– ఎన్ని ట్రిక్కులు వేసిన… ఆధారాలతో అడ్డంగా దొరికారు
-తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సిందే నన్న శీర్షికతో సాక్షి దినపత్రికలో పచ్చి అబద్ధపు కథనం
-గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్న సాక్షి దినపత్రిక యాజమాన్యం
– లాకప్ లో నన్ను చిత్రహింసలకు గురి చేసిన కేసులో A3 నిందితుడిగా సాక్షి దినపత్రిక యజమాని
– లాకప్ లో నన్ను చితకొట్టే క్రతువు పూర్తి చేసిన పీవీ సునీల్ కుమార్… ప్యాలెస్ లో ఉన్న రుత్వికుడికి వీక్షించే అవకాశం కల్పించాడు
– గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ ప్రభావతిపై ఒత్తిడి చేసి నివేదిక తారుమారు చేసిన పీవీ సునీల్ కుమార్
– ఈ కేసులో ఏ పోలీసు స్టేట్మెంట్ ఇవ్వలేదని పీవీ సునీల్ కుమార్ ఎలా చెబుతాడు?… ఇవ్వలేదని అతనికెలా తెలుసు?
– విజయ్ పాల్ ను పీవీ సునీల్ కుమార్ దాచి పెట్టాడని అందరూ అంటున్నారు
– కస్టోడియల్ టార్చర్ కేసులో A1 నిందితుడు ఇంత బరితెగించి మాట్లాడుతున్నా ప్రభుత్వం చూస్తూ ఎందుకు మౌనంగా ఉంటోంది?
– తక్షణమే పివి సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసి అరెస్టు చేయాలి
-ప్రభావతిని 164 స్టేట్మెంట్ అడుగుతున్నారంటే… గతంలో 161 స్టేట్మెంట్ ఇచ్చే ఉంటుంది
-ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు
ఉండి: జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఎన్ని ట్రిక్కులు వేసిన ఆధారాలతో అడ్డంగా దొరికారని ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు తెలిపారు. లాకప్ లో నన్ను చంపాలని చూసింది పచ్చి నిజం… చితకొట్టింది పచ్చి నిజం… చూపెట్టింది పచ్చి నిజం… చూసినవాడు పచ్చి నిజమని పేర్కొన్న ఆయన, అన్నీ నిజాలేనని దాన్ని కవర్ చేసుకోవడానికి గతంలో అప్పటి సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ను, ఇప్పుడు సాక్షి దినపత్రిక వెదవలు రాయడం విడ్డూరంగా ఉందన్నారు.
తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సిందేనన్న శీర్షికతో సాక్షి దినపత్రిక మెయిన్ ఎడిషన్ మొదటి పేజీలో ప్రచురించిన కథనం ద్వారా జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అడ్డంగా దొరికిపోయారన్నారు. గుంటూరు ప్రభుత్వ మాజీ సూపరిండెంట్ ప్రభావతిని 164 స్టేట్మెంట్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లుగా సాక్షి దినపత్రికలో రాశారని, గతంలో ఆమె 161 స్టేట్మెంట్ ఇచ్చి ఉంటుందని, అందుకోసమే 164 స్టేట్మెంట్ ఇవ్వాలని పోలీసులు అడిగి ఉంటారన్నారు. 161 స్టేట్మెంట్ చాలని నన్ను లాకప్ లో చిత్రహింసలు పెడుతున్నప్పుడు చూపెట్టిన వాడికి, చూసినవాడికి తోలు ఊడిపోతుందని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.
ఒత్తిడే ఉండి ఉంటే… మూడు నెలల క్రితమే పీవీ సునీల్ కుమార్ అరెస్ట్ అయి ఉండేవాడు
ముఖ్య నేత ఒత్తిడి మేరకే తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని పోలీసులు ప్రభావతిని ఒత్తిడి చేస్తున్నారని సాక్షి దినపత్రిక ఒక కట్టు కథనాన్ని రాసిందని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ముఖ్య నేత ఒత్తిడి చేసి ఉండి ఉంటే, మూడు నెలల క్రితమే ఈ కేసు లో ప్రధాన నిందితుడైన పీవీ సునీల్ కుమార్ అరెస్టు అయి ఉండేవాడని తెలిపారు.
