– భవిష్యత్తు గెలుపునకు భువనగిరి నుంచే పునాది
– యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో బీఆర్ఎస్కు పూర్వవైభవం ఖాయం
– తల్లి పాలిచ్చే బర్రెను వదిలి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లుంది కాంగ్రెస్ పాలన
– జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలి
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
యాదాద్రి భువనగిరి జిల్లా : బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైందని, భవిష్యత్తులో సాధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా గడ్డ పునాది వేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు.
పెద్దలు చెప్పినట్లు ఎక్కడైతే అధికారం పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలని, ఈరోజు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఆ ఉత్సాహాన్ని ఇస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రెండేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో నిరాశ ఎదురైనా, నేడు
భువనగిరిలో 56 మంది, ఆలేరులో 74 మంది, మునుగోడులో 15 మంది, తుంగతుర్తిలో 9 మంది, నకిరేకల్లో 7 మంది.. ఇలా జిల్లా వ్యాప్తంగా మొత్తం 161 మంది సర్పంచులను గెలిపించుకోవడం సామాన్య విషయం కాదని ఆయన కొనియాడారు. ఈ విజయం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని, లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్లోకి వెళ్లామని సిగ్గు లేకుండా మైకుల్లో చెబుతున్న కడియం శ్రీహరి వంటి నాయకులు, అసెంబ్లీలో ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని హీనస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. 70 ఏళ్ల వయసులో సంపాదించుకున్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి సంకలో చేరి నాశనం చేసుకున్నారని, గబ్బిలాలు సూరు పట్టుకుని వేలాడినట్లు వీరి పరిస్థితి తయారైందని ఘాటుగా విమర్శించారు. స్పీకర్ గారు కూడా ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆడుతూ, ఫిరాయింపులు కనపడనట్లు నటిస్తున్నారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు ఫీట్లు ఉన్నా ముప్పై ఫీట్ల డైలాగులు కొడతారని, కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు మోసపోయామని గ్రహిస్తున్నారని కేటీఆర్ అన్నారు. తులం బంగారం ఇస్తామని, పింఛన్లు పెంచుతామని లంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు రైతుబంధు రాక రైతులు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. తినే పళ్లెంలో మన్ను పోసుకున్నామని, పాలిచ్చే బర్రెను వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు.
గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సాధించిన అభివృద్ధిని కేటీఆర్ వివరించారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ప్రతినిధులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని, దీనికి భయపడాల్సిన పనిలేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, బూడిద బిక్షమయ్య గౌడ్, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.