Home » వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థకు షోకాజ్ నోటీసులు

వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థకు షోకాజ్ నోటీసులు

• త్వరలో పరిశ్రమల ప్రతినిధులతో పర్యావరణ నిబంధనలు అమలుపై సమావేశం
• జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణపై ఎప్పటికప్పుడు సమీక్షించాలి
• వికసిత భారత్ – 2047 లక్ష్యంలో భాగంగా కర్బన ఉద్గారాలు తగ్గిద్దాం
• సముద్రపు కోత సమస్యపై సమగ్రంగా అధ్యయనం చేయాలి
• పర్యావరణ పరిరక్షణ, నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
• స్వచ్ఛమైన గాలి, నీరు పొందటం ప్రజల హక్కు
• కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్షలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మంగళగిరి: ‘పర్యావరణ నిబంధనలు పారిశ్రామిక ప్రగతికి అవరోధం కాదు. పర్యావరణహితంగా పరిశ్రమలు నిర్వహించడం అవసరం. అందుకు అనుగుణంగా ఎలాంటి విధానాలు అనుసరించాలనే అంశంపై ఎప్పటికప్పుడు పరిశ్రమల నిర్వాహకులు, ప్రతినిధులకు అవగాహన కల్పించాలి. నిబంధనల అమలుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల’ని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

ఇందులో భాగంగా త్వరలో పరిశ్రమల ప్రతినిధులతో పర్యావరణ నిబంధనల అమలుపై సమావేశం నిర్వహించాలన్నారు. పారిశ్రామిక కాలుష్యంపై ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు తెలియచేయడంతోపాటు, పరిశ్రమల ప్రతినిధుల సాదకబాధకాలు తెలుసుకొనేలా ఈ సమావేశం ఉండాలని తెలిపారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని తన నివాసంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలి కార్యకలాపాలు, కాలుష్య నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలతోపాటు జల, వాయు, శబ్ద కాలుష్యానికి సంబంధించిన గణాంకాలను అధికారులు వివరించారు. పర్యావరణ సంబంధిత విషయాలకు సంబంధించి ‘పర్యావరణ యాప్’, వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. వాయు, జల, శబ్ద కాలుష్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా అందులో పొందుపరుస్తున్నట్లు వివరించారు.

సాగర జల కాలుష్యంతో మత్య్స సంపదకు ముప్పు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పారిశ్రామిక కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తించాలి. ఇందుకు సంబంధించి ఆడిట్ నిర్వహించాలి. స్వచ్ఛమైన గాలి, నీరు పొందటం ప్రజల హక్కు. సముద్ర తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి విడిచిపెట్టడంతో మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతోంది. ఫలితంగా మత్స్యకారులు డీప్ సీలోకి వెళ్ళి వేటాడాల్సి వస్తోంది. మత్స్యకార ప్రతినిధులు పలు సందర్భాల్లో ఈ విషయంపై ఆందోళన చెందుతూ ఫిర్యాదులు చేశారు.

మత్స్య సంపదతోపాటు సముద్రంలో ఉండే జల, జీవచరాలు నాశనం అవుతున్నాయి. ఈ విషయంపై పీసీబీ దృష్టి సారించాలి” అన్నారు. ఈ సందర్భంగా పరవాడ ఫార్మా సంస్థల మూలంగా తాడి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించీ, ఇందుకు సంబంధించి ఉన్న నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

ఈ సందర్భంగా పట్టణాలు, నగర పాలక సంస్థల్లో మురుగు నీటి నిర్వహణపై చర్చించారు. మురుగు నీటి నిర్వహణ ప్లాంట్ల ఏర్పాటు, వాటికి అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించాలన్నారు. నిర్మాణ రంగంలో వచ్చే వ్యర్థాలను, నిర్మాణాల కూల్చివేత తరవాత వచ్చే వ్యర్ధాలను కూడా నిబంధనలకు అనుగుణంగా పారవేయడంపై అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. సిమెంట్ కంపెనీలు పర్యావరణ నిబంధనలు ఏ మేరకు అమలు చేస్తున్నాయో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