ఏది జరిగిన చట్టం ప్రకారం జరగాలి. చట్ట పరిధిలోనే జరగాలని కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కక్షపూరితంగా వ్యవహరించని సంస్కారి అయిన చంద్రబాబు నాయుడు, ఈ కేసులో ఎటువంటి జోక్యం చేసుకోలేదన్నారు. ఆయన ఇన్వాల్వ్ అయి ఉంటే పీవీ సునీల్ కుమార్ అరెస్ట్ అయి ఉండేవాడన్నారు. దాన్ని లీనియస్ గా తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
సుప్రీంకోర్టుకు వెళ్లిన ఫలితం లేకుండా పోయిందని సాక్షి దినపత్రిక తన కథనంలో రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నా కాలికి అయిన గాయాలను చూసి మిలటరీ ఆసుపత్రి నివేదిక ఆధారంగానే సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిందని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే కేసులు పెట్టారన్న సాక్షి కథనంపై కూడా రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పీవీ సునీల్ కుమార్ ఉన్నప్పుడు నేను ఫిర్యాదు చేసి ఉంటే ఏమి చేసేవారని… కేసు క్లోజ్ చేసి ఉండేవారని పేర్కొన్నారు. ప్రభావతి సరైన నివేదిక ఇచ్చిందన్న సాక్షి కథనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నేను న్యాయ పోరాటం చేశానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
అయితే ఏడాది తర్వాత సుప్రీం కోర్టు, హైకోర్టుకు వెళ్లమని సూచించిందని గుర్తు చేశారు. హైకోర్టులో ఎప్పటికప్పుడు కేసు వాయిదా వేశారు. సిబిఐ అధికారులు తాము బిజీగా ఉన్నామని చెప్పేవారు. అంతలోని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయిన తర్వాత , రాష్ట్రంలో స్వచ్ఛమైన ప్రభుత్వం ఏర్పడి, నిష్పక్షపాతంగా వ్యవహరించే ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత తాను పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.
ఒత్తిడి ఉండి ఉంటే… 30 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేస్తారు ?
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నా కస్టోడియల్ టార్చర్ పై నేను ఇచ్చిన ఫిర్యాదు మేరకు 30 రోజుల తర్వాత ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ముఖ్య నేత ఒత్తిడి ఉండి ఉంటే, పోలీసులు 30 రోజుల తర్వాత ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. ముఖ్య నేత ఒత్తిడి లేదు కాబట్టే నిబంధనల ప్రకారం 30 రోజుల తర్వాత ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారన్నారు.
మూడు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ముంబైలో ఉన్న సినీనటి కాదంబరి జత్వాని ని ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే ఎత్తుకొచ్చారని గుర్తు చేశారు. కాదంబరి జత్వాని అక్కడ ఎవరినోమోసం చేసిందని, ఇక్కడ ఎవరినో మోసం చేసిందని సాక్షి దినపత్రిక ఎలా రాస్తుందని ప్రశ్నించారు.
నేరం రుజువయ్యే వరకు ఆమె నేరస్తురాలు కాదన్న రఘురామకృష్ణంరాజు, పంజాబ్ లో ఎవడో అమిత్ సింగ్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడని రాయడం విడ్డూరంగా ఉందన్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో పీవీ సునీల్ కుమార్ ను ఇప్పటికీ నిందితుడిగా మాత్రమే సంబోధిస్తున్నామని, నేరస్తుడని పేర్కొనడం లేదని గుర్తు చేశారు . ఇక్కడ తాము ఇంత మంచిగా భాషను ప్రయోగిస్తూ ఉంటే, సాక్షి దినపత్రిక అడ్డగోలు రాతలు రాస్తోందని మండిపడ్డారు .
