విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రష్యా ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్రాన్ని సందర్శించింది. పరిశ్రమ, వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతినిధులు, రష్యన్ యూనియన్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్స్ అండ్ ఆంట్రప్రెన్యూర్స్, ప్రముఖ విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు ఈ బృందంలో పాల్గొన్నారు. ఈ సమావేశం టెక్నికల్, వొకేషనల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ రంగంలో అంతర్జాతీయ సహకారానికి ఒక కీలక మైలురాయిగా నిలిచింది.
విశాఖపట్నం లోని ఫోర్ పాయింట్స్ షెరటాన్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ ఏపీఎస్ఎస్డీసీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గణేష్ కుమార్ ప్రారంభించారు. రష్యన్ బృందానికి ఆర్ఎస్పీపీపీ డిప్యూటీ చైర్మన్ ఇవనోవ్ మైఖేల్ సారథ్యం వహించారు. మెకానికల్, ఎలక్ట్రికల్, వెల్డింగ్, మెటలర్జీ రంగాల్లో నైపుణ్యం కలిగిన 12 మంది ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. సీతా శర్మ , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు.