అభివృద్ధి చేయడంలో చైనాకు డేంగ్ జియో పింగ్.. తెలంగాణలో కేసిఆర్ ఆదర్శం
ఇండియా – చైనా మిత్ర మండలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
ప్రపంచ శాంతి ఎంతో అవసరమని విద్వేషాలకు తావివ్వకూడదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య ఘర్షణలు జరుగుతుండడం బాధాకరమని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఘర్షణలు ఘర్షణలవల్ల విధ్వంసం జరగడం తప్ప సాధించేది ఏది ఉండదని ఆయన అన్నారు.
ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా శాంతియుత వాతావరణం ఉంటే అభివృద్ధి సాధ్యమని వినోద్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉండడం వల్ల ప్రపంచ దేశాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారని వినోద్ కుమార్ వివరించారు.
ప్రభుత్వాల తీరు ఎలా ఉన్నా.. చైనా, ఇండియా ప్రజలు మాత్రం చిరకాల మిత్రులు అని వినోద్ కుమార్ అన్నారు.ప్రణాళికా బద్ధంగా చైనా దేశాన్ని అభివృద్ధి చేయడంలో డెంగ్ జియో పింగ్ ఆదర్శంగా నిలిచారని.. అదే బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ఇండియా – చైనా మిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు భాస్కరన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జగ్జిత్ సింగ్, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, పర్వత రెడ్డి, నిఖిలేశ్వర్, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.