సునీల్… నీకు ఆ అవకాశం రాదమ్మా
కస్టోడియల్ టార్చర్ కేసులో సాక్షుల వాంగ్మూలం ఆధారంగా ఈనాడు దినపత్రిక రాసిన ప్రత్యేక కథనాన్ని ప్రూవ్ చేయాలని, లేకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా కేసు పెడుతానని ఇన్ డైరెక్ట్ గా పీవీ సునీల్ కుమార్ బెదిరించడానికి ప్రస్తావిస్తూ నీకు కేసు వేసే అవకాశం రాదమ్మా అని రఘురామ కృష్ణంరాజు సెటైర్ వేశారు. కేసు ప్రూవ్ కాకుండా ఉండే అవకాశం లేదు.
ఒకవేళ కేసు ప్రూవ్ కాకపోయినా నీకు కేసు పెట్టి అవకాశమే లేదు. కస్టోడియల్ టార్చర్ కేసులో అన్ని సాక్షాలు పక్కా గా ఉన్నట్టుగా ఈనాడు దినపత్రిక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈనాడు దినపత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించిందంటే, వారు అన్ని నిర్ధారించుకున్న తరువాతే ప్రచురిస్తారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అప్పటి సూపరిండెంట్ ప్రభావతిని పీవీ సునీల్ కుమార్ ఎంతగానో ప్రభావితం చేశాడు.
12 గంటల లోపు నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించగా, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిద్ధం చేసిన నివేదికను చూసి హడలిపోయిన పీవీ సునీల్ కుమార్, ప్రభావతి పై ఒత్తిడి చేసి నివేదికను తారుమారు చేయించాడు . జగన్మోహన్ రెడ్డి మెడికల్ కౌన్సిల్ లో నియమించిన ఇద్దరు రెడ్ల సహకారంతో, స్థానిక వైకాపా నాయకుల ప్రోద్బలంతో ఒక దొంగ నివేదికను ప్రభావతి చేత తయారు చేయించిన పీవీ సునీల్ కుమార్, కోర్టుకు సమర్పించాడు .
జైలు సూపరిండెంట్ ఇచ్చిన నివేదికలో నాకు పెయిన్ కిల్లర్లను ఇచ్చినట్లు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సాక్షులను పీవీ సునీల్ కుమార్ బెదిరిస్తున్నాడు. ఏ పోలీసు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని సునీల్ కుమార్ పేర్కొనడం పరిశీలిస్తే, ఏ పోలీసు స్టేట్మెంట్ ఇవ్వలేదని పీవీ సునీల్ కుమార్ కు ఎలా తెలుసో చెప్పాలని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
అంటే పోలీసులతో పీవీ సునీల్ కుమార్ నిరంతరాయంగా సంబంధాలను కొనసాగిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఈ కేసులో కీలక నిందితుడైన విజయ్ పాల్ ను పీవీ సునీల్ కుమార్ దాచి పెట్టాడని అందరూ అంటున్నారు. ఎక్కడ దాచి పెట్టాడో, అతడికే తెలియాలి. పోలీసుల్ని బెదిరించడం, పోలీసులు వాంగ్మూలాన్ని ఇవ్వలేదని పేర్కొనడం పరిశీలిస్తే ఈ కేసులో పివి సునీల్ కుమార్ పాత్ర స్పష్టమవుతుందన్నారు.
గూగుల్ టేక్ అవుట్ ఆధారాలు కేవలం 6 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయని పీవీ సునీల్ కుమార్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మూడేళ్ల అనంతరం గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా సిబిఐ అధికారులు నిందితుల ఆనవాళ్లను గుర్తించడం జరిగిందన్నారు. ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేని పీవీ సునీల్ కుమార్ ఎలా ఐపీఎస్ పాసయ్యాడో అర్థం కావడం లేదని విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఈ లెక్కన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో లభించిన గూగుల్ టేక్ అవుట్ ఆధారాలు నిజమైనవి కాదని పీవీ సునీల్ కుమార్ ఉద్దేశమా? అని ప్రశ్నించారు.
