Suryaa.co.in

Telangana

చరిత్రలో ఎన్నడూ చూడని రికార్డు స్థాయి వర్షాలు

సీఎం కేసిఆర్ ముందు చూపుతో జాగ్రత్త చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించగలిగారు
కేసీఆర్ అధిక వర్షాలు,వరదలపై క్షేత్ర స్థాయిలో నిరంతరం ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు
వరదలపై కొందరు బురద రాజకీయాలు చేస్తున్నారు
ఫోటోలకు ఫోజులిచ్చే నాయకుడు కాదు కేసిఆర్…ప్రజలకు పనికి వచ్చే పనులు చేసే నాయకుడు కేసిఆర్
రైతు ప్రేమికుడు కేసిఆర్.. రైతుల కోసం ఆయనకంటే బాగా ఎవరూ ఆలోచన చేయలేరు
పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లను పునరుద్ధరణ చేస్తున్నాం. అంటువ్యాధులు ప్రభలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాం
మున్సిపల్ మంత్రి కేటీఆర్ చొరవతో నాలా అభివృద్ది కార్యక్రమం ద్వారా హైదరాబాద్ లో వరద ప్రభావం తగ్గింది. ప్రాణ నష్టం జరగకుండా దోహదపడింది

– శాసన మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్,శాసన మండలి: రాష్ట్రంలో ఇటీవల అతిభారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు,వరదలతో జరిగిన నష్టంపై గురువారం నాడు శాసన మండలిలో లఘు చర్చలో రాష్ట్ర శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పారు. పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలను నివృత్తి చేశారు.

మంత్రి ప్రసంగం….

18 జూలై నుంచి 22 వరకు,24 జూలై నుంచి 28 వరకు రెండు దఫాల్లో కేవలం ఒక్క రోజులో 6 గంటల్లోనే భారీ వర్షాలు కురిశాయి.

“ప్రకృతి వైపరిత్యాలు మనం ఎవరం ఊహించలేం..దాన్ని అడ్డుకోలేం. అది సహజప్రక్రియ కానీ ముందస్తు జాగ్రత్త చర్యల వల్ల ప్రకృతి వైపరిత్యాలతో జరిగే ప్రాణ నష్టం, ఆస్థి నష్టాన్ని మాత్రం నిలువరించగలం అని గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ ఎప్పుడూ మాకు దిశానిర్దేశం చేస్తారు.” మొన్న వారం రోజుల పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఆకాశానికి చిల్లు పడిందా అనేంత కుండపోత వర్షాలు మనం చూశాం.

ఏడాది పొడవునా కురిస్తే ఎంత వర్షపాతం అయితే నమోదు అవుతుందో…అంతే స్థాయిలో ఒక్క రోజులో కురిసిన సందర్భం చూసినం. నిజామాబాద్ జిల్లాలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలోనే అత్యధికంగా వర్షాలు కురిశాయి. నా సొంతూరు వేల్పూర్ మండలంలో ఒక్కరోజు రాత్రి కేవలం 6 గంటల సమయంలోనే 46 సేం.మీ వర్షం కురిసింది.

1. 2023 జూలై 17 నాటికి వార్షిక సగటు వర్షపాతం 20% ఉంటే 28 జూలై నాటికి +66% అధిక వర్షాలు కురిశాయి.

2.జయశంకర్ భూపాలపల్లి,హన్మకొండ, వరంగల్, కరీంనగర్,మహబూబాబాద్,ములుగు,జగిత్యాల్,నిర్మల్,నిజామాబాద్,పెద్దపల్లి ఇలా 10 జిల్లాల్లో సంవత్సరం మొత్తంలో నమోదు అయ్యే వర్షపాతంలో 50% కేవలం 8 రోజుల్లోనే నమోదైంది.

