– సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు అమలు
– ముందుగా వైద్య రంగం నుండి ఈ ప్రొఫెషనల్ సేవలు
– ఆసుపత్రుల డైరెక్టర్లతో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి సమీక్ష
తిరుమల: టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి గురువారం సాయంత్రం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ఆసుపత్రుల డైరెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రముఖ వైద్యులు టీటీడీ ఆసుపత్రులలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోగులకు వైద్య సేవలు అందించే అంశంపై అదనపు ఈవో చర్చించారు.
గత ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల మేరకు శ్రీవారి సేవలో భాగంగా ప్రొఫెషనల్ సేవలను ప్రవేశపెట్టాలనే టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, ముందుగా వైద్య రంగం నుండి ఈ ప్రొఫెషనల్ సేవలను ప్రారంభించడానికి అవసరమైన చర్యలను టీటీడీ ప్రారంభించింది.
అందులో భాగంగా స్విమ్స్ డైరెక్టర్ డా. ఆర్వీ కుమార్, బర్డ్ డైరెక్టర్ డా. జగదీశ్, ఎస్పీసిహెచ్సి డైరెక్టర్ డా. శ్రీనాథ్ రెడ్డి, టీటీడీ సీఎంఓ డా. నర్మద, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి అధిపతి డా. రేణు దీక్షిత్ లతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ టీటీడీ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందించదలచిన వైద్యులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక యాప్ను అభివృద్ధి చేయాలని జిఎంఐటి ఇంచార్జ్ ఫణికుమార్ నాయుడును ఆదేశించారు.
మొదటిసారి టీటీడీ ప్రొఫెషనల్ సేవలను ప్రవేశ పెడుతున్న కారణంగా గౌరవ ముఖ్యమంత్రివర్యుల సూచనల మేరకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఈ సమావేశంలో చీఫ్ పీఆర్వో డా. టీ.రవి, అశ్విని ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డా. కుసుమ కుమారి, బర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ డా. వెంకా రెడ్డి, స్విమ్స్ కు చెందిన డా. ఆలోక్ సచన్ తదితరులు పాల్గొన్నారు.