Home » రాజకీయ నేతల గుప్పెట్లో బందీలయిన క్రీడా సంఘాలు

రాజకీయ నేతల గుప్పెట్లో బందీలయిన క్రీడా సంఘాలు

– ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విన్నవిస్తున్న క్రీడాకారులు

మంగళగిరి : గత వై. ఎస్. ఆర్. సి. పి. ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రంగాలూ అధోగతి పాలయ్యాయి. క్రీడారంగం సైతం అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో దారి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధృడ సంకల్పంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు.

ఈ నేపథ్యం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అమితంగా ఇష్టపడే మేధావులు, ప్రముఖులు, వాణిజ్యవేత్తలు, క్రీడాకారులు పవన్ కళ్యాణ్ ని కలుస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీకి చెందిన క్రీడాకారులు ఈ మధ్య కాలంలో కలిసిన వారిలో ఉన్నారు. ఇలా కలసినవారిలో ప్రముఖ క్రికెటర్ శ్రీ హనుమ విహారి కూడా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో క్రీడారంగం అభివృద్ధికి దోహదపడే అనేక విషయాలను వారు ప్రస్తావించారు. క్రీడా సంఘాలు బాగుపడితేనే అత్యుత్తమ క్రీడాకారులు రూపొందుతారని దానికి సరైన మార్గదర్శనం చేసేవారు అవసరమని వారు పవన్ కళ్యాణ్ కి విన్నవించారు. క్రీడలతో సంబంధంలేని వారి చేతికి క్రీడా సంఘాలను అప్పగించవద్దని వారు ఆవేదనతో విన్నవించారు.

క్రికెట్ లో అనుభవం ఉన్నవారికే క్రికెట్ సంఘం భాద్యతలు అప్పగించాలని, అలాగే కబడ్డీ ఆటపై పట్టు ఉన్నవారికే కబడ్డీ సంఘాన్ని అప్పగించాలని, ఇదే పద్దతి అన్ని సంఘాలలో అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగంలో అగ్రగామిగా నిలుస్తుందని సూచించారు. డా సంఘాలలో జరుగుతున్న కొన్ని విషయాలను క్రీడాకారులు వివరించినప్పుడు పవన్ కళ్యాణ్ ఆవేదన చెందారు. కొన్ని క్రీడా సంఘాలు రాజకీయ ఉపాధి ఆవాస కేంద్రాలుగా మారిపోవడం వల్ల క్రీడాకారులకు ఇచ్చే సర్టిఫికేట్లు అంగడి సరుకుగా మారిపోయాయని తెలిపారు.

దానివల్ల ఎటువంటి క్రీడానుభవం లేనివారు క్రీడాకారుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా సంఘాలలో తిష్టవేసిన రాజకీయ నాయకులు క్రీడాకారుల ఎంపికలో తమ బందువులు, సన్నిహితుల పిల్లలను వారి అధికార దర్పంతో ఎంపిక చేయిస్తున్నారనీ ఫలితంగా పోటీలలో వారు నిలబడలేకపోతున్నారని తమ బాధను వెలిబుచ్చారు.

క్రీడా సంఘాల నిధులు యధేచ్చగా దోపిడీకి గురవుతున్నాయనీ, క్రీడా సంఘాలలో క్రీడానుభవం లేని రాజకీయనాయకులకు ప్రవేశం లేకుండా చూడాలని కోరారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, ముఖ్యంగా క్రికెట్ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని వారు ముందుకు వచ్చారు.

క్రీడాకారుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు విన్న పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో చర్చిస్తానని వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్. డి. ఏ. ప్రభుత్వం క్రీడా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, క్రీడలకు వైభవాన్ని తప్పకుండా తీసుకు వస్తామని తనను కలిసిన క్రీడాకారులకు భరోసా ఇచ్చారు.

Leave a Reply