Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల్లో పటిష్ట నిఘా

-కలక్టరేట్లు,అసెంబ్లీ,పార్లమెంట్ ఆర్ఓ కార్యాలయాల్లో 982 పోస్టులు మంజూరు
-పటిష్ట నిఘాకై 105 అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు
-ఈచెక్ పోస్టుల ద్వారా రూ.2.35 కోట్లు నగదు,51వేల 143 లీటర్ల మద్యం స్వాధీనం
-ఎన్నికలతో సంబంధం ఉన్నతాధికారుల బదిలీ దాదాపు పూర్తి
-పోలింగ్ కేంద్రాల్లో మరుగుదొడ్లు, విద్యుత్,ర్యాంపులు సౌకర్యాలు త్వరగా కల్పించాలి
-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి

వెలగపూడి : రానున్నసాధారణ ఎన్నికల పటిష్ట నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం (కలక్టరేట్లు), అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు 982 పోస్టులను మంజూరు చేయడం జరిగిందని, ఆ పోస్టులను త్వరగా భర్తీ చేసుకోవాలని జిల్లా కలక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు.

గురువారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాతో కలిసి ఆయన ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఎన్నికలతో సంబంధం ఉండి మూడేళ్ళు సర్వీసు పూర్తి చేసుకున్నవివిధ శాఖల అధికారుల బదిలీ ప్రక్రియ దాదాపు పూర్తయిందని పేర్కొన్నారు.

ఇప్పటికే పిఆర్ అండ్ ఆర్డీ,ఎక్సైజ్,స్పెషల్ ఎన్ఫోర్సు మెంట్ బ్యూరోల్లో బదిలీల ప్రక్రియ పూర్తి అయిందని అన్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల్లో కొంత మేరకు బదిలీలు జరగగా మిగాతా బదిలీలు ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో బదిలీలు కూడా రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

రానున్న ఎన్నికల్లో పటిష్ట నిఘాకై రాష్ట్ర వ్యాప్తంగా 105 అంతర్ రాష్ట్ర చెక్కు పోస్టులను ఏర్పాటు చేయగా వాటిలో 20 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు కాగా పోలీసు శాఖ ద్వారా 62, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో ద్వారా 9,అటవీశాఖ ద్వారా 14 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని సిఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

గత నెల రోజుల్లో అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు ద్వారా 2కోట్ల 35 లక్షల రూ.ల నగదు, 51వేల 143 లీటర్ల మద్యం,1323 కిలోల వివిధ మాదక ద్రవ్యాలను,ఇతర విలువైన లోహాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఈచెక్ పోస్టులన్నీ రానున్న రోజుల్లో మరింత సమర్ధవంతంగా పనిచేసి అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలకు సంబంధించి ముఖ్యంగా తాగునీరు, పర్నిచర్, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు, దివ్యాంగులకు ర్యాంపులు ఏర్పాటు వంటి సౌకర్యాలను త్వరిత గతిన ఏర్పాటు చేసేందుకు జిల్లా కలక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిఎస్.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ రానున్న ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ లాజిస్టిక్ ఏర్పాట్లకు ఇప్పటి నుండే తగిన చర్యలు తీసుకోవాలని కలక్టర్లను ఆదేశించారు.ఇంకా ఎన్నికల సన్నద్ధకు సంబంధించి తీసుకోవాల్సిన ఇతర అంశాలపై కలక్టర్లకు వివరించారు. ఈసమావేశంలో అదనపు సిఇఓ కోటేశ్వరరావు, పిఆర్ అండ్ ఆర్డి కమీషనర్ సూర్యకుమారి,వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE