– తక్షణమే పార్టీ తరపున నామినేషన్లు వేసిన ఇతర అభ్యర్థులు ఉపసంహరించుకోండి
– రెబల్ గా పోటీ చేయాలనుకుంటే వాళ్లను 15 ఏళ్లపాటు పార్టీ నుండి సస్పెండ్
– పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి మరియు కొన్ని పరిస్థితులలో టిక్కెట్లు రానివారికి పార్టీపరంగా గౌరవిస్తాం
– బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు వెల్లడి
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి బి.ఫాం ఇచ్చిన వాళ్లు మాత్రమే ఎన్నికల బరిలో ఉండాలని, నామినేషన్లు వేసిన మిగిలిన బీజేపీ నాయకులంతా పార్టీ శ్రేయస్సు ద్రుష్ట్యా తక్షణమే నామినేషన్లను ఉపసంహరించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు కోరారు. ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘అనేక సర్వే నివేదికల ఆధారంగా, సామాజిక పరమైన అంశాలతో మరియు పార్టీ ప్రత్యేక అంశాలతో గెలిచే అవకాశాలు ఉన్నాయన్న అభ్యర్థులకే పార్టీలోని ముఖ్యమైన వారు సామూహికంగా కలిసి టిక్కెట్లు ఖరారు చేయడం జరిగింది. టిక్కెట్ రానివాళ్లు బాధపడడం సహజం. గత అనేక సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కోసం గెలుపు కోసం పనిచేస్తున్న కార్యకర్తలు వారిని పార్టీ గుర్తుంచుకుంటుంది.
పార్టీ కార్యకర్తల కృషి, బిజెపి పట్ల ప్రజలకున్న విశ్వాసంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీ ఘనవిజయాలను సాధించింది.ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కార్యకర్తల కృషితో ప్రజల మద్దతుతోనే పార్టీ మున్సిపల్ ఎన్నికలలో విజయ పరంపర కొనసాగిస్తుందన్న విశ్వాసం రాష్ట్ర పార్టీకి పూర్తిగా ఉంది.
వెంటనే నామినేషన్లను ఉపసంహరించుకుని వారి డివిజన్లు, వార్డుల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధుల గెలుపు కోసం పనిచేయాలి’’అని కోరారు.పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తే మాత్రం పార్టీ రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా పరిగణిస్తుందని తెలిపారు.
ఎవరైనా నామినేషన్లను ఉపసంహరించుకోకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకుంటే వాళ్లను 15 ఏళ్లపాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులోనూ అలాంటి వారిని తిరిగి బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.