3. లక్ష్మిదేవిపేటలో 6 గంటల్లో 65 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. వార్షిక సగటు వర్షపాతానికి 75% అధికం. వాజేడు లో 6 గంటల్లో 52 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. సగటు వర్షపాతానికి 60% అధికం. వేల్పూర్ లో 6 గంటల్లో 46 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. సగటు వర్షపాతానికి 50% అధికం.
ఈ ప్రాంతాల్లో 90సెంటీమీటర్ల వర్షం సంవత్సర సగటుగా ఉంటే 6 గంటల్లోనే అదే స్థాయి కుంభవృష్టి కురిసింది.
10 నుంచి 15 సేం.మీ వర్షం నమోదైతేనే క్లౌడ్ బరస్ట్ అంటారు అని అధికారులు చెప్తున్నారు. అట్లాంటిది రాష్ట్రంలో ఒక్కరోజులో 65 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది.. మేము క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలకు వెళ్ళినప్పుడు గత 50 ఏళ్లలో ఎన్నడూ ఇంతటి వర్షాన్ని చూడలేదని ప్రజలు మాతో చెప్పినారు.
ఇంతటి వర్షాలు మనం ఎవరం ఊహించలేదు. కానీ సీఎం కేసిఆర్ గారి ఆదేశాలతో గౌరవ మంత్రులు, ఎమ్మేల్యేలు,ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండి క్షేత్ర స్థాయిలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారు.

సీఎం 24×7 మానిటరింగ్…

సీఎం కేసిఆర్ ఈ కుంభవృష్టి వల్ల జరిగే నష్టాన్ని ముందే అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్ల వందలమంది ప్రాణాలను కాపాడాం. వరద పరిస్థితిపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం యుద్ధసన్నద్ధతతో చర్యలు చేపట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిక్షణం వరద పరిస్థితిని సమీక్షించారు.

ప్రాజెక్టుల వారీగా ఎస్సారెస్పీ,కడెం,అప్పర్ మానేర్,నిజాంసాగర్, భద్రాచలం దగ్గర గోదావరి ఉదృతిని ఇలా అన్ని ప్రాజెక్టులకు వచ్చే వరదను ప్రతీ గంటా సమీక్షిస్తూ..నీళ్లు వడలవలసి వస్తే దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తూ.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో ఉన్న మాకు చేరవేస్తూ క్షణం తీరిక లేకుండా అందర్నీ అలెర్ట్ చేశారు.

ప్రాణ నష్టం జరగకుండా, వరద బాధితులు ఇబ్బంది పడకుండా లోతట్టు ప్రాంతాల్లో విపత్తు నిర్వహణను, సహాయ చర్యలపై ఎప్పటికప్పుడు మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు.

సహాయక చర్యలు

ముఖ్యమంత్రి కేసిఆర్ వరద సహాయక చర్యల్లో భాగంగా 8NDRF టీమ్స్ 4ప్రత్యేక బోట్లతో (ఒక్కో టీంకు 20-22 మంది నిస్టాతులు),విశాఖ పట్నం నుండి అదనంగా 2టీమ్స్ ఏర్పాటు చేశారు.
2 హెలికాప్టర్లతో భూపాలపల్లి,ములుగు,కొత్తగూడెం లలో వరద సహాయక చర్యలు చేపట్టారు. వరదబాధితులకు ఆహారం,మెడిసిన్ అందించడం జరిగింది. ఆర్మీ వారితో మాట్లాడి 90 మందితో కూడిన టీం ను కూడా సిద్ధం చేశారు.

జిల్లాల్లో ఉన్న రెగ్యులర్ ఫైర్ టీంలు అందుబాటులో ఉండగా 18 ఫైర్ టీమ్స్ (టీమ్ కి 10 మంది) 18 బోట్లు,16 రిలీఫ్ వెహికిల్స్ తో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. వారు మొరంచపల్లితో పాటు వరదల్లోంచి 1500 మందిని రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు.
అత్యవసరమైతే వినియోగించేందుకు 4 టూరిజం బోట్లు కూడా సిద్దంగా ఉంచాం.

పునరావాస కేంద్రాలు:

వరదలకు ప్రభావితం అయిన 139 గ్రామాల్లో 7,870 ఇండ్ల నుంచి 27,063 మందిని 157 పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించాం. వారికి మంచినీళ్లు,ఆహరం,దుప్పట్లు, మెడిసిన్ అన్ని ఏర్పాట్లు చేశాం.

ఆ ప్రాంతాల్లో గతంలో పని చేసి అనుభవం ఉన్న 7గురు స్పెషల్ ఆఫీసర్లను నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు.సెక్రటేరియట్ లో, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో 24/7 గంటల పాటు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశాం.

