Suryaa.co.in

Andhra Pradesh

గత ప్రభుత్వ పాలనలో పోలవరం విధ్వంసం

• గత ఐదేళ్ల హయాంలో నీటిపారుదల శాఖ 20 ఏళ్లు వెనక్కి
• 2019లో ప్రభుత్వం మారడమే పోలవరం ప్రాజెక్టుకు శాపం
• సాగు, తాగునీటి రంగాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది
• పోలవరం పర్యటన, వరుస సమీక్షలు చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం
• నదుల అనుసంధానానికి, రైతాంగ సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎనలేని కృషి
• ఇకపై ఏటా పద్మభూషణ్ డా.కె.ఎల్.రావు, సర్ ఆర్థర్ కాటన్, మోక్షగుండం శ్రీరామకృష్ణయ్య జయంతోత్సవాలు
– జలవనరులశాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు

విజయవాడ: గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైందని, వారి నిర్లక్ష్యంతోనే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం విజయవాడలోని కె.ఎల్.రావు ఘాట్ లో రాష్ట్ర జలవనరులశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పద్మభూషణ్’ డా. కానూరి లక్ష్మణరావు 122వ జయంతి వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

డా.కె.ఎల్.రావు చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికుడు, తెలుగుజాతి గర్వించదగిన ఇంజనీరు, ‘పద్మభూషణ్’ డా. కానూరి లక్ష్మణరావు అని, ఆయన జయంతి వేడుకలు నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. నీటి పారుదల రంగానికి విశేష సేవలు అందించి, భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన సర్ ఆర్థర్ కాటన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, డా.కె.ఎల్.రావు, శ్రీరామకృష్ణయ్య వంటి మహనీయుల జయంతి వేడుకలను 2014-2019 ప్రభుత్వ పాలనలో ఎంతో ఘనంగా నిర్వహించామని తెలిపారు.

అయితే, గత ప్రభుత్వ పాలనలో సాగు, తాగునీటి రంగాలకు విశేష సేవలు అందించిన మహనీయుల జయంతి కార్యక్రమాలను నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. నాగార్జున సాగర్ రూపశిల్పి, కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసిన కె.ఎల్.రావు విగ్రహానికి కనీసం రంగు వేసిన పాపాన కూడా పోలేదన్నారు. గత ఐదేళ్ల పాలనలో వారు చూపిన నిర్లక్ష్యంతోనే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందన్నారు.

అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. గౌరవ సీఎం చంద్రబాబు తొలి పర్యటనగా పోలవరం వెళ్లారని, ప్రతి సోమవారం పోలవరంపై సమీక్షలు నిర్వహిస్తున్నారని ఇది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

జల భారత భాగ్యవిధాత.. అపర భగీరథుడు డా.కె.ఎల్. రావు..
నీటిపారుదల రంగంలో దేశాన్ని డా.కె.ఎల్. రావు తన దేశభక్తి, మేధాసంపత్తితో స్వయంసమృద్ధిగా తీర్చిదిద్దారని తెలిపారు. గ్రావిటీ డ్యాములు, ఆర్చి డ్యాములు, కాంక్రీట్ డ్యాములు, రాతి ఆనకట్టలు, విద్యుదుత్పాదక కేంద్రాలు, పులిచింతల వంటి ఎన్నో బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణాలు ఎటువంటి విదేశీ నిపుణుల సహకారం లేకుండా రూపొందాయంటే అది కె.ఎల్.రావు ఘనతే అని కీర్తించారు.

చంబల్ లోయలోని ఆనకట్టలు, మహానది మీద హిరకుడ్, గంగానది మీద ఫరక్క బ్యారేజ్, తరచూ వరదలతో బీభత్సం సృష్టిస్తూ భారత దుఃఖ నదిగా పేరుబడ్డ దామోదర నదిపై కోసీ బ్యారేజ్, తపతీ నది మీద ఉకై, కర్ణాటకలో సర్వాధి ప్రాజెక్ట్, మేఘాలయలో ఉనియం, కృష్ణా నది మీద శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆనకట్టల నిర్మాణాలకు ఆద్యులు అపరభగీరథుడు కె.ఎల్.రావు అని వివరించారు.

అటువంటి మహనీయుని సేవలను గుర్తు చేసుకుంటూ చంద్రబాబు, పవన్, మోదీ కూటమి ప్రభుత్వంలో నేడు 122వ జయంతి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

కె.ఎల్.రావు కలల సాకారం దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారని, నదుల అనుసంధానానికి పెద్దపీట వేసేలా పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. పోలవరం 7 ముంపు మండలాలను ఏపీలో విలీనం చేసేందుకు ఎంతో శ్రమించారని, ఆ 7 ముంపు మండలాల వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని గుర్తు చేశారు.

2019లో ప్రభుత్వం మారడం పోలవరానికి శాపం..
2014-19 ప్రభుత్వ కాలంలోనే పోలవరం పనులను 72 శాతం చంద్రబాబు పూర్తి చేశారన్నారు. కానీ 2019లో ప్రభుత్వం మారడం పోలవరం ప్రాజెక్టుకు శాపం అయ్యిందన్నారు. ఏజెన్సీలను మార్చడం, రద్దు చేయడం వంటి కార్యక్రమాలతో దాదాపు 13 నెలలు ప్రాజెక్టులో పనులు చేయకుండా ఖాళీగా ఉంచారన్నారు. ఐఐటీ హైదరాబాద్ నిపుణులు కూడా గత ప్రభుత్వ విధ్వంసం మీద, నష్టాల మీద రిపోర్టు కూడా ఇచ్చారన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యధోరణితో నెలకొన్న సవాళ్లను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. ఇకపై ప్రతి ఏటా సర్ ఆర్థర్ కాటన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, డా.కె.ఎల్.రావు, శ్రీరాం కృష్ణయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. అధికారులు కూడా ఇందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు.

శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సీఎం చంద్రబాబు పోలవరం పర్యటించి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారని, వరుస రివ్యూలు చేపడుతున్నారన్నారు. డా.కె.ఎల్. రావు ఇంజనీర్‌గా మాత్రమే కాకుండా దేశం కూడా అన్నివిధాలా అభివృద్ధి చెందాలని తపించిన మహనీయులు కె.ఎల్.రావు అని కీర్తించారు.

అనంతరం.. నీటిపారుదల శాఖ రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్లు ఆర్. సతీష్ కుమార్, బి.ఎస్.ఎస్. శ్రీనివాస్ యాదవ్, ఎం.వి. కృష్ణారావు, కె.వి. కృష్ణారావు, మారుతి ప్రసాద్‌లను మంత్రి శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో అడ్వైజర్ ఎం. వెంకటేశ్వరరావు, ఇంజనీర్ చీఫ్ అడ్మిన్ కె. శ్రీనివాస్, హైడ్రాలజీ సీఈ కుమార్, మైనర్ సీఈ సాయిరామ్ ప్రసాద్, ఎస్ఈ టి.జె.హెచ్ ప్రసాద్ బాబు, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఎస్.తిరుమల రావు, అపెక్స్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎ.గోపాలకృష్ణ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE