గత వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన అగ్రరాజ్యం అమెరికాలో చిచ్చు రేపుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పుతిన్ కలిసి టయోటా ఫార్చ్యూనర్ కారులో కలిసి ప్రయాణించిన సెల్ఫీ అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ భారత్ ను రష్యా వైపునకు నెట్టివేస్తున్నాయని, ఇది మనదేశానికి చేటు కాగలదని చట్టసభ షబీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబరు 4న భారత్లో దిగిన పుతిన్కు మోదీ ఘనస్వాగతం పలికి, ఒకే కారులో ఇద్దరూ కలిసి ప్రధాని అధికారిక నివాసం వరకు ప్రయాణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా పుతిన్కు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. ఆ సమయంలో వీరిద్దరూ తీసుకున్న ఓసెల్ఫీ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ సెల్ఫీ ఫోటో ముఖ్యంగా అమెరికా రాజకీయాలను కుదిపేస్తోంది.
ఈ సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ ‘‘ఆ కారు ప్రయాణం నా ఆలోచన. మా స్నేహానికి ఇది నిదర్శనం… ఆ సమయంలో మేం (పుతిన్, మోదీ) మాట్లాడుతూనే ఉన్నాం. చర్చించుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక అంశం ఉంటుంది’ అని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై అమెరికా విధించిన భారీ సుంకాల నేపథ్యంలో పుతిన్ పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ క్రమంలో ప్రతిపక్ష డెమొక్రాట్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా వ్యవహార శైలి.భారత్ను రష్యా వైపునకు నెట్టివేస్తోందని అమెరికా చట్టసభ సభ్యురాలు, డెమొక్రాట్ నేత సిడ్నీ కమ్లాగర్ విమర్శించారు. ఈ ఒక్క చిత్రం అనేక సందేశాలు ఇస్తోందని పేర్కొంటూ ఈ సందర్భంగా భారత్పై ట్రంప్ ప్రభుత్వ వైఖరిని ఆమె ప్రశ్నించారు.
ఇలాంటి విధానాలు అమెరికా-భారత్ మధ్య ఉన్న వ్యూహాత్మక, పరస్పర అవగాహనకు నష్టం చేకూరుస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ని దూరం చేసుకుంటే అమెరికాకే నష్టమని ఆమె హెచ్చరించారు.
‘వ్యూహాత్మక భాగస్వాములను ప్రత్యర్థులవైపు మళ్లించడం ద్వారా నోబెల్ బహుమతి గెలవలేరు’ అంటూ ట్రంప్పై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటికైనా ట్రంప్ ప్రభుత్వ వైఖరిలో మార్పురావాలని ఆమె స్పష్టం చేశారు.
క్వాడ్, వర్ధమాన రక్షణ సాంకేతిక భాగస్వామ్యం, విశ్వసనీయ సప్లయ్ ఛైన్ మేనేజ్మెంట్ సహా అనేక అంశాలతో భారత్, అమెరికా ద్వైపాక్షిక బంధాన్ని బైడెన్ యంత్రాంగం బలోపేతం చేస్తే, ట్రంప్ దీనిని పూర్తిగా విచ్ఛిన్నం చేశారని ఆమె ఆరోపించారు. ట్రంప్ తన తీరు మార్చుకోకపోతే భారత్ను కోల్పోయిన అమెరికా అధ్యక్షుడిగా మిగులుతారని ఆమె హెచ్చరించారు.
మరో చట్టసభ సభ్యురాలు ప్రమీలా జయపాల్ కూడా ట్రంప్ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుంకాల వల్ల ఇటు అమెరికన్లు, అటు భారతీయులు సవాళ్లను ఎదుర్కొంటున్నారని, అవి భారత ఆర్థిక వ్యవస్థను, అమెరికా వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్ అమెరికా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధ్రువ జైశంకర్ మాట్లాడుతూ పాకిస్థాన్ సైనిక నాయకత్వంపై ట్రంప్ యంత్రాంగం చూపుతోన్న అభిమానాన్ని ప్రశ్నించారు. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోసే పాక్తో ఇలాంటి సంబంధాలను ఆయన వ్యతిరేకించారు.
మరో చట్టసభ సభ్యుడు బిల్ హుయిజెంగా మాట్లాడుతూ వేగంగా వృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ పరిరక్షణకు భారత్ అవసరాన్ని నొక్కి చెప్పారు. భారత్-అమెరికా సంబంధాలు కేవలం వ్యాపారపరమైనవి మాత్రమే కాదు ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆందోళనలను హౌస్ ఫారిన్ అఫైర్స్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా సబ్ కమిటీ ముందు వీరు వ్యక్తం చేశారు.
(‘నిజంటుడే’ సౌజన్యంతో)