కస్టోడియల్ టార్చర్ కేసులో A1 నిందితుడిగా ఉన్న పీవీ సునీల్ కుమార్ బరితెగించి మాట్లాడుతున్న ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందో అర్థం కావడం లేదన్నారు. తక్షణమే పివి సునీల్ కుమార్ ను అరెస్ట్ చేయాలని కోరారు. సాక్షులను బెదిరిస్తూ, ప్రభావితం చేస్తున్న వ్యక్తిని విధుల్లో నుంచి సస్పెండ్ చేసి, అరెస్టు చేసి విచారించాలన్నారు.
మెజిస్ట్రేట్ రెండవ ఆసుపత్రిలో చూపించమని ఆదేశించలేదా?
కస్టోడియల్ టార్చర్ వల్ల నా కాలికి అయిన గాయాలను చూసి మెజిస్ట్రేట్ రెండవ ఆసుపత్రిలో చూపించమని ఆదేశించలేదా? అంటూ రఘు రామకృష్ణంరాజు ప్రశ్నించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అప్పటి సూపర్డెంట్ ప్రభావతి గైనకాలజిస్టని గుర్తు చేశారు. మగవాడినైనా తనను గైనకాలజిస్ట్ ప్రభావతి ఏలా పరీక్షిస్తుందని ప్రశ్నించారు.
ఆర్థోపెడిషియన్ చేత పరీక్షలు చేయించాల్సి ఉండగా, గైనకాలజిస్ట్ అయినా ప్రభావతి పరీక్షలు చేయడం ఏమిటంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ప్రభావతి ఇచ్చిన నివేదికను పీవీ సునీల్ కుమార్ పూర్తిగా మార్చి వేశారన్నారు. జైల్లో రఘురామకృష్ణం రాజు తనకు తానే హింసించుకొని ఉండవచ్చునని పేర్కొన్న పీవీ సునీల్ కుమార్, మిలటరీ ఆసుపత్రికి వెళ్లే దారిలో గాయపరచుకొని ఉంటారని పేర్కొనడం సిగ్గుచేటు అన్నారు.
పోలీసు వాహనంలో తనని వెళ్ళమని మెజిస్ట్రేట్ ఆదేశించలేదని, సొంత సెక్యూరిటీతో సొంత వాహనంలోనే వెళ్ళేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. తన సొంత వాహనంలో ఏ ఆర్ ఎస్ ఐ ని వెంటబెట్టుకుని మిలటరీ ఆసుపత్రికి పరీక్షల కోసం వెళ్లినట్లుగా గుర్తు చేశారు. పరీక్షల కోసం వెంటనే మిలటరీ ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించడంతో, దారిలోనే వాహనాన్ని గుద్ది చంపాలని వీరు ముందే వేసుకున్న ఎత్తుగడ పారలేదన్నారు.
పీవీ సునీల్ కుమార్ క్రిస్టియన్ అనడానికి ఆధారాలున్నాయి
పీవీ సునీల్ కుమార్ క్రిస్టియన్ అనడానికి ఆధారాలు ఉన్నాయని, గతంలో ఈ ఆధారాలన్నింటిని హోం మంత్రిత్వ శాఖకు, డి ఓ టి పి కి తాను అందజేశానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అయినా జగన్మోహన్ రెడ్డి సహకారంతో పీవీ సునీల్ కుమార్ అందరినీ మేనేజ్ చేశాడని అన్నారు. ఉద్యోగం సంపాదించడానికి పీవీ సునీల్ కుమార్ ఎస్సీ ధ్రువీకరణ పత్రాన్ని పొంది ఉండి ఉంటాడని తెలిపారు. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ ఎస్సీ సర్టిఫికెట్ పొందిన వారి కుల ధ్రువీకరణ పత్రాన్ని గతంలో ఖమ్మంలోనూ, ఇటీవల కర్నూల్ లోనూ రద్దు చేయడం జరిగిందన్నారు.
