Suryaa.co.in

Andhra Pradesh

ఫర్‌ఫెక్ట్‌ మినిస్టర్‌…పవన్‌ కల్యాణ్‌!

– కూటమి 100 రోజుల పాలనలో డిప్యూటీ సీఎం మార్క్‌
– ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ల అభివృద్ధి లక్ష్యంగా అడుగులు
– గ్రామీణాభివృద్ధి మంత్రిగా ‘పవన్‌’ ఆలోచనతో వరల్డ్‌ రికార్డు
– ప్రతీ ఇంటికీ మంచినీటి పంపిణీ, ఊరూరా రోడ్ల అభివృద్ధి
– ‘కొణిదెల’ సలహాతో రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్యగణనకు ప్రభుత్వం దృష్టి
– ‘ఇది మంచి ప్రభుత్వం’ అనేందుకు నిదర్శనాలెన్నో…
– బాబు, పవన్‌ల జంటగా ‘సంక్షేమాంధ్ర’ సాధ్యమంటోన్న విశ్లేషకులు

అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. రాజకీయ దిగ్గజం, అనుభవజ్ఞుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, సంచలనాత్మక రాజకీయవేత్తగా అనతికాలంలోనే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ పేరు సంపాదించారు. వీరిద్దరి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో సుభిక్షమైన పాలన కొనసాగుతోంది.
ఈ వంద రోజుల్లో పాలనాపరంగా వారిద్దరూ కలిసి వెయ్యి అడుగులు ముందుకేశారు. ముఖ్యంగా కేబినెట్‌ మంత్రుల్లో అందరి కంటే డిప్యూటీ సీఎం, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీశాఖ మంత్రిగా పవన్‌ కల్యాణ్‌ పాలనలో నిర్ణయాత్మక శక్తిగా దూసుకుపోతోన్నారు. తనకు కేటాయించిన శాఖలకు సంబంధించి మాటల్లో కంటే చేతల్లోనే పనితీరును కనబరుస్తూ .. క్షేత్రస్థాయిలో ఎన్నో అభివృద్ధి మార్పులు చేయగలిగారు.

స్వర్ణ గ్రామ పంచాయతీ ఆలోచనతో వరల్డ్‌ రికార్డ్
గ్రామాలు స్వయం సమృద్ధి సాధించి ‘స్వర్ణ పంచాయతీ’లుగా అభివృద్ధి చెందేలా చేయడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం పేరిట ఒకే రోజు గ్రామసభల నిర్వహణ అనేది డిప్యూటీ సీఎం మదిలో పుట్టిన మంచి ఆలోచన. స్థానిక సంస్థలకు గతంలో రూ.990 కోట్ల నిధులను ఆర్థిక సంఘం ఇవ్వలేదు. వాటిని కూటమి ప్రభుత్వం వచ్చాక మంజూరు చేసింది. మరో రూ.1100 కోట్లు కేంద్రం నుండి మ్యాచింగ్‌ గ్రాంట్‌గా వచ్చాయి. మరో రూ.2 వేల కోట్లను కేంద్రం అందిస్తుంది.

ఉపాధి హామీ పనిదినాలను ఆమోదించేందుకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు పెట్టాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 23వ తేదీన 13, 326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టారు. ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణంలో సర్పంచుల అధ్యక్షతన జరిగిన గ్రామ సభల్లో లక్షలాది గ్రామీణులు, రైతులు, కూలీలు, అధికారులు, కలెక్టర్‌లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వానపల్లి గ్రామంలో, ఉప ముఖ్యమంత్రి మైసూరవారిపల్లెలో నిర్వహించిన గ్రామ సభలకు హాజరయ్యారు.

ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లో సాగించే అభివృద్ధి పనుల మీద, వివిధ ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుని గ్రామాలు ఎలా అభివృద్ధి బాటలో సాగాలన్న దానిపై విస్తృతంగా చర్చలు జరిపారు. గ్రామ సభల్లో ఒకేరోజున రూ. 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులను ఆమోదిస్తూ తీర్మానాలు చేశారు. ఈ పనుల కారణంగా తొమ్మిది కోట్ల మందికి ఉపాధి లభించేలా, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి ఫలాలు అందేలా గ్రామ సభల్లో నిర్ణయాలు జరిగాయి. గ్రామాల్లో సీసీ రోడ్ల అభివృద్ధి, డ్రైన్లు, పశువుల పాకలు, చెరువుల పూడికతీత, హార్టీకల్చర్‌ పనులు, చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలు, మైనర్‌ ఇరిగేషన్‌ల ట్యాంకులు తదితర పనులు చేసుకునేందుకు గ్రామస్తులంతా ఆమోదం పలికారు.

అతిపెద్ద గ్రామ పాలనగా రికార్డు ఇది
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆలోచన మేరకు రాష్ట్రం అంతా ఒకేరోజు జరిగిన ఈ గ్రామ సభల నిర్వహణ కార్యక్రమం భారతదేశంలోనే జరిగిన అతిపెద్ద గ్రామ పాలనా కార్యక్రమంగా ప్రపంచ రికార్డులకెక్కింది. ఇదే స్ఫూర్తిని, గ్రామాల భవిష్యత్తు కీర్తిని కొండంత ఆశయ దీప్తితో ముందుకు తీసుకెళ్లి గ్రామ స్వపరిపాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పలు సందర్భాల్లో చెప్పారు.

