– ఢిల్లీకి మూటలు పంపేందుకే అంచనాలు పెంచిండు
– కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీలవి చిల్లరమాటలు
– మేడిగడ్డ లో ఒక్క రూపాయి ప్రజాధనం కూడా వృథా కాలేదు
– లక్ష కోట్ల కుంభకోణం అంటే ఆయనకు పిల్లనిచ్చిన మామ మాత్రం అదేం లేదని కొట్టి పారేసిండు
– కేసీఆర్ పనితనాన్ని ప్రపంచం ముందు ఘనంగా చెప్పుకోవడంలో పార్టీగా విఫలమయ్యాం
– రాకేష్ రెడ్డి చేసిన ప్రయత్నం అభినందనీయం
– కాళేశ్వరం డాక్యుమెంటరీని తెలంగాణలోని ప్రతి గడపకు తీసుకపోతాం
– కాళేశ్వరంపై రూపొందించిన డాక్యుమెంటరీని తెలంగాణ భవన్ లో ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లుగానే కేసీఆర్ ని తెలంగాణలోని ప్రతి బిడ్డ గుర్తు పెట్టుకుంటుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా తెలంగాణ రైతులు కన్నీళ్లనే తప్ప సాగునీళ్లను చూడలేదన్నారు.
బిఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి రూపొందించిన కాళేశ్వరం డాక్యుమెంటరీని తెలంగాణ భవన్ లో ఆవిష్కరించిన కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కామధేనువు.. కల్ప తెరువు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. 1100 కోట్ల రూపాయలతో కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టుకు గతంలోనే కేసిఆర్ శ్రీకారం చుట్టారన్నారు. అయితే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు పంపేందుకే సిఎం రేవంత్ ఆ ప్రాజెక్టు అంచనాలను ఏడు రెట్లు పెంచి 7400 కోట్లు చేశారని ఆరోపించారు.
తెలంగాణకు కరువు వచ్చినా కూడా నీటి గోస లేకుండా చేసే ప్రాజెక్టు కాళేశ్వరం. 85 పిల్లర్లలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కాంగ్రెస్ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి లక్ష కోట్ల కుంభకోణం అంటే ఆయనకు పిల్లనిచ్చిన మామ మాత్రం అదేం లేదని కొట్టి పారేసిండు.
మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కైనా ఖర్చు 93 వేల 769 కోట్లు. ఇందులో మేడిగడ్డ బరాజ్ కు భూసేకరణతో కలుపుకుని అయిన ఖర్చు 4000 కోట్లు. సిమెంట్ నిర్మాణానికి 1500 కోట్లు మాత్రమే ఖర్చయింది. ఏడవ బ్లాక్ లో కుంగిన రెండు పిల్లర్ల ను పునరుద్ధరించడానికి అయ్య ఖర్చు 300 కోట్లు. బరాజును నిర్మించిన ఎల్ అండ్ టి సంస్థనే తన పైసలతో పునర్ నిర్మిస్తాం అంటుంది. ఇక ఇందులో ప్రజాధనం ఎక్కడ వృధా అయ్యింది ?
కమిషన్ పేరుతో మూడు కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసి కొండను తవ్వి ఎలుకును కూడా పట్టుకోలేకపోయింది రేవంత్ ప్రభుత్వం. మేడిగడ్డకు రిపేర్లు ఎందుకు చేయడం లేదని అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. కాళేశ్వరం కూలిపోతే హైదరాబాద్ కి గోదావరి నీళ్లు ఎలా తీసుకొస్తారని ఓవైసీ అడిగితే ముఖ్య మంత్రి గుడ్లు తేలేసిండు.
తెలంగాణ తలరాత మార్చిన కేసీఆర్ పనితనాన్ని ప్రపంచం ముందు ఘనంగా చెప్పుకోవడంలో పార్టీగా విఫలమయ్యాం. స్వాతంత్రానికి పూర్వం పోలవరం ఆలోచన మొదలైంది. 1940 లో పోలవరం ప్రాజెక్టు కట్టాలని అనుకుంటే.. 80లో శంకుస్థాపన జరిగింది. 2004లో డిజైన్లు గీశారు. 2014లో పనులు మొదలయ్యాయి. కానీ ఇప్పటికి ఇంకా ఆ ప్రాజెక్టు పూర్తికాలేదు. అదే కాళేశ్వరం ప్రాజెక్టుకు 2016లో శంకుస్థాపన చేసి కేవలం ఆరు సంవత్సరాల్లోనే కేసీఆర్ దాన్ని నిర్మించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ను స్వల్పకాలంలో నిర్మించిన కెసిఆర్ పనితనానికి, ఇతర ముఖ్యమంత్రుల పనితనానికి ఇంతకు మించిన ఉదాహరణ ఉండదు. పోచంపాడు ప్రాజెక్టు కింద ఉన్న ఆర్మూరు నియోజకవర్గంలోని చివరి మడికే నీళ్లు రాకపోయేవి. సముద్రమట్టానికి 110 -120 మీటర్ల ఎత్తులో కృష్ణా నది ప్రవహిస్తే, గోదావరి 80 నుంచి 100 మీటర్ల ఎత్తు నుంచి ప్రవహిస్తుంది.
సముద్రమట్టానికి 80 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నదిని మేడిగడ్డ దగ్గర ఒడిసిపట్టి సముద్ర మట్టానికి 535 మీటర్ల ఎత్తులో ఉన్న హైదరాబాద్ కు తీసుకొచ్చిన బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరం. 15 గొలుసు కొట్టు రిజర్వాయర్లు,19 సబ్ స్టేషన్లు ,21 పంపు హౌస్ లు, వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు, వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువల సమాహారమే కాళేశ్వరం.
హైదరాబాద్ నెత్తి మీద ఉన్న నీటి కుండ కొండపోచమ్మ సాగర్ తో ఇంకో 50 ఏళ్ల వరకు నగరానికి తాగునీటి కొరత రాదు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారం తప్పని నిరూపించేందుకు రాకేష్ రెడ్డి చేసిన ప్రయత్నం అభినందనీయం. రాకేష్ రెడ్డి రూపొందించిన ఈ కాళేశ్వరం డాక్యుమెంటరీని తెలంగాణలోని ప్రతి గడపకు తీసుకపోతాం. ప్రతి ఒక్కరికి చూపిస్తాం.