Home » జూన్‌ మొదటివారంలో రైతుబంధు విడుదల చేయాలి

జూన్‌ మొదటివారంలో రైతుబంధు విడుదల చేయాలి

-బోనస్‌ను బోగస్‌గా మార్చకండి
-అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వాలి
-ఆరు నెలల పాలనలో చెప్పుకోవడానికి చేసిందేమీ లేదు
-తిట్లు మాని కేబినెట్‌లో మంచి నిర్ణయాలు తీసుకోండి
-బీఆర్‌ఎస్‌ నేత బి.వినోద్‌కుమార్‌

ఆరునెలలో పాలనలో చెప్పుకోవడానికి రేవంత్‌ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాజీ శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌ ప్రభుత్వం ఆరో మాసంలోకి ప్రవేశించింది. చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేటి కేబినెట్‌ సమావేశంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. రైతుబంధు దేశంలోనే మొదటి సారి అమలుచేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది.

రేవంత్‌ యాసంగి రైతు బంధు పంటలు కోసే సమయానికి ఇచ్చారు. ఈసారి అలాంటి తప్పు చేయ కుండా రైతు భరోసాను రోహిణి కార్తెలో విడుదల చేసేలా కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవాలి. జూన్‌ మొదటివారంలోనే రైతులకు ఎకరాకు రూ.7500 విడుద ల చేయాలి. ఆ దిశగా కేబినెట్‌లో నిర్ణయించాలి. వర్షా కాలంలోనే ఎక్కువగా సన్న రకాల ధాన్యం పండిస్తారు. రబీలో నూకల శాతం ఎక్కువగా ఉంటుందని రైతులు సన్న రకాలు సాగు చేయరు. క్వింటాకు రూ.500 బోనస్‌ సన్న వడ్లకే ఇస్తామనడం రైతులను మోసం చేయడమే. అన్ని రకాల వడ్లకు ఇవ్వాలి. తిట్ల మీద కాకుండా రైతులకు మేలు చేయడంపై కేబినెట్‌ మీటింగ్‌లో చర్చించాలి. బోనస్‌ను బోగస్‌గా మార్చకండి. రేవంత్‌కు ఇదే కీలకమైన కేబినెట్‌ సమావేశం .మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్నికలకు ముందు సన్నవడ్లకే బోనస్‌ అని చెప్పి ఉంటే కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా వచ్చి ఉండేవి కావు. తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఎంత ఉన్నా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి తీరాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

Leave a Reply