– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నుండి లైసెన్స్ పత్రాలు స్వీకరించిన సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్
సింగరేణి భవన్: సింగరేణి సంస్థ కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ చేయడానికి అనుమతిస్తూ జారీచేసిన లైసెన్సులను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ కు అందజేశారు.
మంగళవారం హైదరాబాద్ లోని టీ హబ్ లో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక ఖనిజాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెమినార్ లో వీటిని అందజేశారు. గత మార్చి నెలలో కేంద్ర గనుల శాఖ నిర్వహించిన కీలక ఖనిజాల వేలంపాటలో సింగరేణి సంస్థ పాల్గొని 37.75 శాతం రాయల్టీతో కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ ప్రాంతంలో 199 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ పనిని దక్కించుకుంది. దీనికి సంబంధించిన లైసెన్సు, సర్టిఫికెట్లను మంగళవారం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అందజేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ కీలక ఖనిజ రంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడం కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కృషి చేయాలన్నారు. దేశంలో కీలక ఖనిజ రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 32 వేల కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. కీలక ఖనిజాల అన్వేషణకు వేలంపాటలో విజేతలైన వారికి ఆయన అభినందనలు తెలియజేశారు. వెంటనే అన్వేషణ పనులు ప్రారంభించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ తో పాటు తెలంగాణ రాష్ట్ర డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, సింగరేణి డైరెక్టర్ (పి.పి) కె.వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్ కో-ఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ తాడబోయిన శ్రీనివాస్, జనరల్ మేనేజర్ ఎక్స్ప్లోరేషన్ శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్ ఆర్ అండ్ డి కనకయ్య పాల్గొన్నారు.