వరద తగ్గిన తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా సానిటేషన్ చర్యలు చేపట్టారు. దోమల నియంత్రణ కొరకు మందులు స్ప్రే చేయడం,బ్లీచింగ్ పౌడర్ చల్లడం లాంటి జాగ్రత్తలు తీసుకున్నాం.

మంత్రులు ఎక్కడా, ఎమ్మెల్యేలు ఎక్కడా అని ఆపద సమయంలో కొందరు బురద రాజకీయాలకు పూనుకున్నారు. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. సీఎం కేసిఆర్ గారి సూచనలు తూచా తప్పకుండా వర్షం పడుతుంటే కూడా లెక్కచేయకుండా తడుస్తూ క్షేత్ర స్థాయిలో ప్రజలతో ఉండి భారోసాను కల్పించాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి ఎంతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం.
ఆపత్కాలంలో…అధికారులు అద్భుతంగా పనిచేశారు..

క్షేత్ర స్థాయిలో పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ ఇలా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అద్భుతంగా పనిచేసారు. యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. పోలీస్ సిబ్బంది సుమారు 19 వేల మందిని వరద ప్రభావిత ప్రాంతాలనుండి క్షేమంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. విద్యుత్ సిబ్బంది కి ఈ వేదికగా సెల్యూట్ చేస్తున్న.

వరదల్లో ఈదుకుంటూ ప్రాణాలకు తెగించి కరెంట్ పునరుద్దరణ చేసిన వారి సాహసానికి అంతా అభినందనలు, ధన్యవాదాలు తెలపాల్సిన సందర్భం. కేసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ వల్ల చెరువులు పటిష్టంగా తయారయ్యి దాని ఫలితంగా ఎక్కువగా గండి పడలేదు. కొద్దిగా గండి పడ్డ చెరువులకు కూడా ఇరిగేషన్ శాఖ సిబ్బంది సకాలంలో పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

రోడ్లు భవనాలు శాఖ అధికారులు ప్రజా రవాణాకు ఎక్కడా ఇబ్బంది రాకుండా తెగిన రోడ్లు, కల్వర్టులు వెంట వెంటనే యుద్ద ప్రాతిపదికన పునరుద్దరణ చేశారు. రెవెన్యూ శాఖ,పంచాయతీ రాజ్ శాఖ అందరినీ సమన్వయం చేస్తూ క్షేత్ర స్థాయిలో వారు పనిచేసిన తీరు ప్రశంసనీయం. మెడికల్ అండ్ హెల్త్ టీం కింది స్థాయి ఆశా వర్కర్ వరకు అద్భుతంగా పనిచేసారు.

కేంద్ర ప్రభుత్వ సాయం చేయకున్నా..కేసిఆర్ ప్రభుత్వమే కరోనా సమయంలో, వర్షాలు వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు పునరుద్దరణ కోసం, పంట నష్ట సహాయం కోసం,GHMC వరదలప్పుడు ఒక్కో కుటుంబానికి 10వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేసింది.
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ భరోసా..

రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షగా నిలుస్తున్నారు.2020లో హైదరాబాద్‌లో భారీ వరదలు వచ్చినప్పుడు కేంద్రం స్పందించకపోవడంతో సీఎం తక్షణం 650 కోట్లు విడుదల చేసి నష్టపోయినవారికి 10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు.

గత ఏడాది అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు 10వేల చొప్పున 4.50 లక్షల ఎకరాలకు గను 455 కోట్లు ప్రకటించి ఇప్పటికే రైతులకు 150 కోట్లు పరిహారం అందించారు.మిగతావి ప్రాసెస్ లో ఉన్నవి.ఇప్పుడు తక్షణ సహాయం కింద 500 కోట్లు విడుదల చేశారు.

GHMC పరిధిలో వరదల కట్టడికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అత్యంత ప్రణాళిక బద్దంగా పనిచేశారు. వారు చేపట్టిన వ్యూహాత్మక నాలా అభివృద్ది కార్యక్రమం ద్వారా గతంలో లాగా వరదలు రాకుండా నిలువరించి ప్రాణ నష్టం జరుగకుండా చేసింది. 985 కోట్లతో 55 పనులకు శ్రీకారం చుట్టారు.అందులో 31 పూర్తి అయ్యాయి.”

 

LEAVE A RESPONSE