Suryaa.co.in

Andhra Pradesh

తిరుమల ఘాట్ రోడ్డులో ఓవర్ టేకింగ్ చేస్తే కఠిన చర్యలు

తిరుమల: వేసవి సెలవులు కారణంగా తిరుమలకు భక్తుల‌ తాకిడి పెరిగిందని అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు. రెండవ ఘాట్ రోడ్డులో 10 వేల వాహనాలు, మొదటి ఘాట్ రోడ్డులో 8 వేల వాహనాలు వెళ్తున్నాయని ఏఎస్పీ చెప్పారు. గత రెండు వారాల నుంచి ఘాట్ రోడ్డులో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఘాట్ రోడ్డులో ఓవర్ టేకింగ్ చెయ్యొద్దని సూచించారు.

ఘాట్ రోడ్డులో వాహనాలు పక్కన పెట్టి సెల్ఫీలు దిగే ప్రయత్నం చేయొద్దని, టైం లిమిటేషన్ కూడా తిరిగి పునరుద్ధరిస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. ఓవర్ స్పీడ్‌గా వచ్చి వాహనాలను దివ్యరామం వద్ద నిలిపి ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.

మొదటి ఘాట్ రోడ్డులో ఒకటో కిలో మీటరు వద్ద వాహనాలు ఆపుతున్నారని, ఇంటిగ్రేటెడ్ స్పెషల్ టీంగా ఏర్పడి బ్లాక్ స్పాట్స్ వద్ద భక్తులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అలిపిరి వద్ద వాహనాలను తనిఖీ చేయడంతో పాటుగా డ్రైవర్లను ఆరా తీసి‌ తిరుమలకు పంపుతున్నామని, 15 సంవత్సరాలు దాటిన వాహనాలను ఘాట్ రోడ్డులో నిషేధించడంపై ప్రతిపాదన పంపినట్లు ఏఎస్పీ వెల్లడించారు.

ఇంకా ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఫిట్‌నెస్ పత్రాలు తీసుకొస్తే వాహనాలు తిరుమలకు అనుమతిస్తున్నామన్నారు. ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డులో నిబంధనలు అమలు చేస్తున్నామని అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు.

LEAVE A RESPONSE