– 117 పంచాయతీల్లో 80 స్థానాలు కైవసం చేసుకున్న బీఆర్ఎస్
– అధికారంలో ఉండి చతికిలపడ్డ కాంగ్రెస్.. ప్రగల్భాలకే పరిమితమైన బీజేపీ
– రెండు దశాబ్దాలుగా మా పార్టీతో సిరిసిల్ల బంధం చెక్కుచెదరలేదు: కేటీఆర్
– ప్రజలకు పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
హైదరాబాద్: సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అద్భుత విజయం సాధించిందని, సిరిసిల్ల గడ్డ మరోసారి గులాబీ అడ్డా అని రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే శ్రీ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మొత్తం 117 గ్రామ పంచాయతీలకు గాను, బీఆర్ఎస్ మద్దతుదారులు ఏకంగా 80 స్థానాల్లో ఘనవిజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారని తెలిపారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలలోని 117 గ్రామపంచాయతీలో ఎన్నికలు జరగగా 80 స్థానాలలో బిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన పార్టీ నాయకులు విజయం సాధించారు. అధికార దుర్వినియోగము, బల ప్రయోగము వంటి పద్ధతుల్లో ప్రయత్నం చేసిన అధికార పార్టీ కాంగ్రెస్ కేవలం 24 స్థానాల్లో చాలా కష్టం మీద గెలిచింది. బిజెపి మాత్రం కేవలం 13 గ్రామ పంచాయతీల్లో తమ పార్టీ మద్దతు దారులను గెలిపించుకోగలిగింది.
నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల పైన కేటీఆర్ స్పందిస్తూ… “గత రెండు దశాబ్దాలుగా సిరిసిల్ల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీతో ఉన్న అనుబంధం ఎంత బలమైనదో ఈ ఫలితాలు మరోసారి తేల్చిచెప్పాయి. ఉద్యమ పార్టీగా ఉన్నా, అధికార పార్టీగా ఉన్నా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సిరిసిల్ల ప్రజలు గులాబీ జెండానే గుండెల్లో పెట్టుకున్నారు” అని అన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ తెలియజేశారు. ఎన్నికల కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ విజయం సిరిసిల్ల ప్రజలు అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా, బీజేపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టి, కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉంచి 80 స్థానాల్లో గెలిపించిన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు వందనం చేస్తున్నాను” అని కేటీఆర్ తెలిపారు.