శంషాబాద్, గాగిల్లాపూర్లో యూనిట్ల విస్తరణకు నిర్ణయం
దావోస్ : రాష్ట్రంలో స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ తన యూనిట్లను విస్తరించనుంది. శంషాబాద్, గాగిల్లాపూర్లో రూ.623 కోట్ల పెట్టుబడితో విస్తరణ చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వేదిక –2026 సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, స్నైడర్ ఎలక్ట్రిక్ సీఈవో దీపక్ శర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు, విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునీకరణ, సామర్థ్య విస్తరణ, ఇండస్ట్రియల్ పార్కులు, పట్టణ మౌలిక వసతులకు డిజిటల్ విద్యుత్ నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. యూనిట్ల విస్తరణతో ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించిన ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు, కాంటాక్టర్లు, పుష్ బటన్ల తయారీ సామర్థ్యం పెరగనుంది.
తెలంగాణలోనే స్నైడర్ ఎలక్ట్రిక్కు 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయని సంస్థ ప్రతినిధులు వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కృషి చేసిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ముఖ్యమంత్రి అభినందించారు. 2047 నాటికి నెట్ జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో పర్యావరణ పరిరక్షణ కీలకమని సీఎం తెలిపారు. ఇంధన నిర్వహణ, ఆటోమేషన్, ఈవీ భాగాల తయారీలో స్మార్ట్ ఫ్యాక్టరీల విస్తరణపై కూడా చర్చ జరిగిందని, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాల్లో తెలంగాణ ఒకటిగా ఎదిగిందని మంత్రులు పేర్కొన్నారు.