Suryaa.co.in

Andhra Pradesh

తిరుమల లో శాస్త్రోక్తంగా శాంతి హోమం

  • లోక క‌ల్యాణార్థం, సర్వ దోషాల నివారణకు విశేష పూజలు
  • భక్తులు క్షమా మంత్రాన్ని పఠించాలి
  • టీటీడీ ఈవో శ్యామలరావు

తిరుమల: లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహించింది. శాంతి హోమం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు రుత్వికులు వాస్తు శుద్ధి, కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారన్నారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం, నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను, అపోహలను పక్కన పెట్టవచ్చు అన్నారు.

అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు మాట్లాడుతూ, యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, కుంభప్రతిష్ఠ, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్టు చెప్పారు. ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని, భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని తెలిపారు.

సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో, క్షమా మంత్రాలైన…. ”ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వేంకటేశాయ” లను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరన్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, తిరుమల చిన్న జీయర్ స్వామి, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ప్రధానార్చకుడు గోవిందరాజ దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, ఆగమ సలహాదారులు శ్రీరామకృష్ణ దీక్షితులు, సీతారామ దీక్షితులు, వేదపారాయణదారులు, రుత్వికులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE