Suryaa.co.in

Andhra Pradesh Telangana

హైదరాబాద్-విజయవాడ మధ్య జాతీయ రహదారి-65ను 6 లేన్లకు విస్తరించేలా చర్యలు

– హైదరాబాద్-విశాఖపట్నం కారిడార్ లో భాగంగా తెలంగాణలో 164 కి.మీ. మేర రూ. 6 వేల కోట్లతో పనులు
– మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత
– తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో కనెక్ట్ చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదే
– తెలంగాణ రాష్ట్ర పరిధిలో దాదాపు రూ. 4500 కోట్లతో 136 కి.మీ. మేర పనులు
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా 90 శాతం జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. అభివృద్ధి విషయంలో దేశ ముఖచిత్రాన్ని మార్చే దిశగా వేగంగా ముందుకెళ్తోంది. మౌలిక వసతులు సమగ్రంగా కల్పితమైతే, దేశంలో వేగవంతమైన మరియు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

ఈ దిశలో రోడ్లు, రైలు, విమాన, పోర్టు, టెలీ కనెక్టివిటీ వంటి అంశాలపై కేంద్రం అత్యంత ప్రాధాన్యతతో మౌలిక వసతుల కల్పన చేస్తున్నది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్డు, రైలు, విమాన, పోర్టు, టెలీ కనెక్టివిటీలను మెరుగుపరచేందుకు కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగుతోంది.

రోడ్ల నిర్మాణం లేకుండా ఏ దేశమైనా అభివృద్ధి సాధించడం సాధ్యపడదు. పక్కా రోడ్లతో ఇంధన వినియోగ వ్యయం తగ్గుతుంది, ప్రమాదాలు తగ్గుతాయి, రవాణా వేగవంతమవుతుంది, గమ్యస్థానానికి తక్కువ సమయంలో చేరుకోవచ్చు. గత పదేళ్లుగా మోదీ ప్రభుత్వం అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే స్థాయిలో జాతీయ రహదారుల అభివృద్ధిని చేపట్టింది.

రోడ్ల అభివృద్ధి ద్వారా దేశంలో లోకల్, గ్లోబల్ బిజినెస్ అభివృద్ధి సాధ్యమవుతుంది. పెట్టుబడుల ఆకర్షణకు రోడ్, రైలు, విమాన కనెక్టివిటీలు ఎంతో కీలకం. వాజ్‌పేయి హయాంలో తొలిసారిగా ‘స్వర్ణచతుర్భుజి’ పేరుతో 70,000 కి పైగా జాతీయ రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేసింది. కానీ అప్పట్లో కొన్ని పార్టీలు దీనిని అవమానించాయి. ఆ స్వర్ణచతుర్భుజి ప్రేరణతోనే మోదీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల రాజధానులను, జిల్లా కేంద్రాలను కనెక్ట్ చేసేలా ప్రయత్నిస్తోంది.

తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో కనెక్ట్ చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. రోడ్, రైలు, విమాన, జల మార్గాలు, టెలీకమ్యూనికేషన్ వంటి కనెక్టివిటీ రంగాల్లో నిధుల కొరత లేకుండా మోదీ ప్రభుత్వం వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. 2014లో తెలంగాణలో 2500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఉండగా, ఇప్పుడు అవి సుమారు 5200 కిలోమీటర్లకు పెరిగాయి.

గత పదేళ్లలో రూ.1,25,485 కోట్లు జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అనేక జాతీయ రహదారి ప్రాజెక్టులు, కీలక ఎకనామిక్ కారిడార్లు, పర్యాటక ప్రోత్సాహక ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తున్నది. హైదరాబాద్ నగరం కూడా దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నది. హైదరాబాద్ నుంచి బాంబే, నాగపూర్ రోడ్డు, వరంగల్ ద్వారా భూపాలపల్లి రోడ్డు, విజయవాడ ద్వారా చెన్నై రోడ్, కర్నూలు ద్వారా బెంగళూరు రోడ్డు వంటి అనేక జాతీయ రహదారుల ద్వారా కనెక్టివిటీ పెంపొందించబడింది.

హైదరాబాద్-శ్రీశైలం మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు జాతీయ రహదారి-765పై మన్ననూరు నుంచి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

హైదరాబాద్-విజయవాడ మధ్య జాతీయ రహదారి-65ను 6 లేన్లకు విస్తరించేలా చర్యలు తీసుకువచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో పలు రోడ్డు, రవాణా ప్రాజెక్టులు భూసేకరణ ఆలస్యమవుతున్న కారణంగా నత్తనడకన నడుస్తున్నాయి. ఈ విషయంలో గత సీఎం కేసీఆర్ కి, ఇప్పుటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కూడా భూసేకరణ ను త్వరితగతిన పూర్తిచేయాలని కోరడం జరిగింది.

గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేల పేరుతో రవాణా వ్యవస్థను సరళతరం చేసేలా దేశ వ్యాప్తంగా రూ. 4.5 లక్షల కోట్ల ఖర్చుతో 10 వేల కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ కారిడార్స్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో దాదాపు రూ. 4500 కోట్లతో 136 కి.మీ. మేర పనులు జరుగుతున్నాయి. సూరత్-సోలాపూర్-చెన్నై కారిడార్ -1056 కి.మీ.-రూ. 40,615 కోట్లతో పనులు జరుగుతున్నాయి.

హైదరాబాద్-విశాఖపట్నం కారిడార్ లో భాగంగా తెలంగాణలో 164 కి.మీ. మేర రూ. 6 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. నాగ్ పూర్-విజయవాడ కారిడార్ లో భాగంగా… తెలంగాణలో 401 కి.మీ. మేర పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్-గోవా కారిడార్ లో భాగంగా తెలంగాణ పరిధిలో 90 కి.మీ. మేర రూ. 3,170 కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయి.

ఈ కారిడార్ల నిర్మాణం కోసం దాదాపు కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. ఇవన్నీ తెలంగాణతో అనుసంధానమైన ప్రాజెక్టులు. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు తెలంగాణలో మరిన్ని రోడ్ల నిర్మాణాలను ప్రారంభించేందు కోసం, మరికొన్ని నూతన ప్రాజెక్టులకు భూమిపూజ చేసేందుకు మే 5వ తేదీన విచ్చేస్తున్నారు.

సుమారు రూ. 5,416 కోట్లతో 167 కి.మీ. మేర మొత్తం 26 ప్రాజెక్టుల పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు మే 5వ తేదీన జరగనున్నాయి. 26 ప్రాజెక్టుల్లో రూ. 4,590 కోట్ల వ్యయంతో 138 కి.మీ. మేర 14 ప్రాజెక్టులకు గడ్కరీ ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే రూ. 826 కోట్లతో నూతన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూమిపూజ చేయనున్నారు.

మే 5వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ లోని కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద జరిగే కార్యక్రమంలో… అదేవిధంగా హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో జరిగే కార్యక్రమం.. ఈ రెండు చోట్ల నుంచి వేర్వేరు కార్యక్రమాలకు నితిన్ గడ్కరీ గారు భూమిపూజతో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రూ. 3,694 కోట్లతో సుమారు 5 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం జరగనుంది. నిర్మల్-ఖానాపూర్ మధ్యలో 17.79 కి.మీ. మేర రోడ్డు వెడెల్పు పనులు పూర్తయ్యాయి. దీనికి ప్రారంభోత్సవం చేస్తారు. మంచిర్యాల్-రేపల్లెవాడ మధ్యలో 42 కి.మీ. మేర రూ. 2001 కోట్లతో 4 లేనింగ్ పనులు పూర్తయ్యాయి.

రేపల్లె నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 52.6 కి.మీ మేర రూ. 1,525 కోట్లతో 4 లేనింగ్ పనులకు ప్రారంభోత్సవం జరగనుంది. నాగ్ పూర్-హైదరాబాద్ సెక్షన్ లో కడ్తాల్ వద్ద రూ. 23.54 కోట్లతో 6 లేన్ అండర్ పాస్ పనులు పూర్తయ్యాయి. 44వ నెంబరు జాతీయ రహదారిపై నాగ్ పూర్-హైదరాబాద్ సెక్షన్ లో సర్వీస్ రోడ్లు, జంక్షన్ల మార్పుల పనులు (నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో) పూర్తయ్యాయి. పైవన్నీంటికి ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి.

అదేవిధంగా మరికొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా ఉన్నాయి.:
44వ నెంబరు జాతీయ రహదారిపై నాగ్ పూర్-హైదరాబాద్ సెక్షన్ లో 1. ఆరాంఘర్ – శంషాబాద్ మధ్యలో 10 కిలోమీటర్ల మేర 6 లేనింగ్ కు భూమిపూజ జరగనుంది.
202వ నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాద్ లోని అంబర్ పేట 6 నం. జంక్షన్ వద్ద.. 1.47 కిలోమీటర్ల మేర రూ. 415 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ కు ప్రారంభోత్సవం జరగనుంది.
65వ నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాద్ లోని BHEL జంక్షన్ వద్ద.. రూ.172.56 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ కు ప్రారంభోత్సవం జరగనుంది.
44 వ నెంబరు జాతీయ రహదారిపై నాగ్ పూర్ – హైదరాబాద్ సెక్షన్ లో మెదక్ జిల్లా రెడ్డిపల్లి జంక్షన్ వద్ద.. 6లేన్ అండర్ పాస్, సర్వీస్ రోడ్డును ప్రారంభోత్సవం చేయనున్నారు.
44 వ నెంబరు జాతీయ రహదారిపై నాగ్పూర్ – హైదరాబాద్ సెక్షన్లో మెదక్ జిల్లా జాప్తిశివనూర్ గ్రామం వద్ద నిర్మించిన అండర్ పాస్, సర్వీస్ రోడ్డు ప్రారంభోత్సవం జరగనుంది.
44 వ నెంబరు జాతీయ రహదారిపై నాగ్పూర్ – హైదరాబాద్ సెక్షన్లో మెదక్ జిల్లా.. గోల్డెన్ ధాబా Y జంక్షన్ వద్ద 6లేన్ అండర్ పాస్ ప్రారంభోత్సవం జరగనుంది..
44 వ నెంబరు జాతీయ రహదారి పై నాగ్పూర్ – హైదరాబాద్ సెక్షన్లో కామారెడ్డి జిల్లా.. టెక్రియాల్, పొందుర్తి X రోడ్స్ వద్ద.. అండర్ పాస్ పనులు పూర్తయ్యాయి. వీటికి కూడా ప్రారంభోత్సవాలు జరగనున్నాయి.
44 వ నెంబరు జాతీయ రహదారిపై నాగ్పూర్ – హైదరాబాద్ సెక్షన్ కామారెడ్డి జిల్లా.. పద్మాజివాడ జంక్షన్ వద్ద అండర్ పాస్, స్లిప్ రోడ్డుకు కూడా ప్రారంభోత్సవం జరగనుంది.
163 నెంబరు జాతీయ రహదారిపై.. హైదరాబాద్ – వరంగల్ సెక్షన్ లో.. ఆలేరు-జీడికల్ X రోడ్స్ వద్ద.. 6లేన్ అండర్ పాస్ ను ప్రారంభోత్సవాన్ని…. అంబర్ పేట్ నుంచి కేంద్రమంత్రి గడ్కరీ గారు వర్చువల్ గా చేయనున్నారు.

శంకుస్థాపనలు: (20.87 కిలోమీటర్లు, రూ.657.27 కోట్లు) :
హైదరాబాద్-విజయవాడ సెక్షన్లో.. టేకుమట్ల సమీపంలో.. రూ.10.69 కిలోమీటర్ల మేర రూ.422.12 కోట్లతో.. జంక్షన్ తొలగింపు, ప్రయాణికుల రవాణా సదుపాయాల సౌలభ్యం కోసం భూమిపూజ కార్యక్రమం జరగనుంది..
ధర్మోజిగూడ వద్ద రూ.37.68 కోట్లతో 6 లేన్ అండర్పాస్, సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం భూమిపూజ జరగనుంది.
హైదరాబాద్ – బెంగళూరు సెక్షన్లో.. బాలానగర్ వద్ద రూ.31.56 కోట్లతో 6లేన్ అండర్ పాస్ కు శంకుస్థాపన చేయనున్నారు.
హైదరాబాద్- యాదగిరి సెక్షన్లో.. అంకుశాపూర్ వద్ద 6లేన్ అండర్ పాస్ శంకుస్థాపన చేయనున్నారు.
హైదరాబాద్-యాదగిరి సెక్షన్లో.. అంకుశాపూర్ వద్ద 6లేన్ అండర్ పాస్ వద్ద భూమిపూజ కార్యక్రమం జరగనుంది.
హైదరాబాద్- యాదగిరి సెక్షన్లో.. ఘట్కేసర్ జంక్షన్ వద్ద రూ.68 కోట్లతో.. 6లేన్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరగనుంది.
నాగ్పూర్ – హైదరాబాద్ సెక్షన్లో.. కోమట్పల్లి జంక్షన్, వల్లూరు జంక్షన్ ల అభివృద్ధి, 6లేన్ అండర్పస్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.
ఇలా.. అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిలో నిరంతర కృషితో అనేక సహాయసహకారాలు అందిస్తోంది.తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయలేదు. కులాల సర్వే మాత్రమే చేసింది. అది కూడా తూతూమంత్రంగా ముగించింది. కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో బీసీలకు అన్యాయం చేసేలా.. మత ప్రాతిపదికన ముస్లింలను బీసీ జాబితాలో చేర్చింది. కులగణన అంటే రాజ్యాంగం ప్రకారం, చట్టప్రకారం చేయాలి. భారత ప్రభుత్వం కులగణన చట్టం ఆధారంగా జనాభా లెక్కలతో పాటు పక్కాగా దేశంలో కులగణనను చేపట్టనుంది.

మారుమూల ప్రాంతాల్లోని ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి, ప్రతి ఇంటికి వెళ్లి పారదర్శకంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేయనుంది. దేశంలో మొదటిసారిగా వచ్చే సంవత్సరంలో కులగణన చేసేందుకు ఒక చారిత్రాత్మకమైన, సంచలనమైన, నిర్మాణాత్మక, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్ణయం తీసుకుంది.

LEAVE A RESPONSE