– వారి ఆరాచకాలకు నేనే మొదటి బాధితుడిని
– ప్రజాస్వామ్యం కోసం పోరాడితే కేసులు పెట్టారు
– శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదు
– కూటమి వచ్చాక మహిళలపై నేరాలు తగ్గుముఖం
– సోషల్ మీడియా ఫేక్ ప్రచారాల వెనుక కుట్రల్ని వెలికితీస్తాం
– శాసనసభలో శాంతి భద్రతల అంశంపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు ప్రసంగం
అమరావతి : గత పాలకుల అరాచకానికి ప్రజలతో పాటు నేనూ బాధితున్నేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తప్పుడు కేసులతో వేధించడానికి అరెస్టు చేసి జైల్లో పెట్టారనీ… జైల్లో కూడా తన కదలికలు చూడ్డానికి డ్రోన్ ఎగరేశారనీ అన్నారు. గురువారం శాసనసభలో శాంతిభద్రతల అంశంపై స్వల్ప కాలిక చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి – సామాజిక మాధ్యమాల అంశంపై ప్రసంగించారు.
దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ “గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారందరిపైనా కేసులు పెట్టారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడుపై అత్యాచారయత్నం కేసులు పెట్టారు. ప్రస్తుత స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ గత పాలకులు పెట్టిన కేసుల బాధితులే. నాపై 17 కేసులు పెట్టి వేధించారు. ఇది అరాచకానికి పరాకాష్ట. యువగళం పాదయాత్ర ద్వారా మంత్రి లోకేశ్ ప్రజలను కలిస్తే కేసులు పెట్టారు.
అంగళ్లులో నాపై దాడి చేయించి మళ్ళీ నా పైనే కేసులు పెట్టారు. ప్రజలతో మాట్లాడేందుకు సమావేశం ఏర్పాటు చేసుకుంటే కరెంటు తొలగించి వేధించారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన రెడ్డి, సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి, పులివర్తి నాని, నిమ్మల రామానాయుడు, దేవినేని ఉమ, బీటెక్ రవి, కూన రవి ఇలా నేతలపై కేసులు పెట్టి వేధించారు. రఘురామకృష్ణం రాజును అరెస్టు చేసినప్పుడు ఆయన్ను ఏం చేస్తారోననే ఆందోళన వెంటాడింది.
గత ప్రభుత్వ హయాంలో అందరిపైనా కేసులు, వేధింపులే. అమరావతి రైతులు, మహిళలు రాజధాని కోసం పోరాడుతుంటే బాత్ రూమ్ లపై డ్రోన్లు ఎగరేశారు. అమరావతి రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్రకూ అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. గత పాలకుల అరాచకాలు భరించలేక పారిశ్రామిక వేత్తలు కూడా రాష్ట్రం నుంచి పారిపోయారు. అప్పటి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తన పరిశ్రమను పొరుగు రాష్ట్రానికి తీసుకెళ్లిపోయారు.
రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నారు. ఆఖరుకు సింగపూర్ లాంటి ప్రభుత్వంపైనా అభాండాలు వేసి ప్రాజెక్టు నుంచి వైదొలిగేలా చేశారు. 2019-24 వరకూ రాష్ట్రం తీవ్రస్థాయిలో అరాచకాలను భరించింది. గత పాలకులు టీడీపీ కార్యాలయంపై కూడా దాడి చేశారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మేం కక్ష సాధింపు రాజకీయాలు చేయం
“బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టే ప్రజలు నన్ను నాలుగోసారి ఎన్నుకున్నారు
కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే అరెస్టు చేసి ఉండేవాళ్లం. గతంలో సీఎంగా ఉండగా అలిపిరి వద్ద నక్సల్స్ 23 క్లైమోర్ మైన్లు బ్లాస్ట్ చేశారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడి నిన్న మళ్లీ తిరుమల శ్రీవారికి సీఎంగా 14వ సారి పట్టు వస్త్రాలు సమర్పించాను.