సామాన్యుడి గతి ఏమిటి?
చట్టసభల ప్రతినిధికే ఈ పరిస్థితి ఎదురైతే, సామాన్యుడి గతి ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఈ తరహా ఘటనలలో న్యాయం జరగకపోతే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుందన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకంతోనే తాను ఈ పోరాటం చేస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ కేసులో చార్జి షీట్ దాఖలు చేస్తే ఏం జరిగిందో కోర్టు చెప్పాలన్న ఆయన, తన వెంట ఉన్న ఎస్ఐ కి ఏం జరిగిందో తెలుసునన్నారు.
పవన్ కళ్యాణ్ బాటలోనే జగన్మోహన్ రెడ్డి తిరుమల లో డిక్లరేషన్ ఇవ్వాలి
పవన్ కళ్యాణ్ తన కూతుళ్ల తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేటప్పుడు కూతురి తరుపున డిక్లరేషన్ ఇచ్చినట్టుగానే, జగన్మోహన్ రెడ్డి కూడా డిక్లరేషన్ ఇవ్వాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. పవన్ కళ్యాణ్ పెద్దమనిషి తరహాలో తన కూతురు బాప్టిజం తీసుకుందని ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేసే విధంగా డిక్లరేషన్ ఇచ్చారన్నారు.
జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడని అందరికీ తెలుసునని తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారి పై తనకు నమ్మకం ఉందని చాటుకునే అద్భుత అవకాశాన్ని అవగాహన లేమి, అహంకారంతో పోగొట్టుకున్నారన్నారు. సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించే పవన్ కళ్యాణ్ తన కూతురు బాప్టిజం తీసుకుందని, తల్లి మతాన్ని ఆచరిస్తుందని నిజాయితీగా చెప్పారన్నారు. జగన్మోహన్ రెడ్డికి మళ్లీ శ్రీవారి నుంచి పిలుపు వస్తే డిక్లరేషన్ ఇచ్చి భగవంతుని దర్శించుకోవాలని సూచించారు.
మహోన్నత వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు సొంతం
ఏ అవకాశం వచ్చిన రాజకీయాల కోసం ఎటువంటి అడ్వాంటేజ్ తీసుకోని మహోన్నత వ్యక్తిత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతమని రఘురామకృష్ణం రాజు తెలిపారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయవొద్దని న్యాయస్థానాలు చెబుతాయని పేర్కొన్నారు. అదే విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పారన్నారు.
తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీం కోర్టులో వాదనలను జరిగిన తీరు చూసి ఇల్లు అలకగానే పండుగ జరిగిందన్నట్టుగా వైకాపా సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలను చేస్తోందని మండిపడ్డారు. రేపు మధ్యాహ్నం సుప్రీంకోర్టు మరోసారి సమావేశం కానుందని తెలిపారు. లడ్డు కల్తీ వ్యవహారం పై సిట్ విచారణ చేస్తోందన్న ఆయన, లడ్డూలో నాణ్యత తగ్గిన మాట అందరికీ తెలిసిందేనన్నారు.
లడ్డు ప్రసాదాన్ని చూసి గత కొంతకాలంగా భక్తులు నిరాశకు గురవుతున్నారని తెలిపారు. సత్యాన్వేషణలో భాగంగా తెలిసిన విషయాన్ని చెప్పకపోతే దోషమని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, గతంలో తప్పులు జరిగాయని ఇప్పుడు అంతా సజావుగానే ఉందని, ప్రాయశ్చిత్తంగా సంప్రోక్షణ చేసినట్లుగా వెల్లడించడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు అవగాహన లేకుండా మాట్లాడే వ్యక్తి కాదని, ఆయన ప్రతిదీ ఆచితూచి మాట్లాడుతారని చెప్పారు..