Suryaa.co.in

Andhra Pradesh

అయిదేళ్ళలో పోలార్ రీసెర్చి నౌక సిద్ధం

-రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆగస్టు 3: వచ్చే అయిదేళ్ళలో భారత్‌లో పోలార్‌ రీసెర్చి నౌకను సిద్ధం చేస్తామని భూవిజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు ప్రకటించారు. ఆర్కిటిక్‌, ఆంటార్కిటిక్‌ ప్రాంతంలో భారత్‌ మూడు శాస్త్ర పరిశోధన కేంద్రాలను నెలకొల్పినప్పటికీ పదేళ్ళుగా పోలార్‌ రీసెర్చి నౌక (ఐస్‌ బ్రేకర్‌ నౌక) నిర్మాణంలో ఎందుకు విఫలమయ్యామని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఐస్‌ బ్రేకర్‌ నౌక నిర్మాణంలో ఎదురైన ఆటంకాలు, అవాంతరాలను సుదీర్ఘంగా వివరించారు.

భారతి, మైత్రి, హిమాద్రి పేరిట ఉత్తర, దక్షిణ ధృవాలలో భారత్‌ మూడు శాస్త్ర పరిశోధ కేంద్రాలను నెలకొల్పింది. ఈ కేంద్రాలకు నిరంతర రాకపోకలు సాగించడానికి ఐస్‌ బ్రేకర్‌ నౌక చాలా అవసరం. ఉత్తర, దక్షిణ ధృవాలలో నెలకొల్పిన ఈ రీసెర్చి స్టేషన్లు వాతావరణ మార్పులపై విస్త్రత శాస్త్ర పరిశోధనలు జరుపుతున్న నేపథ్యంలో పలు కారణాలరీత్యా ఐస్‌ బ్రేకర్‌ నౌకను సమకూర్చుకోవడం కీలకంగా మారిందని మంత్రి చెప్పారు. ఈ నౌకను సకాలంలో సమకూర్చుకోలేకపోవడం తనకూ బాధాకరంగా ఉందని అన్నారు.

1051 కోట్ల రూపాయల వ్యయంతో పోలార్‌ రీసెర్చి నౌక (ఐస్‌ బ్రేకర్‌ నౌక)ను సమకూర్చుకోవడానికి 2014లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. ఐస్‌ బ్రేకర్‌ నౌక నిర్మాణం కోసం టెండర్‌ పిలిచి ఒక కంపెనీకి పని అప్పగించడం జరిగింది. అయితే టెండర్‌లో పేర్కొన్న కొన్ని నిబంధనలపై ఆ కంపెనీ అభ్యంతరాలు లేవనెత్తడంతో నౌక నిర్మాణం నిలిచిపోయిందని మంత్రి వివరించారు. 2600 కోట్లతో ఐస్‌ బ్రేకర్‌ షిప్‌ను నిర్మించడానికి తాజాగా ఈఎఫ్‌సీ ప్రతిపాదనలు ఇచ్చింది.

నౌకా నిర్మాణ వ్యయం అమాంతంగా రెండు రెట్లు పెరిగినందున ఈ ప్రతిపాదనను చాలా నిశితంగా పరిశీలించడం జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దీనిపై తుది అంచనా వ్యయాన్ని రూపొందించి మంత్రివర్గం ఆమోదం పొందే ప్రయత్నం చేస్తున్నాం. మరో అయిదేళ్ళలో పోలార్‌ రీసెర్చి నౌక సిద్ధం అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తరహా నౌకల తయారీలో ఆపార నైపుణ్యం కలిగిన రష్యా వంటి దేశాలతో షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని ఆయన తెలిపారు.

 

LEAVE A RESPONSE