సముద్రపు కోత ఆందోళనకరం
సుదీర్ఘ సాగర తీరం ఉన్న మన రాష్ట్రంలో సముద్రపు కోత ఆందోళనకరంగా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉప్పాడ సముద్రపు కోతకు సంబంధించిన ఇటీవల పరిశీలించిన అంశాలపై చర్చించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో సుమారు 70 కిమీ సముద్రపు కోతకు గురైందని అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తీరంలో 31శాతం మేర సముద్రపు కోతకు గురైందని తెలిపారు. సముద్రపు కోత, పర్యవసానాలు, కోత అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో అధ్యయనం చేయించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.

వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థకు షోకాజ్ నోటీసులు
కాకినాడ జిల్లా గురజనాపల్లిలో ఉన్న వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్న విషయాన్ని ఈ సమీక్షలో చర్చించారు. ఈ సంస్థ రోజుకి 25 టన్నుల ఉత్పత్తికి అనుమతులు పొంది 56 టన్నులు ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు వివరించారు. ఈ సంస్థ నుంచి వచ్చే వ్యర్థ జలాలు, ఆక్వా వ్యర్థాలు నిర్వహణకు అక్కడి ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ సామర్థ్యం సరిపోదని…. అక్కడి వ్యర్థాలను బైపాస్ చేస్తున్నారని అధికారులు తెలిపారు.

ఇంత సామర్థ్యంతో అక్కడి ప్లాంట్ పని చేయాలంటే మరో 11 ఎకరాలు కూడా ఉండాలనీ, కానీ తక్కువ విస్తీర్ణంలోనే సంస్థను నడిపిస్తున్నారని వివరించారు. రొయ్యలను వలిచే ప్రక్రియలో సైతం ఈ సంస్థ నిబంధనలు విరుద్ధంగా పని చేస్తోందని… పరిసర గ్రామాల్లో చిన్న చిన్న యూనిట్స్ ద్వారా వలిపించి ఆ వ్యర్థాలను అక్కడే పారవేస్తున్నట్లు గుర్తించామని ఉప ముఖ్యమంత్రివర్యుల దృస్తికి అధికారులు తీసుకువచ్చారు.

ఈ వ్యర్థాలను స్థానికంగా పారవేయడం వల్ల కాలుష్యం పెరగటం, గ్రామాలలో వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ “ఈ సంస్థ వ్యర్ధ జలాలను పంట కాలువల్లోకి విడిచిపెడుతున్న విషయాన్ని ఆ ప్రాంత రైతులు ఇప్పటికే ఆందోళనలో ఉన్నారు. ఈ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసి 15 రోజుల్లోగా వివరణ తీసుకోండి. అక్కడ జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనపై లోతుగా విచారణ చేపట్టాలి” అని ఆదేశించారు.

ప్రధాని మోదీ లక్ష్యంలో భాగం కావాలి
వికసిత భారత్ 2047 అనేది ప్రధాని మోదీ లక్ష్యం ఎంతో విస్తృతమైనదని, పారిశ్రామిక, రవాణా రంగ ప్రగతిలో భాగంగా కర్బన ఉద్గారాలు తగ్గించడం కూడా అవసరమని, ఇందుకు అనుగుణంగా పీసీబీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దీనిపై ప్రత్యేకంగా చర్చించాలని, మన రాష్ట్రం మోదీ లక్ష్యంలో భాగమై, కర్బన ఉద్గారాలు తగ్గించడంలో ముందంజలో ఉండాలని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి శ్రీ బి.శ్రీధర్, మండలి ముఖ్య అధికారులు ఎన్.వి.భాస్కరరావు, కె.శ్రీరామమూర్తి, పి.ప్రసాదరావు, ఎం.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply