Home » జులై 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ‘స్టాప్ డయేరియా’

జులై 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ‘స్టాప్ డయేరియా’

-కేంద్రం ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ సర్వ సన్నద్ధం
-ఐదేళ్లలోపు చిన్నారుల్లో డయేరియా మరణాల్ని నిరోధించడమే లక్ష్యం

అమరావతి: జులై 1 నుండి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ‘స్టాప్ డయేరియా’ అవగాహన ,ప్రచార, కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సర్వ సన్నద్ధమయ్యింది. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ , స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు దిశానిర్దేశం మేరకు అన్ని జిల్లా, సెకండరీ హెల్త్ ఆసుపత్రులు , వైద్య ఆరోగ్య శాఖాధికారులకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ యస్. వెంకటేశ్వర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ప్రాణాంతకంగా మారుతున్న డయేరియా వ్యాధిని నిరోధించి మరణాల బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ‘స్టాప్ డయేరియా’ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ మేరకు జూన్ 14 నుండి సన్నాహక చర్యల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టగా , జులై 1 నుండి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది.

డయేరియా (నీళ్ళ విరోచనాల) కారణంగా సంభవిస్తున్న చిన్నారుల మరణాలను నిరోధించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. ఇప్పటికే అమలులో ఉన్న డయేరియా నివారణ కార్యక్రమంలో ఐదేళ్లలోపు పిల్లలకు ఓఆర్ఎస్ ఇవ్వడంతో పాటు రెండు వారాల పాటు జింక్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. దీన్ని మరింత విస్తరించి కొత్తగా రూపొందించిన స్టాప్ డయేరియా కార్యక్రమంలో ఐదేళ్లలోపు పిల్లలకు 2 ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు 14 రోజులకు సరిపడా జింక్‌ ట్యాబ్లెట్లను కూడా అందజేస్తారు.

అంతేకాకుండా డయేరియా వ్యాధి నిరోధానికి పూర్తి స్థాయిలో తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు గాను 2 నెలల పాటు సుదీర్ఘ ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం అమలులో వైద్య ఆరోగ్య శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, పట్టణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమం , గిరిజన సంక్షేమం వంటి పలు ప్రభుత్వశాఖలు భాగస్వామ్యమయ్యేలా వైద్య ఆరోగ్య శాఖ స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

ఐదేళ్లలోపు చిన్నారుల్లో నీళ్ల విరేచనాల నిరంతర సమస్యను పరిష్కరించడానికి, మరణాలను పూర్తి స్థాయిలో నిరోధించడానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దీర్ఘకాల ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్‌నైట్ (ఐడిసిఎఫ్) కార్యక్రమాన్ని ‘స్టాప్ డయేరియా ‘ పేరుతో కొత్తగా రూపొందించింది. 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం, డయేరియా సమస్యను నిరోధించడం, దాని నుండి చిన్నారులను రక్షించడం, చికిత్స అందించడం వంటి చర్యలు తీసుకుంటోంది.

తాజాగా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)తో పాటు జింక్ ట్యాబ్లెట్ల వినియోగాన్ని పెంచడంపై దృష్టి సారించింది. కాగా కొత్తగా చేపట్టిన ఈ కార్యక్రమంలో డయేరియా , వ్యక్తి గత , పరిసరాల పారిశుధ్య నిర్వహణ, చేతులు శుభ్రంగా కడుక్కోవడం , టాయిలెట్ల నిర్వహణ , శుభ్రత , చిన్నారులకు ఓఆర్ఎస్ అందించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ రెండు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మొదటి దశలో స్టాప్ డయేరియా సన్నాహక కార్యక్రమం జూన్ 14 నుండి 30 వరకు వరకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టగా , రెండో దశ కార్యక్రమాన్ని జూలై 1నుండి ఆగస్టు 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది.

ఈ సమయంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఆశా వర్కర్లు , ఎఎన్ ఎం , సిహెచ్వో ల ద్వారా పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఐదేళ్లలోపు పిల్లలున్న ఇళ్లకు వీరు వెళ్లి డయేరియా బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, డయేరియా బారిన పడ్డాక ఏంచేయాలి అనే అంశాలపై అవగాహన కల్పిస్తారు.

డయేరియా సోకిన వెంటనే ఓఆర్ ఎస్ ద్రావణాన్ని తయారు చేయడం , వాడడం వంటి విషయాల్ని వివరించడమే కాకుండా డయేరియా ఉన్నట్లు సమాచారమందిస్తే 14 రోజులకు సరిపడా జింక్ ట్యాబ్లెట్లను కూడా అందించేలా చర్యలు తీసుకుంటారు.

దీంతో పాటు వ్యక్తిగత, పరిసరాల శుభ్రత, టాయిలెట్ల నిర్వహణ , సబ్బు తో చేతులు కడుక్కోవడం , సురక్షిత నీటి వాడకం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రచార సామగ్రిని ఆశా‌‌, ఎఎన్ ఎం , సిహెచ్వో ల బృందాలకు అందజేసింది. స్టాప్ డయేరియా సన్నాహక కార్యక్రమాన్ని జూన్ 24న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖామంత్రి జె.పి.నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించిన విషయం తెలిసిందే.

స్టాప్ డయేరియా ప్రచారంలో ప్రధానాంశాలు
ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆరోగ్య వసతుల్లో సరైన నిర్వహణ, అవసరమైన వైద్య సామాగ్రి (ఓఆర్ఎస్, జింక్) లభ్యతను నిర్ధారించడం.

స్వచ్ఛమైన నీటిని అందుబాటులోకి తేవడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం. సురక్షితమైన తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందించడానికి పటిష్టమైన నాణ్యతా నియంత్రణ చర్యలు, స్థిరమైన పద్ధతుల్ని అమలు చేయడం, పోషకాహార కార్యక్రమాల్ని మెరుగుపరచడం, మెరుగైన పోషకాహార కార్యక్రమాల ద్వారా అతిసార వ్యాధులకు ప్రధాన కారణమైన పోషకాహార లోపాన్ని పరిష్కరించడం, పరిశుభ్రతకు సంబంధించి అవగాహన కార్యక్రమాల్ని ప్రోత్సహించడం, సమగ్ర పరిశుభ్రత విద్యా కార్యక్రమాల ద్వారా పిల్లల్లో అవగాహన కల్పించేందుకు పాఠశాలల్ని సన్నద్ధం చేయడం, అలాగే ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడం వంటి కార్యక్రమాల్ని చేపట్టేలా స్టాప్ డయేరియాను రూపొందించారు.

Leave a Reply