రాజకీయ, ఆర్దిక, సామాజిక, సమస్యల గురించి నక్సల్స్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తే నాపై క్లైమోర్ మైన్స్ పేల్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం నా ప్రాణాలు త్యాగం చేయడానికైనా సిద్దపడ్డాను. రాయలసీమలోనూ కరడు గట్టిన ఫ్యాక్షన్ రాజకీయాలను రూపు మాపాం. టీడీపీ తీసుకున్న విధానాల వల్లే రాయలసీమలో ఇప్పుడు ఫ్యాక్షన్ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మత విద్వేషాలనూ సమర్దవంతంగా కట్టడి చేశాం.
గత పాలకుల హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఎమ్మెల్యేల ఆవేశానికీ అర్ధం ఉంది. అయితే వారు ప్రవర్తించిన విధంగానే మనం కూడా ప్రవర్తించకూడదు. తప్పు చేసిన ఎవరికైనా శిక్ష తధ్యం. చట్ట ప్రకారం ప్రభుత్వం వ్యవహరిస్తుంది. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదు. స్వర్ణాంధ్ర 2047 విజన్ కు అనుగుణంగా ఏపీ ముందుకు వెళ్లాలి. అగ్రస్థాయి రాష్ట్రంగా ఏపీ ఉండాలి” అని సీఎం చంద్రబాబు అన్నారు.
సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం కట్టడికి చర్యలు
“సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రచారాలు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం. గత పాలకుల హయాంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి పోలీసు వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. కూటమి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఒక్కొ వ్యవస్థనూ సరిదిద్దుకుంటూ వస్తున్నాం. నేరస్థులకు అండగా ఉండే రాజకీయాలను నేను ఇంతవరకూ చూడలేదు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులను బయటపెట్టాలి. వారి ముసుగు తీస్తే ప్రజలే అర్ధం చేసుకుంటారు.
నిద్ర లేచినప్పటి నుంచి నిద్ర పోయే వరకూ జాగ్రత్తగా ఉండే నాపై కూడా సామాజిక మాధ్యమాల్లో ఫేక్ పోస్టులు పెడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేటియం బ్యాచ్ లను పెట్టి పెద్ద ఎత్తున ఫేక్ న్యూస్ ప్రచారం చేయిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారం పోయాక మరోలా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తీవ్రస్థాయిలో వేధింపులు చేస్తున్నారు. వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ వ్యవహారంపై క్యాబినెట్ సబ్ కమిటీ వేశాం. ఫేక్ ప్రచారాలు చేసే నేరస్తులు ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకువస్తాం. మహిళలపై కించపరిచేలా పోస్టులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ తరహా నేరాలపై సీరియస్ గా వ్యవహరిస్తాం.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు
క్రిమినల్స్ తో కలిసి పోయి ముఖ్యమంత్రికే నోటీసులా
“వివేకా హత్య తర్వాత క్రైమ్ సీన్ లో సీఐ శంకరయ్య ఉన్నారు. సీఎంకు నోటీసులు పంపించటం అంటే ఎంత ధైర్యం చేసి ఉండాలి. నేరం జరిగినప్పుడు సీన్ ఆఫ్ అఫెన్సులో సీఐగా విధులు నిర్వహించి నేరం జరిగిన ప్రాంతాన్ని రక్షించాలి. కానీ క్రిమినల్స్ తో కలిసి పోయి ముఖ్యమంత్రికే నోటీసు పంపించే స్థాయికి సీఐ శంకరయ్య చేరుకున్నారు.
వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రిగా నన్నూ ఏమార్చారు. అక్కడున్న రక్తాన్ని శుభ్రం చేశారు. ఏమీ తెలియని వారిలా అమాయకంగా వచ్చి స్టేట్ మెంట్ ఇచ్చారు. చివరకు గుండె పోటు కాదు గొడ్డలి పోటు అని తేలింది. ఫేక్ రాజకీయాలకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. రాజకీయపరంగా చాలా మందిని ఎదుర్కొన్న నేను ఇప్పుడు నేరస్తుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది”. అని సీఎం అన్నారు.
