Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో కులగణన చేపట్టడం చరిత్రాత్మకం

– కులగణన చేపట్టడం వల్ల 145 బీసీ,58 ఎస్సీ ,ఎస్టీ కులాలవారికి సముచిత న్యాయం
– రాష్ట్రంలో కులగణనను చేపట్టడం బీసీ మంత్రిగా నాకు లభించిన గౌరవం
– ప్రయోగాత్మకంగా నేలపర్తిపాడులో రెండు క్లస్టర్లలో కులగణన ప్రారంభం
– బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ

గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించిన మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చరిత్రాత్మకమైన నిర్ణయంతో కులగణనకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వెల్లడించారు.

బుధవారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం నేల పర్తిపాడు గ్రామంలోని రెండు క్లస్టర్లలో బీసీ కులాల సమగ్ర కుల గణన ప్రక్రియ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం రాకపూర్వం కుల గణన జరిగిందని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జనాభా గణన జరిగింది, తప్ప కులగణన జరగలేదన్నారు. కుల గణన చేపట్టాలని ప్రయత్నాలు జరిగినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన జరగలేదన్నారు. బీసీ కులాల మనోవభావాలను పరిగణలోకి తీసుకొని వారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు.

పేదరికంలో మగ్గుతున్న, పేదరికం శాపంగా భావిస్తున్న ఆయా వర్గాల్లో సమాన అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో కులగణను చేపట్టడం అందులో భాగంగా రామచంద్రపురం నియోజవర్గం లోని నేలపార్తిపాడు గ్రామంలో చేపట్టడం బీసీ మంత్రిగా తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కులగణన వలన రాష్ట్రంలో 145 బీసీ, 58 ఎస్సీ, ఎస్టీ కులాల వారికి సముచితమైన న్యాయం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.

బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో అట్టడుగున ఉన్నవారికి కనీస మౌలిక వసతులు కల్పించి, వారు సుఖంగా జీవించాలని కోరుకున్నారన్నారు. అదేవిధంగా గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా గ్రామ స్వపరిపాలన ఉండాలని మహాత్మా గాంధీ ఆకాంక్షించారన్నారు.

సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని మహిళలకు సముచిత గౌరవం దక్కేలా, ప్రతి పథకంలో మహిళలకు పెద్ద పీట వేస్తూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.

LEAVE A RESPONSE