Home » ఆంధ్రుల సెంటిమెంట్‌ను గౌరవించండి

ఆంధ్రుల సెంటిమెంట్‌ను గౌరవించండి

– విశాఖ ఉక్కును కాపాడండి
– వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో పెట్టేందుకు కేంద్ర మంత్రి తో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చర్చలు
– సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కుమార స్వామి

న్యూఢిల్లీ, అమరావతి: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలోకి తీసుకుని వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ బిజెపి శాఖ నడుం బిగించింది. ఢిల్లీలో ఏపీ బిజెపి పావులు కదిపింది. ఈమేరకు ఒక యాక్షన్ ప్లాన్ ను తయారు చేసి కేబినెట్ మంత్రి కుమార స్వామి తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వంలో, బీజేపీ ప్రతినిధి బృందం సమావేశమైంది.

గతంలో ఇచ్చిన వినతి ఆధారంగా అధికార యంత్రాంగంతో చర్చలు జరిపిన విషయాన్ని కేంద్ర మంత్రి కుమార స్వామి బిజెపి నేతలకు వివరించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంలో నుండి వచ్చిన ఒక భారీ పరిశ్రమ. అందువల్ల ఆంధ్రుల సెంటిమెంట్ ను గౌరవవిస్తు నిర్ణయం ఉండాలన్న విషయాన్ని మంత్రి వద్ద ప్రస్తావించారు.

స్టీల్ ప్లాంట్ ను సమర్ధవంతంగా నిర్వహిస్తు లాభాల బాటలో కి తీసుకుని వచ్చే కోణంలో మాత్రమే విధానాలు ఉండాలన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి వద్ద ప్రస్తావించారు. స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు, అవసరమైన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రిని కోరారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కుమార స్వామి సానుకూలంగా స్పందిస్తూ.. అధికారులతో కూలంకుషంగా చర్చలు జరిపిన తరువాత ఇదే విషయం పై రెండు మాసాల్లో మరోమారు ఒక సమావేశం నిర్వహించుకుందామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కి హామీ ఇచ్చారు. ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాధరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.

Leave a Reply