– మంత్రి నిమ్మల రామానాయుడు
* పట్టిసీమ ద్వారానే కృష్ణా డెల్టాకు త్రాగు, సాగునీరు
* జగన్ పట్టిసీమను వట్టి సీమ అన్నందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
* ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిసే పవిత్ర సంగమానికి జల హారతి ఇచ్చిన మంత్రి, ఎంపీ కేశినేని చిన్నీ, మాజీ మంత్రి దేవినేని
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్ష దక్షత, దూర దృష్టికి నిదర్శనం పట్టిసీమ అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నేడు పట్టిసీమ ద్వారా అందే గోదావరి జలాలే కృష్ణా డెల్టాకు త్రాగు, సాగునీరుగా అందుతున్నాయన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద గోదావరి జలాలు కృష్ణాలో కలిసే పవిత్ర సంగమానికి ఎంపీ కేశినేని చిన్నీ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లతో కలిసి మంత్రి రామానాయుడు పూజ నిర్వహించి జలహారతిని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆనాడు తెలుగుజాతి బిడ్డ కే ఎల్ రావు రాష్ట్రాన్ని కరువు కాటకాలు, దుర్భిక్షం నుంచి కాపాడుకోవాలంటే నదుల అనుసంధానం ద్వారానే సాధ్యమని తెలిపారని, ఆ కలలు పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ద్వారా నిజం చేసింది చంద్రబాబేనన్నారు.
గత ఐదు రోజుల కిందట 17 పంపులు ద్వారా పట్టిసీమకు విడుదల చేసిన గోదావరి జలాలు పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణ డెల్టాకు ఇప్పటివరకు 6,100 క్యూసెక్కుల నీరు చేరిందని మంత్రి రామానాయుడు తెలిపారు. మరో 8 పంపులను దశలవారీగా విడుదల చేస్తామని మొత్తంగా 24 పంపుల ద్వారా 8వేల క్యూసెక్కుల నీరు చేరుతుందన్నారు. ఈ నీరు కృష్ణ డెల్టా లోని 30 లక్షల మంది ప్రజలకు త్రాగు, 10 లక్షలకు పైగా ఆయకట్టుకు సాగుకు ఆధారమన్నారు. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందడం వలన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చే నీరు రాయలసీమకు పంపే అవకాశం కలుగుతుందని మంత్రి రామానాయుడు తెలిపారు. ఇటువంటి పట్టిసీమను అసెంబ్లీలో ఒట్టి సీమ అన్న జగన్ ప్రజలకు, తెలుగుజాతికి క్షమాపణ చెప్పాలని, ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు. పురుషోత్తపట్నం ద్వారా ఏలేరు రిజర్వాయర్ కు అందే గోదావరి జలాలు విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు విశాఖ ప్రజలకు తాగునీరుగా అందుతుందన్నారు.
ప్రతి ఏటా వృధా అవుతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునే పోలవరం ప్రాజెక్టు నాలుగైదు సంవత్సరాలు ఆలస్యం అవుతుందనే దూర దృష్టితోనే చంద్రబాబు పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను నిర్మాణం చేశారన్నారు. ఆనాడు పట్టిసీమ పథకానికి 1300 కోట్లు వెచ్చిస్తే కృష్ణా డెల్టా లోని 30 లక్షల ఎకరాలకు అందిన సాగునీటి ద్వారా 50 వేల కోట్లు వరకు రైతులకు ఆదాయం సమకూరిందని మంత్రి రామానాయుడు తెలిపారు.
జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో పట్టిసీమను నిర్లక్ష్యం చేశారని మంత్రి రామానాయుడు తెలిపారు. జగన్ రాజకీయాలు, ఎన్నికల స్వార్థంతో ఎప్పుడు పులిచింతల రిజర్వాయర్ లో 30 నుంచి 35 టీఎంసీలు నిల్వ ఉండే నీరు నేడు అర టీఎంసీ కూడా లేదని మంత్రి రామానాయుడు తెలిపారు. సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము, సంబంధిత శాఖ అధికారులతో పాటు పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.