Suryaa.co.in

Andhra Pradesh

రూ.290 కోట్లతో రాష్ట్ర రహదారులకు మరమ్మతులు

• తొలి దశలో 1393 రోడ్లకు 7071 కి.మీ మేర మరమ్మతులు
• వరదలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ. 186 కోట్లు విడుదల
• రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడి
• రహదారుల నిర్వహణపై SRM వర్సిటీలో ఆర్ & బీ శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్

అమరావతి: రాష్ట్రంలో మెరుగైన రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన 7071 కి.మీ రహదారులకు సంబంధించిన 1393 రోడ్లను గుంతల రహిత రహదారులుగా మార్చేందుకు రూ.290 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి వివరించారు.

“ రాష్ట్ర రహదారుల నిర్వహణ, పునరావాసం- సవాళ్లు మరియు ఉత్తమ పద్ధతులు’ అన్న అంశంపై నేడు AP – SRM యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. రోడ్లు భవనాల శాఖ, ఏపీ ఎస్ఆర్ఎం, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లు సంయుక్తంగా ఈ వర్క్ షాప్ ను నిర్వహించాయి.

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే అధ్యక్షతన జరిగిన వర్క్ షాప్ లో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తన వీడియో సందేశాన్ని అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రహదారులను గుంతలు రహిత రోడ్లుగా మార్చేందుకు సరికొత్త టెక్నాలజీతో ముందుకు సాగుతున్నామని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఏపీ SRM వర్సిటీ సివిల్ ఇంజినీర్లు టెక్నాలజీ పరంగా సంపూర్ణ సహకారం అందించేందుకు ముందుకు రావడం, ఎంవోయూ కుదుర్చుకోవడం శుభపరిణామం అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్దరణకు, రూ. 186 కోట్లను రాష్ట్ర విపత్తు నివారణ నిధి నుంచి విడుదల చేయడం జరిగిందని మంత్రి వివరించారు.

LEAVE A RESPONSE