– వచ్చే ఖరీఫ్ నాటికి RSKలకు ప్రత్యేక శిక్షణ
– పౌర సరఫరాల సంస్థ చైర్మన్, సభ్యులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ 227వ బోర్డు సమావేశం విజయవాడ కానూరు సివిల్ సప్లై భవనంలో జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండి మంజీర్ జిలాని, కమిషనర్ సౌరబ్ గౌర్, సివిల్ సప్లై కార్పొరేషన్ సభ్యులు బోడపాటి శ్రీధర్, కడాలి ఈశ్వరి, పద్మజ, ఆనంద్, కోటి, పట్టాభి, తోట పార్థసారథి, మహేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సంస్థ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.
అందరూ గర్వపడే విధంగా ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి ధాన్యం కొనుగోలు మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి RSKలకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్లో 5,61,216 మంది రైతుల నుంచి 35,48,724 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అందుకుగాను 8,138 కోట్ల రూపాయలు నగదు రైతులు ఖాతాలో జమ చేయడం జరిగింది.
ఏప్రిల్ నెల నుంచి రబీ కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడానికి దీపం-2 పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకంలో తొలి ఉచిత సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు (మార్చి 31, 2025) వరకే గడువు ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు దీపం-2 పథకం ద్వారా 98 లక్షల మంది లబ్ధిదారులు మొదటి ఉచిత సిలిండర్ను పొందారని ఆయన వివరించారు.
సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయబడతాయి. నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకోవచ్చు.పట్టణ ప్రాంతాల్లో 24 గంటల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో గ్యాస్ డెలివరీ అందించబడుతుంది. డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన మొత్తం లబ్దిదారుల ఖాతాలో తిరిగి జమ అవుతుంది.ఈ పథకానికి సంబంధించిన ఏవైనా సమస్యలు, సమాచారం లోపం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967 కి కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని వివరించారు.
ప్రైవేటు గోడౌన్ల వద్ద AI కెమెరాలు – గ్రీన్ హౌస్ గోడౌన్లుగా మార్పు
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, రవాణా, భద్రత మరియు నిర్వహణను సమర్థవంతంగా చేయడమే లక్ష్యంగా ప్రైవేటు గోడౌన్ వద్ద AI కెమెరాల ఏర్పాటు – గోడౌన్లో ఉన్న సరుకు నిల్వ, భద్రతను టెక్నాలజీ ద్వారా పర్యవేక్షించేందుకు ప్రతి గోడౌన్ వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం. అదేవిధంగా ప్రతి గోడౌన్ పైభాగంలో సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేయడం ద్వారా గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సాహం జరుగుతుందన్నారు.
విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం లో భాగంగా హాస్టల్స్ కు
లక్ష 14 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తృణధాన్యాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.. త్వరలో చౌక ధర దుకాణాల నుంచి రాగి, కొర్రలు, సజ్జలు అందించే విధంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది.. దీనిపై విధివిధానాలు త్వరలో ప్రకటిస్తామన్నారు.అదేవిధంగా తృణధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు, రైతులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.