కుళాయి ద్వారా మంచినీరు
ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా దృఢమైన సంకల్పంతో వికసిత్‌ భారత్‌–2047తో ముందుకు వెళ్తున్న క్రమంలో.. వారి ఆశయాలకు తగ్గట్టు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆలోచనా విధానాన్ని పరిపాలనలో చూపిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువతను దృష్టిలో ఉంచుకుని వరల్డ్‌ క్లాస్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగాలు, ఇతర మార్పుల కోసం అహరహం తపిస్తున్నారు. జల్‌ జీవన్ మిషన్ పథకానికి కేంద్రం 50 శాతం నిధులిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం కేంద్రమిచ్చే డబ్బులు సరిగా ఖర్చు చేయకుండా పథకాన్ని రాష్ట్రంలో నిర్వీర్యం చేసింది. దీనిపై మళ్లీ కేంద్రాన్ని ఒప్పించి జల్‌ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీరు అందించేందుకు పవన్‌ ప్రణాళిక చేశారు. ఆ దిశగా తన శాఖలకు సంబంధించిన సమీక్షల్లో అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

‘పవన్‌’ సలహాతో గ్రామాల్లో నైపుణ్య గణన
రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య గణన (స్కిల్‌ సెన్సెస్‌)కు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. యువత ఉపాధికి సంబంధించిన ప్రక్రియలో నైపుణ్య గణన చేస్తే బావుంటుందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన సూచనలతో దేశంలోనే మొదటిసారిగా నైపుణ్య గణన చేపట్టబోతున్నా మని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటి వర కు నైపుణ్యాల గణన అంటే కేవలం చదువులు పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారినే ప్రధాన లక్ష్యంగా పెట్టుకునేవారు. కానీ, ఇప్పుడు దీనికి భిన్నంగా రాష్ట్రంలోని 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న అందరి నైపుణ్యాలను లెక్కించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల మంది నైపుణ్యాలు, వారి నైపుణ్యాల మెరుగుదలకు ఆసక్తులను తెలుసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

రాష్ట్రానికి మంచి చేసిన ‘వైసీపీ విముక్త రాష్ట్రం’ నినాదం
వైసీపీ పాలనలో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. పరామర్శకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాకుండా బుక్‌ చేసుకున్న విమానాన్ని రద్దు చేశారు. రోడ్డు మార్గాన వస్తుంటే నందిగామలో అడ్డుకోవడంతో, పవన్ రోడ్డుపై పడుకుని ధర్నాకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. సాధారణంగా షూటింగ్‌లో చేయాల్సినవి ఆయన నిజ జీవితంలో చేసి పోరాట యోధునిగా పవన్ నిలిచారు. అప్పుడే ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా మార్చాలని నినాదం అందుకుని ప్రజల్లో ఆయన చైతన్యాన్ని రగిల్చారు. ఫలితంగా, నేడు ఆంధ్ర ప్రజలు మంచి రోజులను చూస్తున్నారు.

ఆ అడుగు సంచలనం
రాజకీయాల్లోకి పవన్‌ కల్యాణ్‌ ఒక ఆశయంతో వచ్చారు. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తుపెట్టుకున్న సమయంలో ఓట్లు చీల్చకూడదని.. పోటీకి దూరంగా వుండి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు అంతా భయానక రాజ్యం నడుస్తోంది. టీడీపీ అధినాయకత్వం సైతం బిక్కమొహమేసి దిక్కులు చూస్తున్న కాలంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ధైర్యంగా ఒకే ఒక్క అడుగేశారు.

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబును కలిసిన అనంతరం రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని ఆనాడు వారిద్దరూ నిర్ణయించుకున్నారు. సీట్లు సర్దుబాటుతో పాటు ఇతర అంశాల్లోనూ ఎక్కడా సమస్య రాకుండా చూసుకున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో వుంటే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆలోచించారు. పవన్‌ తెగువ నిర్ణయాలతో మొత్తానికి కూటమి సక్సెస్‌ అయ్యింది. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది.

ఆలోచనల్లో భిన్నత్వం.. రాష్ట్రాభివృద్ధికి ఏకత్వం
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఎన్నో అవకతవకలకు పాల్పడింది. ఖర్చుపెట్టిన డబ్బుకు లెక్కలు చూపలేదు. కేంద్రమిచ్చిన నిధులను మళ్లించుకున్నారు. ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ వారు మెచ్చుకునేలా ప్రజాప్రతినిధుల నడవడిక ఉండాలని పవన్‌ కల్యాణ్‌ పలు సభల్లో పదేపదే ప్రస్తావిస్తూ ఉంటారు.

గత పాలకులు విచ్చలవిడిగా రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారు. లక్ష కోట్ల బిల్లులు పెండింగులో పెట్టారు. ఇలాంటి కష్టసమయంలో అధికారంలోకి వచ్చామని.. కష్టనష్టాలను అన్నింటినీ అధిగమించి కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నదే పవన్‌ తాపత్రయం. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కలిగించాలన్నదే ఆయన ధ్యేయం. ఏదేమైనప్పటికీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సూపర్‌ కాంబినేషన్‌ కేవలం వందరోజుల్లోనే సూపర్‌ హిట్‌ అయ్యిందని.. వారి జంటతోనే రాష్ట్రం సంక్షేమాంధ్రగా కళకళలాడుతోందని రాజకీయ, సామాజిక విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A RESPONSE