– చంద్రబాబు సేవకే జనసేనాని పరిమితం
– పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ప్రజల గురించి చర్చే లేదు
– ప్రజా సమస్యలపై చర్చిస్తే చంద్రబాబుకు కోపం వస్తుందనే భయం
– సుగాలి ప్రీతి ఘటనను రాజకీయంగా వాడుకున్న పవన్
– ఇప్పుడు అధికారంలో ఉండి దోషులను పట్టుకోలేని అసమర్థ పవన్
– వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్ ఫైర్
తాడేపల్లి: విశాఖలో జరిగిన జనసేన లెజిస్టేచర్ సమావేశంలో కనీసం ప్రజల సమస్యలను గురించి ప్రస్తావించే సాహసం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయకపోవడం దురదృష్టకరమని వైయస్సార్సీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ ప్రజాసమస్యలను ఎక్కడ చర్చిస్తే, చంద్రబాబుకు కోసం వస్తుందోమోననే భయంతోనే ఈ సమావేశంను ముగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ పెట్టిందే చంద్రబాబు సేవకోసమే అన్నట్లుగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ తీరు మరోసారి బయటపడిందని ధ్వజమెత్తారు.
విశాఖలో జరిగిన జనసేన పార్టీ మీటింగ్ చూస్తే.. ఆ పార్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమావేశమయినట్లు లేదు. ఆ పార్టీ మీటింగ్ లో రాజకీయంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా ఈ సమావేశంను మొక్కుబడిగా ముగించారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, పవన్ కళ్యాణ్ ల ఎడిట్ చేసిన వీడియోలు చూసి…ఇది ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీయా? పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేసే నాయకుడేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ అనేక సభల్లో మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకు రూ.10 లక్షలు ఆర్ధిక సాయం చేస్తామని చెప్పారు. ఇలాంటి వాటిలో ఒక్క అంశంపైనా అయినా సరే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చర్చ జరిగిందా ? ఇలాంటి చర్చ జరుగుతుందని ఆశించి ప్రజలు భంగపడ్డారు. మనకు ఉపయోగపడే ఒక్క అంశం మీద కూడా మాట్లాడలేదు.
జనసేన జనం కోసం వచ్చిన పార్టీ కాదు, కేవలం చంద్రబాబు సేవ కోసం, తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగంగా పనిచేసే పార్టీ అని అందరికీ అర్ధం అయింది. చాలామంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ పార్టీ కార్యాలయంలో ఎలాగూ అవకాశం రావడం లేదు, కనీసం నిన్న విశాఖలో అయినా.. వన్ టూ వన్ పవన్ కళ్యాణ్ తో మాట్లాడుదామని అనుకున్నారు.
కానీ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు, కారణం జనసేన పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. పదవులన్నీ వాళ్లే తీసుకుంటున్నారు. అధికారం వాళ్లే చలాయిస్తున్నారు. ఈ నియోజకవర్గ సమస్యలన్నీ ఏకరవు పెట్టాలని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు చెబుదామనుకుంటే.. ఎక్కడ చంద్రబాబుకు, టీడీపీ శ్రేణులకు కోపం వస్తుందోనని పవన్ కళ్యాణ్ వారికి ఆ అవకాశం కూడా ఇవ్వలేదు.
2017లో సుగాలి ప్రీతి అత్యాచారానికి గురైంది. కానీ పవన్ కళ్యాణ్ 2019-24 వరకు వైయస్సార్సీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు, అవాస్తవాలు ప్రచారం చేశారు. ఈ కేసులో చాలామందికి పూర్వాపరాలు తెలియక పోవడంతో పవన్ కళ్యాణ్ అవాస్తవాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, సుగాలీ ప్రీతి ఘటకు అస్సలు సంబంధం లేదు. ఆ ఘటన జరిగినప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. సంబంధం లేని ఘటనను వైయస్సార్సీపీకి అంటగట్టి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారు.
ఆ రోజు సుగాలీ ప్రీతికి అన్యాయం జరిగింది, అండగా ఉంటాను అని చెప్పిన మీరు ఇవాళ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి కూడా ఆ కేసును ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారు. మిమ్నల్ని ఎవరు అడ్డుకుంటున్నారు?. ఎందుకు ఈ కేసు తేల్చలేకపోతున్నారు ? ఈ ప్రశ్నలు అడుగుతుంటే బుల్డోజ్ చేసి తప్పుడు సమాచారాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కుటుంబానికి సీఎంగా వైయస్ జగన్ అండగా నిలిచారు. మానవత్వంలో ఆ కుటుంబాని మేలు చేశారు. సుగాలీ ప్రీతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, 5 సెంట్ల ఇళ్ళ స్ధలం, కోరుకున్న చోట 5 ఎకరాల భూమి, రూ.8.25 లక్షల నగదు పరిహారం కింద ఇచ్చారు. ఇవన్నీ 2020లో సుగాలీ ప్రీతి కుటుంబానికి అందజేసిన మాట వాస్తవం. అయినా నిస్సిగ్గుగా ఎలాంటి సంకోచం లేకుండా మీడియా ముందు ఈ సాయాన్ని మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు ? మీరు ఆ కుటుంబానికి ఏం మేలు చేశారు?రాష్ట్రంలో సోషల్ మీడియాను నియంత్రించే చట్టం తేవాలని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఆ డిజిటల్ మీడియా వల్లే మీరు విస్తృతంగా అబద్దాలు ప్రచారం చేసుకున్నారు.
వచ్చే 15 ఏళ్లు జనసైనికులు చంద్రబాబు పల్లకి మోయాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు. దీనిపై జనసైనికులు ఆలోచించుకోవాలి. జనసేన సైనికులందరినీ పవన్ కళ్యాణ్ టీడీపీకి అమ్మేశారు. జనసైనికులు నాయకులుగా ఎదగొద్దు, పదవులు కోరుకోవద్దు అని స్పష్టంగా చెబుతున్నారు. మీ కష్టం మరొక పార్టీని అధికారంలోకి తెచ్చేందుకే తప్ప మీరు పదవులు పొందడానికి కాదన్న విషయాన్ని తెలుసుకోండి.