Suryaa.co.in

Telangana

పోలీస్ ఉద్యోగం.. ఒక భావోద్వేగం

  • పోలీస్ సిబ్బంది పిల్లలకోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్
  • గ్రూప్-1 అభ్యర్థులంతా మెయిన్స్ పరీక్షకు హాజరవండి
  • దయచేసి ఆందోళన విరమించండి
  • నిరుద్యోగులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని పోలీసులను కోరుతున్నా
  • టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • హాజరైన డీజీపీ జితేందర్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు స్ఫూర్తిని ఇచ్చేలా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. రాష్ట్ర ఏర్పాటులో పోలీసు సోదరులది కీలకపాత్ర. తెలంగాణ రాష్ట్ర సాధనలో పోలీస్ కిష్టయ్య త్యాగం ఎప్పటికీ మరిచిపోలేం. పోలీస్ ఉద్యోగం ఒక ఉద్యోగం మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం.

పోలీస్ శాఖ గౌరవం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట పెరుగుతుంది. చిన్న పొరపాటు జరిగినా అది ప్రభుత్వానికి చెడ్డపెరు తెస్తుంది. పోలీస్ సేవలు, త్యాగం వల్లే ప్రజలు నిర్భయంగా ఉండగలుగుతున్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ అభివృద్ధికి పోలీస్ సేవలు అభినందనీయం.

పోలీసుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 50 ఎకరాల్లో పోలీస్ సిబ్బంది పిల్లలకోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చే అకడమిక్ ఇయర్ లో స్కూల్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.. భవిష్యత్ లో పోలీస్ స్కూల్ లో చదివామని గర్వంగా చెప్పుకునేలా తీర్చిదిద్దుతాం.మొదటి విడతగా 5 నుంచి 8 వతరగతి వరకు మొదలు పెడతాం.. ఆ తరువాత ఒక్కో తరగతిని పెంచుకుంటూ వెళతాం.

తెలంగాణ పోలీస్ దేశంలోని మిగతా రాష్ట్రాల పోలీస్ కు ఆదర్శంగా నిలవాలి.రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి.సైబర్ క్రైమ్ ను నియంత్రించి, ప్రజలకు అవగాహన కల్పించాలి.డ్రగ్స్, సైబర్ క్రైమ్ విషయంలో దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టొద్దు.

తెలంగాణ నిరుద్యోగులకు మీ సోదరుడిగా నా సూచన ఒక్కటే…పదేళ్లుగా వాయిదా పడుతున్న అన్ని ఉద్యోగాలను మన ప్రభుత్వంలో భర్తీ చేసుకుంటున్నాం. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది తప్ప నియామకాలు చేపట్టలేదు.కొందరు స్వార్ధ రాజకీయ ప్రయోజనం కోసం నియామకాల భర్తీ జరగకుండా ప్రయత్నించారు.అయినా అన్నింటినీ ఎదుర్కొని మేం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసాం.

గ్రూప్-1 విషయంలో నిరుద్యోగులు అపోహలు నమ్మొద్దు. జీవో 29 ప్రకారమే ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1:50 ప్రకారం మెరిట్ ఆధారంగా మెయిన్స్ కు సెలెక్ట్ చేసాం. గ్రూప్-1 విషయంలో కొన్ని రాజకీయపార్టీలు వితండవాదం చేస్తున్నాయి. మధ్యలో నిబంధనలు మారిస్తే కోర్టులు పరీక్షల్ని రద్దు చేసిన దాఖలాలు ఉన్నాయి.

జీవో 55 ప్రకారం భర్తీ చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నష్టపోతారు. అందుకే అందరికీ న్యాయం జరగాలనే జీవో 29 ను ప్రభుత్వం తీసుకొచ్చింది. పదేళ్లు అధికారంలో ఉన్నపుడు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని వారు ఇవాళ మిమ్మల్ని దగ్గరికి పిలిస్తున్నారు.ఇది కొంగ జపం కాదా.. ఒక్కసారి ఆలోచించండి.

గ్రూప్-1 అభ్యర్థులంతా మెయిన్స్ పరీక్షకు హాజరవండి.. లేకపోతే ఒక బంగారు అవకాశం కోల్పోతారు.న్యాయస్థానాలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష విధానాన్ని సమర్ధించాయి. ఆనాడు నిరుద్యోగులను రెచ్చగొట్టి.. వారి ప్రాణాలు బలిగొని రాజకీయాల్లో ఉన్నత పదవులు అనుభవించారు..పదేళ్లలో వాళ్లు నిరుద్యోగులను కనీసం పట్టించుకోలేదు. నిరుద్యోగులు వాళ్ల ఉచ్చులో పడొద్దు..దయచేసి ఆందోళన విరమించండి.. అపోహలు వీడండి.

అపోహల సంఘం మీ జీవితాలతో చెలగాటమాడాలనుకుంటుంది. వీళ్లు ఎలాంటి దుర్మార్గులో ఒకసారి నెమరు వేసుకోండి. ఆందోళనలో పాల్గొంటున్న నిరుద్యోగులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని పోలీసులను కోరుతున్నా. వాళ్లు గ్రూప్-1 అధికారులుగా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు.

LEAVE A RESPONSE