– జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ, కేంద్ర నిర్ణయాన్ని అభినందిస్తూ దేశంలో తొలిసారి ఏపీ శాసన సభలో తీర్మానం
– జీఎస్టీ ప్రయోజనాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలో కూటమి ప్రభుత్వం
– జీఎస్టీ 2.0 సంస్కరణలపై శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి: దేశంలోనే తొలిసారి జీఎస్టీ 2.0 సంస్కరణలపై తీర్మానంపై ఏపీ శాసనసభ గురువారం చర్చించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…
గతంలో సీఎస్టీ, వ్యాట్ లాంటి సంక్లిష్టమైన పన్నుల వ్యవస్థ ఉండేది. 17 రకాల పన్నులు , 13 రకాల సెస్సులు సర్చార్జిలు ఉండేవి. ఒక ఉత్పత్తికి అనుబంధ ఉత్పత్తులు వచ్చినా పన్నులు వేసే పరిస్థితి ఉండేది. 140 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలిగేలా జీఎస్టీలో రెండు స్లాబులతో సంస్కరణలు తీసుకువచ్చింది.
రెండు శ్లాబులతో పన్నుల వ్యవస్థను మరింత సరళతరం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తే అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది. నెక్స్ జెన్ జీఎస్టీ అమలు దేశంలో ఓ గేమ్ చేంజర్. సంపద సృష్టించని వారికి సంక్షేమం చేసే అధికారం లేదు. కేంద్రం తీసుకువచ్చిన ఈ సంస్కరణలతో ముందుగానే దీపావళి, దసరా పండుగల బోనస్ ఇచ్చారు. 99 శాతం మేర వస్తువులన్నీ 5 శాతం పన్ను పరిధిలోకే వచ్చాయి. పేద మధ్యతరగతి ఇలా అందరికీ లబ్ది కలుగుతుంది. ఈ రిఫార్మ్స్ వల్ల పన్ను చెల్లింపు దారుల సంఖ్య 1.51 కోట్లకు పెరిగింది. అలాగే జీఎస్టీ వసూల్లు 22 లక్షల కోట్లకు పెరిగాయి.
వన్ నేషన్ – వన్ ట్యాక్స్ అనే విధానం సక్రమంగా అమలు కావటం వల్ల ప్రయోజనం చేకూరుతోంది. ఈ నెక్స్ జెన్ రిఫార్మ్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా డబుల్ డిజిట్ గ్రోత్ సాధించే దేశంగా భారత్ ఉంటుంది. జీఎస్టీ సంస్కరణలతో వచ్చిన ప్రయోజనాలను ప్రజలందరికీ చేరువ చేసే బాధ్యత అందరం తీసుకోవాలి. నిత్యావసర వస్తువులు సబ్బులు, టూత్ పేస్టు, షాంపూలు, నెయ్యి లాంటి వస్తువులన్నీ 5 శాతానికి వచ్చాయి. ఏసీలు, ఫ్రిడ్జ్ ల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయి. జీవిత బీమా, ఆరోగ్య బీమాలకు కూడా జీఎస్టీ సున్నా శాతానికి వెళ్లింది. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రూ.750 కోట్ల వరకూ ఏపీకి ఆదా అవుతుంది.
అగ్రిటెక్ యంత్రాలకు కూడా గణనీయంగా పన్ను తగ్గింది. రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఇళ్ల నిర్మాణానికి వినియోగించే వస్తువుల ధరలు కూడా 5 శాతం శ్లాబ్ లోకి వచ్చాయి. నిర్మాణ రంగం పుంజుకుంటుంది.
సాధారణ ప్రజలు కూడా వినియోగించుకునేలా ఎలక్ట్రానిక్స్ వస్తువులపై జీఎస్టీ తగ్గింది. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఈ జీఎస్టీ ప్రయోజనాలు దక్కాలి. చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ అంశాలు తెలియాలి