Suryaa.co.in

Andhra Pradesh

పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయండి

  • టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
  • పులుల వేట… స్మగ్లింగ్ పై కఠినంగా వ్యవహరిస్తాం
  • పులులను కాపాడితే… అవే అడవులను రక్షిస్తాయి… పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుంది
  • ‘మన్ కీ బాత్’లో నల్లమలలో టైగర్ ట్రాకర్స్ గా చెంచుల గురించి ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించడం సంతోషకరం
  • వసుధైక కుటుంబంలో వన్య ప్రాణులూ భాగమే
  • అటవీ శాఖలో ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కారానికి చర్యలు
  • అంతర్జాతీయ పులుల దినోత్సవం కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్

మంగళగిరి: అడవిలో ఉండే పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయి, తద్వారా పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుంది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

గ్లోబల్ టైగర్ డే సందర్భంగా సోమవారం ఉదయం మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ టైగర్ డే పోస్టర్ విడుదల చేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన) ఏర్పాటు చేసిన టైగర్స్ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు.

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ హాబీ కలిగిన బేబీ నాయన , ఆయన మిత్రులు దేశంలోని జాతీయ పార్కులు, టైగర్ సఫారీల్లో తీసిన పులుల ఫోటోలను అక్కడ ప్రదర్శించారు. రాష్ట్రంలో పులుల సంఖ్య, అభయారణ్యంలో తీసుకోవలసిన భద్రత చర్యలపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “భారతీయ సంస్కృతిలో ప్రతి ప్రాణి వసుధైక కుటుంబంలోకే వస్తుంది. అడవులు మన సంస్కృతిలో భాగం. అక్కడుండే ప్రాణులు కూడా మనకు ఎంతో అవసరం. వాటి సంరక్షణ బాధ్యతలు మనమే తీసుకోవాలి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ20 సమయంలో వసుధైక కుటుంబం గురించి చెబుతూ ప్రకృతిలో భాగమైన చెట్లు, జంతుజాలం, క్రిమికీటకాలు.. అన్నీ వసుధైక కుటుంబంలో భాగమే అన్నారు.

వాటిని కూడా మనం కాపాడుకోవాలి. అటవీశాఖా మంత్రిగా రాష్ట్రంలోని అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు పూర్తిగా నేను కట్టుబడి ఉన్నాను. అధికారులు సైతం ఇదే లక్ష్యంతో పని చేయాలి. వారికి ఈ విషయంలో నా నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ప్రకృతితో కలసి బతకాలి అన్నది విశ్వమానవ సిద్ధాంతం. అలాంటి ప్రకృతిలో భాగమైన అడవులను వివిధ రకాలుగా వినాశనం చేస్తూ మనిషి తన రోజువారీ జీవితం గడుపుతున్నాడు.

దీనికి ఎక్కడో దగ్గర పుల్ స్టాప్ పడాలి. అడవుల విధ్వంసం అనేది ఆగాలి. అరణ్యాల్లో బతికే వన్యప్రాణులు, వాటి రక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. అక్రమంగా పులుల్ని వేటాడే వారిపైనా, స్మగ్లింగ్ కి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

నా ఇంటి ఆవరణనే చిన్నపాటి అడవిగా మార్చాను

ఇక్కడ ఒక విషయం చెప్పాలి… నా చిన్నతనంలో ఒంగోలులో ఉన్నప్పుడు మా వీధిలోకి ఒక పంగోలిన్ ను అందరూ కలిసి కొట్టేశారు. అది ప్రమాదకరమా అని అడిగితే మాకూ తెలియదు.. ఏమైనా చేస్తుందేమోనని భయంతో కొట్టేశామన్నారు. వన్యప్రాణులపై ముందుగా భయంతోనే హాని తలపెడతారు. వన్య ప్రాణి పరిరక్షణ చట్టం, అటవీ పరిరక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

వసుధైక కుటుంబం అంటే మనుషులతోపాటు పశుపక్షాదులు, చెట్లు, జంతువులు కూడా ఉండాలి. నేను రాజకీయ నాయకుడి కంటే ముందు ప్రకృతి సంరక్షకుడిని. నా ఫాం హౌస్ లో నేను ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా సహజంగా పెరిగే మొక్కలు, చెట్లు, కీటకాలు పెరిగేలా చర్యలు తీసుకున్నాను. దీనివల్ల అనేక పక్షులు అక్కడికి వచ్చి చేరాయి.

దీని కోసం మనం పెద్దగా ఏమీ చేయక్కర్లేదు. ఉన్నంతలో సంరక్షణ చర్యలు చేపడితే చాలు. హైదరాబాద్ లో నేను ఉండే 1400 చదరపు గజాల ఇంటి ఆవరణలోనూ సహజంగా పెరిగే ఏర్పాటు చేస్తే చిన్నపాటి అడవిలా తయారైంది. ఇప్పుడు అక్కడ అరుదైన పక్షులు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తున్నాయి.

నల్లమల శివ, చిగుళ్ళ మల్లికార్జున్ ల మాటలు కదిలించాయి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో పులుల సంరక్షణ గురించి చెబుతూ నల్లమల అడవుల్లో చెంచులు టైగర్ ట్రాకర్స్ గా ఉన్నారనీ, అక్కడ వన్యప్రాణుల సమాచారం అందించడంతోపాటూ అక్రమాలు జరగకుండా నిఘా ఉంచుతారని ఆనందం కలిగించింది. పులులు వారి సంస్కృతిలో అంతర్భాగం అని చెప్పిన మాటలు స్ఫూర్తి కలిగించాయి.

కొన్ని సంవత్సరాల కిందట- నల్లమల ప్రాంతానికి చెందిన చెంచు జాతికి చెందిన 16 ఏళ్ల శివ అన్న కుర్రాడు హైదరాబాద్ లో మా ఆఫీస్ దగ్గరకి వచ్చాడు. అతనితో మాట్లాడినప్పుడు పర్యావరణ పరిరక్షణ మీద చెంచులకి ఉన్న నిబద్దత తెలిసింది. అతను నా దగ్గరకు వచ్చిన పని నల్లమలలో యురేనియం మైనింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే మా అడవులు పోతాయి. పులులు చచ్చిపోతాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. నల్లమల విధ్వంసానికి గురవుతుంది. నా మాట ఎవరు వింటారో తెలియక మీ దగ్గరకు వచ్చాను. ఏమైనా చేయమని అడిగాడు.

ఆ క్రమంలో కాంగ్రెన్ నాయకులు వి. హనుమంతరావు కి చెప్పి నల్లమలలో యురేనియం అన్వేషణపై అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము. ఆ సమావేశంలో చిగుళ్ల మల్లికార్జున్ అనే చెంచుల ప్రతినిధి మాట్లాడిన మాటలు నన్ను కదిలించాయి.

‘నల్లమలలో ఉన్న చెట్లు, జంతువులు, వాగులు అన్నింటినీ మేము దేవతలుగా కొలుస్తాం. పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవర, ఎలుగుబంటిని లింగమయ్యగా చూస్తాం. అడవి పందిని గూబల మస్సి, గారెల మస్సి, బంగారు మైసమ్మ అని పిలుచుకుంటాం. రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా బవరమ్మగా కొలుస్తాము. తేనెలో ఉండే తెల్లగడ్డను మల్లమ్మ అంటాం’ అని అక్కడ తమ ఆచార వ్యవహారాలను, జీవితాన్ని వివరించారు.

పని చేసిన అధికారులకు గుర్తింపు

బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ రాసిన వనవాసి పుస్తకం చదివినప్పుడు ప్రకృతి ప్రాముఖ్యత అర్ధం అయ్యింది. ఇప్పుడు నేను దేవుని దయతో ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. అంతర్జాతీయ పులుల దినోత్సవాన అధికారులకు మాటిస్తున్నాను. ఇక్కడ ఎంతో నిబద్దత కలిగిన అధికారులు ఉన్నారు. అద్భుతంగా పని చేసిన కొంత మంది అధికారులకు గుర్తింపు రాలేదన్న విషయం నాకు తెలిసింది.

గుర్తింపు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చేసిన పని పది మందికి తెలిస్తే అది భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. అధికారులు అటవీ పరరిక్షణ కోసం కలలు కనండి. ప్రణాళికలు సిద్ధం చేయండి. వాటిని అమలుపరిచే బాధ్యత నేను తీసుకుంటా. ప్రజలకు చేరువయ్యేలా పని చేద్దాం. అవసరం అయితే అధికారులు చెప్పిన విధంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో జూ పార్కులు అభివృద్ధి చేద్దాం.

అటవీశాఖ మంత్రిగా, పర్యావరణ ప్రేమికుడిగా పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటాను. అటవీ శాఖలో ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మాట్లాడి అటవీ శాఖకు బడ్జెట్ పెంచే విధంగా, ఉద్యోగుల కొరత భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.

 శ్రీశైలం నుంచి శేషాచలం వరకూ అటవీ కారిడార్

పెద్ద పులుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటాము. నల్లమల, శ్రీశైలం నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేసి అడవులను పెంచేందుకు కృషి చేస్తాము. టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుందాం.

వేటగాళ్లను ఉపేక్షించవద్దు. అటవీ ప్రాంతాల్లో స్థానికులకు జంతుజాలం ఆవశ్యకతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి. అదే విధంగా శ్రీశైలం క్షేత్ర పరిసరాల్లోని అడవుల్లో ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోందని అధికారులు నా దృష్టికి తీసుకువచ్చారు. పర్యావరణహితమైన ఆధ్యాత్మిక యాత్రలు చేసేలా భక్తులకు అవగాహన కల్పించాలి” అన్నారు.

ప్రకృతి పరిరక్షణకు ఉద్యోగులు చేస్తున్న కృషిని అభినందిస్తూ రస్కిన్ బాండ్ రాసిన కవితను చదివి వినిపించారు. పీసీసీఎఫ్ (హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్.) చిరంజీవి చౌదరికి ‘సీక్రెట్ నెట్వర్క్ ఆఫ్ నేచర్’ అనే పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ బహూకరించారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, అటవీశాఖ ఉన్నతాధికారులు ఎ.కె.నాయక్, ఖజూరియా, సుమన్, రేవతి, రాహుల్ పాండే, శాంతిప్రియ పాండే, శరవణన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE