– కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి
– మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్
హైదరాబాద్: రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా చేస్తే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. దేశానికి ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తికి, వ్యవస్థల మీద నమ్మకం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.
బ్యాలెట్ పేపర్ కాదని నాటి రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిందని గుర్తు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు పనిచేసినట్లు, బీహార్లో ఓడిపోతామని భావించి ఈవీఎంలు పనిచేయడం లేదని అంటారా? అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ రాయ్బరేలీలో గెలిచారని, అక్కడ రెండు లక్షల ఓట్లు అనుమానంగా కనిపిస్తున్నాయని అన్నారు. అక్కడ ఆయన దొంగ ఓట్లతో గెలిచారని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరనున్నామని తెలిపారు.
బెంగాల్లో డైమండ్ హార్బర్ నియోజకవర్గంపై, ఉత్తర ప్రదేశ్లో అఖిలేశ్ యాదవ్ అర్ధాంగి డింపుల్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై అనుమానాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఓడిపోతే ఈవీఎంల మీద బురదజల్లి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు.
రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థలను కాంగ్రెస్ గౌరవించడం లేదని మండిపడ్డారు. ఆరోపణలు చేసే ముందు శాస్త్రీయంగా వ్యవస్థల మీద అధ్యయనం చేయాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.