేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ను లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు తగ్గట్లుగా ఉపాధ్యాయులను మోటివేట్ చేస్తున్నాం. లెర్నింక్ అవుట్ కమ్స్ పై శ్రద్ధ పెడుతున్నాం. విద్యార్థుల్లో నైతిక విలువల పెంపు కోసం చర్యలు చేపట్టాం. చాగంటి కోటేశ్వరరావుని సలహాదారుగా నియమించాం. ఆయన రూపొందించిన పుస్తకాలను ప్రింట్ చేసి విద్యార్థులకు అందిజేస్తున్నాం. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావుని అభినందించాలి. ఆయన ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకోవడం లేదు. నేను ఆశ్చర్యపోయా. కనీసం ప్రభుత్వం నుంచి ఫోన్ కూడా తీసుకోలేదు. వాటర్ బాటిల్ కూడా తీసుకోవడం లేదు. అద్భుతమైన పుస్తకాలను రూపొందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ను తీసుకువస్తాం. న్యాస్ నివేదికను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీ, బీసీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పెట్టారని ఎక్కడైనా సమాచారం ఉంటే సభ్యులు వివరాలు అందజేయాలి. ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరిస్తాం. నాకున్న సమాచారం ప్రకారం ఆ విధంగా ఎక్కడా జరగడం లేదని అన్నారు.