రౌడీ రాజకీయాలు చెల్లవు
“పొగాకు రైతుల్ని పరామర్శించడానికి అని వెళ్లి సినిమా డైలాగులు వేశారు.
మహిళలను కించపరిచేలా పోస్టింగ్లు పెట్టి అవమానించారు. సింగయ్యను కారు కింద తొక్కించేసి తిరిగి బురదజల్లే ప్రయత్నం చేశారు. కనీసం మానవత్వం లేకుండా పొదల్లోకి విసిరేసి వెళ్లిపోయారు. తిరిగి మృతుడి భార్యతో అసత్యాలు చెప్పించారు. తన భర్త జగన్ కారు కిందపడి చనిపోలేదు, పోలీసులు అంబులెన్సులో తీసుకెళ్లి చంపేశారని ప్రకటన చేయించారు. మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లి రోడ్డుపై మామిడికాయలు ట్రాక్టర్లతో తొక్కించారు. రౌడీ రాజకీయాలకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. కూటమి ప్రభుత్వంలో రౌడీ రాజకీయాలు చేయాలంటే కదరదు’ అని సీఎం స్పష్టం చేశారు.
మహిళలపై నేరాలను కట్టడి చేశాం
మహిళలపై రాష్ట్రంలో నేరాలు తగ్గాయి. గతంతో పోల్చుకుంటే 4.84 శాతం మేర మహిళలపై నేరాలు తగ్గాయి. వరకట్న మరణాలు 43 శాతం తగ్గాయి. మహిళా హత్యలు 15 తగ్గాయి. మహిళా ఆత్మహత్యలు 59 శాతం తగ్గాయి. మహిళలపై సైబర్ వేధింపులు 17 శాతం తగ్గాయి. వరకట్న వేధింపులు 25 శాతం తగ్గాయి. మహిళలపై నేరాలకు పాల్పడ్డ వారిలో 343 మందికి శిక్షలు పడ్డాయి. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చిరిస్తున్నాం.
మహిళలపై నేరం జరిగితే కేవలం 8-10 నిముషాల్లోపే ఘటనా స్థలికి చేరుకునేలా చర్యలుచేపట్టాం. శక్తి టీమ్ లను ఏర్పాటు చేసి మహిళల రక్షణపట్ల చర్యలు చేపడుతున్నాం.సెక్సువల్ అఫెండర్లపైనా రౌడీషీట్లను ఓపెన్ చేస్తాం, ఆన్ లైన్ లోనూ నేరస్తుల ఫోటోలు పెడతాం. రాష్ట్రంలో ఓ ఉద్యమంగా డ్రగ్స్ నియంత్రణ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈగల్ టాస్క్ ఫోర్సు ద్వారా గంజాయి, మాదక ద్రవ్యాలను కట్టడి చేస్తున్నాం. రాష్ట్రంలో గంజాయిని జీరో కల్టివేషన్ స్థాయికి తీసుకువచ్చాం.
అయితే పొరుగు రాష్ట్రాల నుంచి కొంతమేర అక్రమంగా రవాణా అవుతోంది. రాష్ట్రంలో సైబర్ ఫ్రాడ్స్ కోట్లలో నష్ట పోతున్నారు. బాగా చదువుకున్న వ్యక్తులు కూడా సైబర్ ఫ్రాడ్స్ ఉచ్చులో పడి డబ్బు నష్ట పోతున్నారు. సైబర్ క్రైమ్స్, ఫ్రాడ్స్ ఉచ్చులో పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టాం. ఫోరెన్సిక్స్ ను కూడా బలోపేతం చేస్తున్నాం. శాంతిభద్రతల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.