– బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత
పెనుకొండ : సామాజిక సేవలో చేతన ఫౌండేషన్ సేవలు శ్లాఘనీయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖా మంత్రి ఎస్.సవిత కొనియాడారు. పెనుకొండలో 100 మందికి కుట్టుమిషన్లు, ట్రై సైకిళ్లు, తోపుడు బండ్లను మంత్రి సవిత చేతుల మీదుగా చేతన ఫౌండేషన్ నిర్వాహాకులు అందజేశారు.
ఆదివారం స్థానిక మార్కెట్ యార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, మంత్రి పదవి వచ్చి రెండు నెలల కావస్తున్నా కలగని ఆనందం నేడు తనకు సంతృప్తినిస్తోందన్నారు. సామాజిక సేవలో ఉన్న సంతృప్తి ఎన్ని పదవులొచ్చినా కలగదన్నారు. పెనుకొండ నియోజక వర్గంలో చేతన ఫౌండేషన్ సేవా కార్యక్రమం చేపట్టాలని కోరగానే ఆ సంస్థ చైర్మన్ రవికుమార్ అంగీకరించారన్నారు. ఆయనకు పెనుకొండ వాసుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ‘చేతన’ రవికుమార్ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. చేతన ఫౌండేషన్ దశాబ్దాల తరబడి సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ పేదలకు అండగా నిలుస్తోందన్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో ఆ సంస్థ చేపట్టిన సేవలు ఎంత పొగిడినా తక్కువేనన్నారు. మహిళలు తమ కాళ్లు మీద తాము నిలబడేలా చేతన ఫౌండేషన్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
చేతన ఫౌండేషన్ అందిస్తున్న చేయూతను వినియోగించుకుని మహిళలు ఆర్థిక ఉన్నతి సాధించాలన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించిన నాడే ఆ కుటుంబం కూడా ఎంతో వృద్ధి చెందుతుందన్నారు. జగన్ అసమర్థత వల్ల గడిచిన 5 ఏళ్లలో అన్ని రంగాలతో పాటు విద్యా వ్యవస్థ కూడా పూర్తిగా గాడి తప్పిందన్నారు. రెండు నెలల కిందటే అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతోందన్నారు.
పెనుకొండ నియోజక వర్గంలో రెండు బీసీ హాస్టళ్లను ‘చేతన’ రవి కుమార్ దత్తత తీసుకోవాలని మంత్రి సవిత కోరారు. కుట్టు మిషన్లు ఇవ్వడమే కాకుండా లబ్ధిదారులకు మరింత నైపుణ్యం కలిగేలా శిక్షణ ఇవ్వనున్నామన్నారు. కుట్టు మిషన్ల ద్వారా ఆదాయం పెంచుకున్న వారికి జిగ్ జాగ్ మిషన్లు కూడా అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చేతన ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ, తమ సంస్థ ఆధ్వర్యంలో 20 ఏళ్ల నుంచి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్తులోనూ ఈ సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
అనంతరం వంద మంది లబ్ధిదారులకు కుట్టుమిషన్లు, తోపుడు బండ్లు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లను మంత్రి సవిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత దంపతులను చేతన ఫౌండేషన్ నిర్వాహాకులు సత్కరించారు. చేతన ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్ ను, ఆ సంస్థ జాయింట్ సెక్రటరీ సీతారామయ్యను, ఇతర సభ్యులను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,చేతన ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.